పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా తెలంగాణాది

2 comments
కోటి గొంతులను ఒక్కటిగా ముడి బిగించిన గొంతు శాశ్వతంగా మూగబోయింది. నాలుగు కోట్ల గుండెల్లో ఉద్యమ జ్వాల రగిలించిన చైతన్య జ్యోతి ఆరిపోయింది. తెలంగాణా పోరాట అస్తిత్వ రేఖాచిత్రం కనుమరుగైపోయింది.  జనం కోసం ఇంతగా గళం విప్పిన వ్యక్తి.. ధిక్కారమే జీవితంగా  గడిపిన వ్యవస్థ.. ప్రజల బాధల్ని తన బాధలుగా మలచుకున్న మనీషి.. పోరు గడ్డ ఓరుగల్లు నుంచి జ్వాలగా ఎగసి విప్లవ వీరులను శాసించిన యోధుడు.. కొత్తపల్లి జయశంకర్‌..
పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది.. జీవితమంతా లోకం కోసం ధారపోసిన కాళోజీ మాటలను నిజం చేసినవాడు.  అన్యాయాన్ని ఎదిరించటం కోసం ఊపిరి ఉన్నంతకాలం ఉద్యమించిన వాడు.. ప్రజల్ని చైతన్యపరిచేందుకు  విప్లవోద్యమ పూలను లోకమంతటా విరజిమ్మిన వాడు..
తన ప్రజల కోసం.. తన సమాజం కోసం ఇంతగా పరితపించిన వాడు గత దశాబ్ది కాలంలో మరొకరు లేరు.. వ్యక్తిత్వాన్ని మించిన వ్యవస్థ జయశంకర్‌. తానే ఉద్యమమై.. తానే సిద్ధాంతమై.. ఊపిరై నిలిచిన వాడు..  తెలంగాణా చుట్టూ కమ్ముకున్న చీకట్లను తొలగించేందుకు ఊపిరున్నంత కాలం ప్రయత్నించాడు. ఎవరినీ నొప్పించిన వాడు కాదు.. ఆ సిద్ధాంతాన్ని అంగీకరించిన వాళ్లూ.. లేని వాళ్లూ సైతం ఆయన పట్ల ఆప్యాయత ప్రకటించుకునేలా చేసుకున్నవాడు.. సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం అన్నది అరుదుగా కనిపించే విషయం. ఆ సిద్ధాంతం కోసమే ఆయన బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు.. తెలంగాణ ఉద్యమం గురించి ఆయనతో ప్రస్తావించినప్పుడల్లా.. మా పోరాటం ఫలితమిస్తే.. ఆ ఫలాల్ని మీకందించాలన్నదే నా తపన అని అన్నవాడు.. తెలంగాణా తప్ప ఆయన దేన్నీ స్వీకరించలేదు..అంగీకరించలేదు.. మసిపూసి మారేడుకాయ చేసే రాజకీయాలను రాసుకుతిరగలేదు.. తెలంగాణ రాష్ట్రసమితి తన మాటే వేదంగా భావించినా.. సలహాలకే తప్ప సభ్యత్వం జోలికి కూడా పోని వాడు. నాలుగున్నర దశాబ్దాల ఉద్యమానికి ఆయన సాక్షీభూతం. దశాబ్దకాలపు పోరాటానికి విజయసారథి.  తన వారికి విముక్తి కల్పించటం కోసం.. తన వారికి భుక్తి కల్పించటం కోసం.. తాను పుట్టిన నేలను స్వర్ణమయం చేయటం కోసం అంపశయ్యపై కూడా శ్రమించాడు.. ఆయనకు ఇజాలు లేవు.. ఉన్నదల్లా తెలంగాణాయే.. ఆయన కోరుకున్నదల్లా తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం అంతరించటాన్నే.. ఆ అన్యాయాన్ని ఎదిరించేందుకు.. ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేసిన వాడు. అతిథి మాదిరిగానే ఉన్నట్లు కనిపిస్తూనే అంతా తానే అయి నడిపించాడు.. పల్లెలు.. పట్టణాలు అనక.. పల్లేరు కాయై తిరిగిన వాడు.. తన కలను నిజం చేసుకోకుండానే అవని విడిచి వెళ్లిపోయాడు..

జయశంకర్‌ కన్నుమూశారు

11 comments
తెలంగాణా సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్‌ (76) ఈ ఉదయం హన్మకొండలో కన్నుమూశారు.. ఆయన గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు.. రేపు మధ్యాహ్నం వరంగల్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి.

మేధావులకు వందనం

48 comments
శ్రీ తాడేపల్లి లలితా సృబ్రహ్మణ్యం గారు...
నమస్కారం..
మీరు తాజాగా చేసిన వ్యాఖ్య మరోసారి ఆలోచించేదిగా ఉంది. ధన్యవాదములు.. తెలంగాణా కోసం జరుగుతున్న చర్చలో మీరు మేధావి.. నిజమే.. మీ లాంటి వారు ఈ చర్చాకార్యక్రమంలో పాల్గొనటం చాలా అవసరమే.. తెలంగాణా రాకపోవటం ఎందుకు మంచిదో మీరు ముందు నుంచీ వివరిస్తున్నారు.. వీళ్లకే అర్థం కావటం లేదు.. మీరు ప్రస్తావించిన అంశాలనే నేనూ చర్చించదలచుకున్నాను.. అంశాల ప్రాతిపదికన ఒక్కొక్కటే మాట్లాడుకుందాం..వీలైతే.. టైమ్ ఉంటే.. అంశాల వారిగా విడివిడిగా..డొంకతిరుగుడు లేకుండా సూటిగా చర్చించండి..
తెలంగాణా గురించి కాసింత మంచి మాట్లాడే వారందరికీ తలపొగరని మీరు భావిస్తున్నారు.. సంతోషం.. ఇక్కడ మేధావి తనానికి అవకాశం లేదనీ మీరన్నారు. కానీ, మీరు మాట్లాడుతుంటే తెలంగాణా వాదులనుకునే మేతావులంతా వింటున్నారు.. తెలంగాణా భావోద్వేగాలను పనికిమాలినవిగా కొట్టిపారేశారు ధన్యవాదములు.. తెలంగాణా గురించి మాట్లాడే వాళ్లంతా మెదడు లేకుండా.. మాట్లాడుతున్నారనీ ఎద్దేవా చేశారు.. సంతోషం.. మేధావితనం అంటే ఎదుటి వాళ్లు చెప్పేది వినకుండా తాము మాట్లాడేది మాత్రమే సరైనది.. ఇదే కరెక్టని.. దీన్నే ఎదుటివాళ్లు ఇష్టం ఉన్నా..లేకున్నా అంగీకరించాలని భావించటమో.. ఏమో.. చిన్నవాణ్ణి నాకైతే తెలియదు.. నేను మేధావిని కాను.. మీరు చెప్తే తెలుసుకుంటా..
తెలంగాణా రాష్ట్రం ఎందుకు రాకూడదో.. మీరు తొలి కామెంటులో కొన్ని కారణాలు చెప్పారు.. వాటిని గురించి ప్రస్తావించాలి.. తెలంగాణాలో బాగుపడాలంటే ఇక్కడ పని సంస్కృతి మెరుగుపడాలని మీరే చెప్పారు.. మీకు అవగాహన ఎంత వరకు ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఇక్కడ ఏసి రూముల్లో కూర్చుని.. ఏసి కార్లలో తిరిగే అలవాటు కానీ, స్థోమత కానీ ఎవరికీ తెలియదు.. ఇక్కడ పని చేస్తేనే గుక్కెడు నీళ్లు.. పిడికెడు కూడు దొరుకుతుంది. (కూడు అన్నది అచ్చమైన తెలుగు పదం.. అన్నం అన్నది సంస్కృతం..) పని చేయటం మాత్రమే ఇక్కడి వాళ్లకు తెలిసిన ఒకే ఒక విద్య.. గొడ్డు చాకిరీ చేయటం తప్ప.. దాష్టీకం చేయటం ఇక్కడి వాళ్లకు తెలియదు.. శాతవాహనుల కాలం నుంచి వాళ్లు చేస్తున్నది పనే.. వాళ్లు పని చేయటం వల్లనే ఇక్కడి నుంచి అద్భుతమైన నిర్మాణాలు వెలుగుచూశాయి. దాదాపు 280 కోటలు.. బురుజులు తెలంగాణాలో మాత్రమే ఉన్నాయి. ఆ తరువాత నిజాం కాలంలోనూ వాళ్లే పని చేశారు.. ఇప్పుడు దురదృష్టవశాత్తూ తోటి తెలుగువాళ్లమని చెప్పుకునే వారి కాలంలోనూ వాళ్లే పని చేస్తున్నారు.. గతంలో సర్దార్ పాపారాయుడు అని ఎన్టీరామారావుగారు ఒక సినిమా తీశారు 1984లో.. అందులో ఓ కేరెక్టర్ చెప్తుంది.. ‘‘ మా వంటవాడు భారతీయుడు.. మా తోట వాడు భారతీయుడు.. మా పని వాడు భారతీయుడు..’’ అని అంటూనే.. భారతీయులంతా నా సోదరులని చెప్తాడు.. ఇప్పుడు ఉన్నది అచ్చంగా అదే పరిస్థితి..
ఇక రెండవది.. ఇక్కడ అక్షరాస్యత మెరుగుపడటం.. 1956కు ముందు నిజాం కాలంలో ఉన్న చదువు సంధ్యలకు ఇప్పటికి ఉన్న తేడా మీకు తెలియకపోవచ్చు..నిజాం కాలంలో చదువుకుని మేధావులైన మహాపురుషులెందరో అటు నిజాం రాజ్యాన్ని వైభవోపేతం చేశారన్న సంగతి మీకు తెలుసనే అనుకుంటున్నా..వలస వచ్చిన ముస్లిం అధికారులు అధికారాన్ని చెలాయించారే తప్ప.. ఇక్కడ రాజ్యాన్ని సుశ్యామలం చేసి దేశంలోనే సంపన్నతను సాధించి పెట్టిన వాళ్లు తెలంగాణా ప్రజలే. ఇక్కడి వ్యవసాయం.. ఇక్కడి నిర్మాణ నైపుణ్యం.. ఇక్కడి విద్యావైభవంతో నిర్వహించిన పత్రికలు..సెంట్రలైజ్‌డ్ ఏసి వంటి టెక్నాలజీ..  మద్రాసు కంటే ముందు ఇక్కడ జరిగిన విద్యుదుత్పత్తి.. అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి ఇక్కడ ఉండింది..  కాకపోతే దాన్ని మీరు కప్పిపుచ్చుతున్నారు.. (వాస్తవానికి ఈ వనరుల కోసమే..ఆంధ్ర తెలంగాణాను బలవంతంగా కలుపుకుంది). చదువులో వెనుకబడటానికి కారణం 1956 మెర్జ్ మాత్రమే.. 1956 మెర్జ్ తరువాత ఇక్కడ డెలిబరేట్‌గా విద్యావకాశాలను తొక్కి పారేశారు.. తాము అక్రమంగా ఆక్రమించుకున్న హైదరాబాద్‌లో మాత్రం విద్యకు సంబంధించిన వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేసుకుని.. మిగతా తొమ్మిది జిల్లాలకు మొండిచెయ్యి చూపించారు.. తెలంగాణా అంటే హైదరాబాద్ మాత్రమే అని ఒకానొక భావనలో ఉండిపోయారు. కాగితాల్లో లెక్కల్లోకొచ్చేసరికి తెగ చెప్పేస్తారు..  తొమ్మిది జిల్లాల్లో ఎలాంటి పరిస్థితి ఉన్నదన్నది ఎవరికీ అక్కర్లేదు.. వీటి గురించి మాట్లాడితే మీకు తలపొగరుగా కనిపిస్తుంది.. మెదడు లేని వాళ్లుగా కనిపిస్తారు.. తెలంగాణాలో అక్షరాస్యత పెరగాలన్నారు.. ఎలా చేసే పెరుగుతుందో మీరు చెప్పగలరా? శ్రీచైతన్య, నారాయణ టెక్నోస్కూళ్లు గల్లీకొకొటి కుప్పలు తెప్పలుగా తెచ్చిపోసి ఎల్‌కెజికి 50 వేల చొప్పున నిలువుదోపిడీ చేయించుకోవటం వల్ల పెరుగుతుందా? ఈ స్కూళ్లలో చదువుకోవటమేనా అక్షరాస్యత పెరగటం? తొమ్మిది జిల్లాల్లో అక్షరాస్యత ఎలా పెరుగుతుంది? బాసరలో ఐఐటి పెట్టాలంటే.. దాన్ని దిగ్విజయంగా గండికొట్టి అది కూడా తెచ్చి హైదరాబాద్‌లో పడేసిన మేధావితనం ఎవరిది? ఎయిర్‌పోర్ట్ లేదనో.. మరో కుంటి కారణాలు తెచ్చి చూపి.. అక్కడ ఒక పెద్ద విద్యాసంస్థ రాకుండా చేసిన ఘనత ఎవరిది? ఒక సంస్థను ఏర్పాటు చేయమని ఎందుకు కోరతారో మేధావులైన మీకు తెలియంది కాదనే నేననుకుంటున్నా... ఒక సంస్థను ఏర్పాటు చేయటం వల్ల దానికి అనుబంధంగా ఆ ప్రాంతానికి చాలా సౌకర్యాలు వస్తాయి.. దాని వల్ల మౌలిక వనరులు.. సదుపాయాలు పెరుగుతాయి. దాని వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.. అక్కడ ఏమీ లేదనే అది కావాలని అడిగింది.. అది వస్తే అన్నీ వస్తాయని ఆశపడింది.. అది లేకుండా.. రాకుండా చేసిందెవరు? తోటి తెలుగువాడు. తెలంగాణా అభివృద్ధికి ఇది ఒక మచ్చుతునక.
ఇక తరువాతి విషయం.. ఇక్కడ మొబిలిటీ లేదన్నారు.. మొబిలిటీ అంటే కేవలం హైదరాబాద్‌కు మాత్రమే వచ్చి ఉండటం కాదని నేననుకుంటున్నా.. నిజమేమిటో మీరే చెప్పాలి.. మొబిలిటీ అంటే ఇక్కడ ఉపాధి దొరక్కపోతే దొరికిన చోటికి వెళ్లి ఎంత కష్టపడైనా సరే సంపాదించటం.. గల్ఫ్ దేశాలకు వెళ్లటం.. మహారాష్టక్రు వెళ్లటం.. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లటం.. పాట్నా వెళ్లటం... ఐరోపా దేశాలకు వెళ్లటం.. రష్యాకు వెళ్లటం.. ఎక్కడైనా.. సరే.. నాలుగు రాళ్లు దొరికితే కుటుంబాన్ని పోషించగలిగితే సంతృప్తి చెందటం..ఇది మాత్రమే వాళ్లకు తెలిసిన విద్య.. దీన్ని ఇంగ్లీషులో సోకుగా మొబిలిటీ అంటారన్న విషయం కూడా వారికి తెలియదు.. పొట్ట కట్టేసుకుని రాత్రికి రాత్రి డాలర్లు సంపాదించి.. ఆ డాలర్లను తల్లిదండ్రులకు పంపించి వాటితో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ చేసి ఏసి కార్లలో తిరగటం కాదు మొబిలిటీ అంటే... ఎక్కడికైనా వెళ్లి బతకటమే వాళ్లకు తెలిసింది.. తామున్న దగ్గరికే అన్నీ రావాలనుకుంటారనటం తమ ఆలోచనను ఎదుటివాళ్లపై ఆపాదించటమే అవుతుంది. ఇక్కడి వాళ్లు ఎక్కడికైనా వెళ్లి దుకాణాలు పెట్టుకునో.. ఉద్యోగాలు చూసుకునో బతుకుతారు.. కానీ, తోటి తెలుగు ప్రాంతానికి మాత్రం వెళ్లలేరు.. ఎందుకంటే వాళ్లను అక్కడ సహించేవాళ్లే లేరు.. అక్కడ అక్కున చేర్చుకుని సోదరులుగా ఆదరించే వాళ్లు లేరు.. అక్కడ వాళ్లకు మీరు ఇంగ్లీష్‌లో రూమ్ అన్నారే.. అది కూడా దొరకదు.. ఇది నిజం. దీని గురించి మీరు మాట్లాడరు.. ఒప్పుకోరు.. రజాకారులు దుర్మార్గంగా ప్రజలపై దాడి చేస్తున్న కాలంలో ప్రాణాలరచేత పట్టుకుని ఒక్కుదుటున పక్కనున్న విజయవాడకు వెళ్లిన తోటి తెలుగు ప్రజలను ‘గాడిద కొడుకులు ఇక్కడికి వచ్చారు.. మా ప్రాణం మీదకు’’ అని ముఖం మీదే తిట్టిన ఉదారవాద సంస్కృతి నిజంగా మేధావి వర్గానికే సాధ్యమైంది.
ప్రజాస్వామిక భావనలు లేని వారు తెలంగాణ ప్రజలని చెప్పుకొచ్చారు.. ప్రజాస్వామిక భావనలు అంటే ఏమిటి? ఇక్కడి వాళ్లకు ప్రజాస్వామిక భావనలే లేకపోతే.. 1940లలోనే ఇక్కడికి వలసలు ప్రారంభమయ్యేవి కావు.. అన్ని జిల్లాల్లో రాత్రికి రాత్రి గుంటూరు పల్లెలు పుట్టుకొచ్చేవి కావు. ఇక్కడి వాళ్లకు ప్రజాస్వామిక భావనలు లేకపోతే.. ఎక్కడికక్కడ మండలాలకు మండలాలే ఇతర ప్రాంతాల వాళ్ల పాలన పడేవి కావు. తోటి తెలుగువారితో ఇంటిగ్రిటీ కోసం ప్రయత్నించే వాళ్లు కారు. తోటి సంస్కృతిని తమదిగా సొంతం చేసుకుని తమలో అబ్సార్బ్ చేసుకునే వాళ్లు కారు. పొరుగు పండుగలను తమవిగా చేసుకుని ఆనందంగా సంబురాలు చేసుకునే వారు  కారు. ఆ ఔదార్యం ఇక్కడి సంస్కృతిలో భాగం.. అందరినీ తమవాళ్లని అనుకోవటం ఇక్కడి అమాయకత్వం.. బతుకమ్మ పండుగను మీరు ఎన్నడైనా చేసుకున్నారా? బతుకమ్మ అంటే అదీ ఒక పండుగేనా.. గడ్డిపూలు పెట్టి చుట్టూ తిరుగుళ్లు తిరిగి వెఱ్రి పాటలు పాడుకోవటం కూడా ఓ పండుగేనా అని ఎద్దేవా చేయటం ప్రజాస్వామిక భావనా? తోటి తెలుగువాణ్ణి తమ ప్రాంతంలో అడుగుపెడితే సహించలేకపోవటం.. చాపకింద నీరులా అతణ్ణి వెనక్కి వెళ్లిపోయేలా చేయటం ప్రజాస్వామిక భావనా? స్థానిక ఉద్యోగాలను రాష్ట్ర ఉద్యోగాలుగా జీవోల్లో మార్చేసుకుని స్థానికుల నోట్లో మట్టి కొట్టడమేనా ప్రజాస్వామిక భావన? మీకు తెలుసా? నీటిపారుదల శాఖలో తెలంగాణా అన్న ఒకే ఒక్క కారణం వల్ల దాదాపు రెండు వందల మంది ప్రమోషన్లు ఆగిపోయాయన్న విషయం? జిహెచ్‌ఎంసి అనే ఒక లోకల్ బాడీ సంస్థలో 80శాతంమంది ఉద్యోగులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లన్న విషయం మీకు తెలుసా? చివరకు అటవీ శాఖలో పూర్తిగా లోకల్ ఉద్యోగాలను భర్తీ చేయమని 152 జివో ఇస్తే.. వాటిని రాత్రికి రాత్రి రాష్ట్ర పోస్టులుగా మార్చి అడవితో సంబంధం లేని విజయవాడ.. గుంటూరు.. రాజమండ్రి వారికి వాటిని కట్టబెట్టిన సంగతి మీకు తెలుసా? 1969లో 24వేల ఉద్యోగాలను తెలంగాణా పొట్ట కొట్టి ఇతర ప్రాంతాల వారికి ఇచ్చారన్న ప్రాతిపదికపై ఆందోళన జరిగితే.. దాన్ని రెక్టిఫై చేసేందుకు కాసుబ్రహ్మానందరెడ్డి జివో నెం.36 రిలీజ్ చేస్తే ఎందుకు అమలు కాలేదో మీరు చెప్పగలరా? 1985లో 58, 962 ఉద్యోగాలు అక్రమంగా ఇతర ప్రాంతాలకు ఇచ్చిన పొరపాటును సవరిస్తూ.. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసైనా సరే తెలంగాణా ప్రాంతం వారికి న్యాయం చేయాలని ఎన్టీరామారావు విడుదల చేసిన జీవో ఇప్పటి వరకు ఎందుకు అమలు కాలేదో మీరు చెప్పగలరా?  సాగర్ డామ్ కట్టి గ్రావిటీతో కృష్ణా డెల్టాకు సులభంగా నీళ్లు వదులుకుని నల్గొండకు చుక్క నీరు కూడా వదలకుండా ఆ జిల్లాను ఫ్లోరిన్ బాధితురాలిగా ఎందుకు చేశారో చెప్పగలరా? ఆ జిల్లాలో డ్యామ్ కట్టి ఆ జిల్లా కోసం కట్టిన కెనాల్‌ను ఎందుకు పనిచేయకుండా ఆపేశారు? ఒక్కసారి చెప్పండి? వ్యవసాయానికి చుక్కనీరు రాకుండా చేసి.. బోర్లమీద బోర్లు వేసుకుని దిక్కులేని పరిస్థితుల్లో  వచ్చినప్పుడు కరెంటు వేసుకుని నీళ్లు వాడుకుంటే.. ఓహో.. విద్యుత్తు వినియోగంలో తెలంగాణా నెంబర్ వన్ అంటారు.. 50 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటంటే ఒక్క డ్యామ్ పూర్తి చేయకుండా.. ఎవరి మేలును ఆకాక్షించినట్లు..ఎవరికి సంక్షేమం చేసినట్లు? తోటి తెలుగువాడిగా ఇక్కడే ఉంటున్న వారిగా.. బహుశా మీరు హైదరాబాద్ కావచ్చు.. మిగతా తెలంగాణా గురించి మీకు ఎంత వరకు ఆవేదన ఉందోలేదో నాకైతే తెలియదు..
తెలంగాణాకు లేనివన్నీ ఉన్నాయని చెప్తున్నారన్నారు? ఏవి లేవో మీరు చెప్పలేదు.. మీరు చెప్పినవి అక్షరాస్యత లేదన్నది.. కానీ, ఇక్కడ అక్షరాస్యత ఉంది.. మీరు చెప్పింది మొబిలిటీ లేదన్నది.. ఇక్కడ మాత్రమే మొబిలిటీ ఉంది...మీరు చెప్పింది పని సంస్కృతి లేదన్నది అన్నింటికీ మించి ఇక్కడ మాత్రమే పని సంస్కృతి ఉంది. ఇక్కడ సోమరులు లేరు.. ఎందుకంటే మిగతా చోట్ల పని చేసినా జీవితం నడుస్తుంది.. ఇక్కడ పని చేయకపోతే పూట గడవదు.. ఇక్కడి ప్రజానీకానికి పెరిగిపోయిన సంపన్నతతో ఎంజాయ్ చేయటానికి హంసమేడలు లేవు.. వీరికి తెలిసిన ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా మాత్రమే. మీరు చెప్పింది ఇక్కడ ప్రజాస్వామిక భావనలు లేవన్నది ఇక్కడ మాత్రమే ప్రజాస్వామిక భావనలు ఉన్నవి. ఇక్కడ సృజన ఉంది.. అక్షరం రాయటం రాకపోయినా.. అద్భుతమైన సారస్వత పంటను పండించే వేనవేల పోతన్నలు ఉన్నారు..ఇక్కడి పోతన్నను అక్కడికి లాక్కుపోవాలని చూడటం వారికి తెలియదు.. ఇక్కడి కాకతీయులను రాజమండ్రికి పరిమితం చేయటం వీరికి తెలియదు.. ఇక్కడి సోమనాథుని హాల్కురికి తీసుకుపోవటం తెలియదు. మల్లినాథసూరిని.. అప్పకవిని ఎత్తుకుపోవటం వీరికి తెలియదు.. వీరికి తెలిసిందల్లా బుద్ధి కంటే ఎక్కువగా హృదయాన్ని అభిమానించటం. ఇక్కడి సంస్కృతిలో మర్యాదలు, మన్ననలు విశిష్టంగా ఉంటాయి. కులభేదాలకు అతీతంగా ఉంటాయి. గ్రామానికి గ్రామాలు ఒక కుటుంబంగా ఉంటాయి. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి, వడ్రంగి, తమ్మలి, దళిత, బేగారె, నీరడి కులాలెన్నో తెలంగాణా పల్లెల్లో మనకు కనిపిస్తాయి. వీళ్ల మధ్య అనూహ్యమైన అనుబంధాలు, బంధుత్వ పిలుపులు కనిపిస్తాయి. వినిపిస్తాయి. వారిలో ఒకరికి ఒకరు అన్న, మామ, బావ, వదిన, అక్క, ఇలా రకరకాల బంధాలు ప్రజల అనుబంధాలను పెనవేస్తాయి. ఇళ్లల్లో కూడా  ఇదే రకమైన విధానం కనిపిస్తుంది. ‘‘ఏందె నాయినా’’ అని పిలవటంలో ఉండే ఆత్మీయత, నాన్నగారూ...వదినగారూ.. మరిదిగారూ.. అని పిలవటంలో ఉండదు. ఎవరినైనా ఆప్యాయంగా అక్కున చేర్చుకోవటంలో కానీ, సహాయపడటంలో కానీ, తెలంగాణా ప్రజలు ముందుంటారు..
సరే మళ్లీ విషయానికి వద్దాం.. తెలంగాణ ఎందుకు వెనుకబడింది? ఒక్కసారి చెప్పండి? ఆంధ్ర రాష్ట్రంతో మెర్జ్ అయిన సమయానికి తెలంగాణా బడ్జెట్ 63 కోట్ల మిగులు.. ఆంధ్ర బడ్జెట్ మైనస్ 24 కోట్లు.. ఈ డబ్బు కోసమే.. ఈ మౌలిక వనరుల కోసమే.. ఈ మానవ వనరుల కోసమే.. ఆదరాబాదరాగా.. టెంట్ల కింద దిక్కులేకుండా నడుస్తున్న పాలనను చక్కదిద్దుకోవటం కోసమే షరతులతో మెర్జ్ చేసుకున్నారు. అంతే తప్ప తెలుగు వారినంతా ఒక్కటిగా చేయటం కోసం కాదన్నది మీరు గ్రహించాలి.. తెలంగాణాను బేషరతుగా కలుపుకోలేదు.. ఒప్పందం చేసుకుని మరీ కలుపుకున్నారు. ఒప్పందం ఉల్లంఘన జరిగింది కాబట్టే ఉద్యమాలు జరుగుతున్నాయి.
తోటి తెలుగువారు మీరు.. తెలుగువారు సంపూర్ణంగా సమైక్యంగా ఇప్పుడు ఉన్నారా? ఇక్కడ నిజామాబాద్‌లో ఉన్న ప్రజానీకానికి విశాఖపట్నం గురించి ఎంతవరకు తెలుసు.. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఒక జిల్లాలో ఉన్నవారికి తెలంగాణా జిల్లాల గురించి ఎంతవరకు అవగాహన ఉంది.. రెండు ప్రాంతాల మధ్య ఇంటిగ్రిటీ కోసం ఏనాడైనా.. ఎవరైనా ప్రయత్నించారా? ఇంతెందుకు? ఉద్యోగం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్లు ఎవరైనా తెలంగాణా వారితో మమేకం కావటానికి ఒక్కసారైనా ప్రయత్నించారా? ఇక్కడి సంస్కృతిని తమదిగా చేసుకున్న సందర్భం ఉందా? తెలంగాణాకు సంబంధించిన పండుగలను, పబ్బాలను, పిండి వంటలను ఏనాడైనా తమ ఇళ్లల్లో చేసుకున్నారా? ఇలా ప్రశ్నిస్తే.. మీదీ ఓ పండుగేనా? మీ తిండీ ఓ తిండేనా అంటారు? ఇక్కడి వాళ్లతో కలిసి ఉండరు.. వీళ్లను మాత్రం మీతో కలిసి ఉండాలంటారు.. అసలు మమేకమే కానప్పుడు కలిసి ఉండటం ఎలా సాధ్యమవుతుంది?
మీకు తెలియంది మరొకటుంది.. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరటం లేదు.. ఎనిమిది సంవత్సరాల పాటు సంపన్నంగా విలసిల్లిన రాష్ట్రాన్ని తిరిగి తీసుకోవాలనుకుంటోంది.
చివరగా ఒకటి సుస్పష్టం.. తెలంగాణా, ఆంధ్రా అన్నవి రెండు జాతులు.. రెండు సంస్కృతులు.. రెండు భాషలు.. రెండు జనజీవన విధానాలు.. ఇవి రెండు ఎప్పటికీ కలవవు.. బలవంతంగా రెంటినీ కలిపారు.. ఈ రెండూ కలిసి ఉండటం అసాధ్యం. ఇప్పుడు విడిపోవటాన్ని ఆపవచ్చు. కానీ, మానసికంగా విడిగా ఉన్న జాతులను శాశ్వతంగా కలిపి ఉంచటం ఎవరివల్లా అయ్యేపని కాదు.

మీ పిల్లలు మిమ్మల్ని టేకోవర్ చేశారు

4 comments
మీరు ఇద్దరు.. మీకు ఇద్దరు.. అంతా హ్యాపీగా ఉన్నారు.. కానీ, మీకు ఫ్రీడమ్ లేకుండా పోయింది. మీరు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు. మిమ్మల్ని వాళ్లు శాసిస్తున్నారు. వాళ్లు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం.. వాళ్లు కొనమంటే కొంటారు.. తినమంటే తింటారు. అంతా వాళ్ల ఇష్టమే.  మిమ్మల్ని వాళ్లే నడిపిస్తున్నారు.. మీరు నడుస్తున్నారు. మీకు తెలియకుండానే వాళ్లకు లొంగిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లు మిమ్మల్ని టేకోవర్ చేసేశారు..
మీ పెద్దవాళ్లు ఊళ్లో ఉంటున్నారు.. ఇద్దరి మధ్యా ఎలాంటి పొరపచ్చాలు లేవు. ఒకరిమాట మరొకరు కాదనరు. పిల్లలంటే అమితమైన ప్రేమ. కానీ, మిమ్మల్ని వాళ్లు శాసిస్తున్నారు. ఓ ఆటాడుకుంటున్నారు. వాళ్లేం చెప్తే మీరు అదే చేస్తున్నారు. నియంతల్లా ్యవహరిస్తున్నారు.
వాళ్లు చెప్పింది కాదనలేని పరిస్థితిలో మీరున్నారు. మీ వల్ల కాకపోయినా, అప్పుడే కాకపోయినా, కొన్నాళ్ల తరువాతైనా వాళ్ల కోరికలు తీర్చటం మీ విధిగా భావిస్తున్నారు. వాళ్లకంటే మీకెవరూ లేరు.. కొండమీది కోతిని తెమ్మన్నా తెచ్చి పెడ్తారు.. ఎందుకిలా చేస్తున్నారో మీకు తెలియదు. అయినా చేసేస్తున్నారు. వాళ్లు మీకు బాసులు.. వాళ్లు ప్రతిమాటా మీకు వేదంలా వినిపిస్తుంది.
ఎన్ని మాటలన్నా కోపం రాదు.. నిష్ఠూరాలాడినా సహిస్తారు. అలకబూనితే అనునయిస్తారు..బతిమాలుకుంటారు బుజ్జగిస్తారు.. కాళ్లు నెత్తిన పెట్టుకుంటారు.
వాళ్లు ఎవరో కాదు. మీ పిల్లలు.. అవును.. అక్షరాలా మీ పిల్లలు.. మీ పిల్లలే మీకు బాసులుగా మారిపోయారు.. మిమ్మల్ని వాళ్లు చెప్పినట్టల్లా వినేలా చేసేసుకున్నారు. మీరు స్కూటర్ కొంటే వాళ్లు చెప్పిన మోడల్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. కారు కొంటే ఎంపిక చాయిస్ వాళ్లకే.. ఫుడ్ కోర్టులో.. పిజ్జా కార్నర్‌లో, పిక్నిక్‌ల్లో , మూవీస్‌లో అన్నింటా వాళ్లే మీకు దారి చూపిస్తున్నారు. చివరకు ఇంట్లో ఏది ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? గోడలకు ఏ కలర్ వేయాలన్న  విషయాలను కూడా వాళ్లే నిర్ణయిస్తున్నారు.. తు.చ.తప్పకుండా మీరు పాటించేస్తున్నారు.
మీరు ఒక సంగతి జాగ్రత్తగా గమనించండి.. గత అయిదారేళ్లలో మీ జీతం నాలుగు రెట్లు పెరిగింది.. మామూలు పరిస్థితిలో అయితే మీ లైఫ్ మరింత కంఫర్ట్ గా సాగాలి. కానీ, అలా జరగటం లేదు.. జీతంతో పాటు అప్పులూ పెరిగిపోతూనే ఉన్నాయి.. ఇందుకు కారణం ఏమిటో తెలుసా? మీ పిల్లలు.. ఆగండాగండి.. వాళ్లేం తప్పు చేసారని తిట్టుకోకండి.. మీ పిల్లలు వాళ్లకు టార్గెట్ అయ్యారు.. అంతే మీ పిల్లలకు మీరు టార్గెట్‌గా మారిపోయారు..
ఒక్కసారి ఆలోచించండి...ఈ కింది విషయాలను జాగ్రత్తగా గమనించండి.
చిల్ట్రన్ మార్కెట్..
కిడ్స్ ఫుడ్ మార్కెట్
మార్కెట్ ఫ్యూచర్-కిడ్స్
కార్పొరేట్ టార్గెట్ -కిడ్స్

అవును.. ఇది నిజం.. కార్పొరేట్ మార్కెట్ ప్రపంచానికి ఇప్పుడొక కొత్త కస్టమర్ దొరికాడు. మార్కెట్ శక్తులన్నింటికీ ఇప్పుడతనే పెద్ద టార్గెట్.. ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ బల్బ్ వెలుగుతుందన్న సామెత కార్పొరేట్ వరల్డ్‌కు చక్కగా కలిసొచ్చింది. మీ ఇంట్లో ఒక పిల్లో , పిల్లవాడో పుట్టాడంటే, కార్పొరేట్ ప్రపంచానికి ఓ వినియోగదారుడు దొరికినట్లే.. ఇప్పుడు మీ పిల్లలు వాళ్లకు లవర్లు..  మీ పిల్లల దగ్గర మీట నొక్కితే చాలు, అక్కడ మీ పర్స్ ఖాళీ అయిపోతుంది. అంతే.. ఇప్పుడదే జరుగుతోంది.
2005 జూలై 15 అర్థరాత్రి అమెరికాలో స్కాలెస్టిక్ పబ్లిషర్స్ హెడ్ క్వార్టర్స్ ముందు దాదాపు అయిదు కిలోమీటర్ల మేర క్యూ ఉంది. వాళ్లంతా హేరీపోటర్ పుస్తకాన్ని తమ పిల్లల కోసం కొనేందుకు వచ్చిన వాళ్లు.. సరిగ్గా అర్థరాత్రి ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. మార్కెట్‌లోకి  వచ్చిన గంటలో ప్రపంచ వ్యాప్తంగా  రెండున్నర మిలియన్ల పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అమెరికాలో ప్రవాసాంధ్రులు శ్రీ గొర్తి సాయి బ్రహ్మానందం గారు కూడా ఈ హారీపోటర్ కోసం క్యూకట్టిన వాళ్లలో ఉన్నారని వారే వారి అనుభవాలను చెప్పారు.
హేరీపోటర్ కేవలం పుస్తకం కాదు.. ఇది ఒక బ్రాండ్. ప్రపంచంలో అతి పెద్ద బ్రాండ్..  మన జాతక కథలను రీప్రొడ్యూస్ చేసినట్లు అనిపించటం వరల్డ్ కిడ్స్ హేరీని ఓన్ చేసుకునేలా చేసింది. ఇందులో మాయలు.. మర్మాలు.. మ్యాజిక్ స్టిక్‌లు.. టోపీలు, టీషర్టులు, కాస్ట్యూమ్స్, వేషాలు,.. ఒకటేమిటి ప్రతి ఒక్కటీ  అమ్మకం వస్తువులుగా మారిపోయాయి. చివరకు ఈ పేరుతో వీడియో గేమ్స్ కూడా వచ్చేసాయి.  ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మార్కెటింగ్ సూపర్ నోవా. బిలియన్ల కొద్దీ డాలర్లను తెగ కుమ్మరించిన అతి పెద్ద బ్రాండ్ ఇది. ఇది బిగ్ మ్యాజిక్ కాదు.. అతి పెద్ద  వ్యాపారం ..దాదాపు 500 మిలియన్ల డాలర్ల బిగ్ బిజినెస్.
ఇవాళ ప్రపంచంలో  హేరీపోటర్ పేరు వినని పిల్లవాడు ఉండడు. అంతగా ఈ పుస్తకాన్ని, దాంతో తీసిన సినిమాలను, దాని పేరుతో తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసేసుకున్నారు.. ఇప్పుడు అర్థమైందా? మీ పిల్లలు కార్పోరేట్ వరల్డ్‌కు ఎంతగా ముద్దొస్తున్నారో..
జస్ట్ ఇమాజిన్.. మీ పిల్లవాడు డ్రైవింగ్  సీట్లో కూచుంటే.. కార్లో అయితే మీకు సంతోషంగానే ఉంటుంది. కానీ మీ లైఫ్ డ్రైవింగ్ అతను చేస్తానంటే.. ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచం రీచ్ అయిన టార్గెట్ అదే. మీ పిల్లలు మిమ్మల్ని పూర్తిగా టేకోవర్ చేసేశారు. మీకు తెలియకుండానే డామినేట్ చేస్తున్నారు. వాళ్లను హ్యాపీగా ఉంచేందుకు మీ జేబుకు చిల్లు పెట్టుకుంటున్నారు.. వ్యాపారానికి కావలసిందీ అదే కదా..                          
పిల్లలు అమాయకులు.. వాళ్లకు అన్నీ మంచిగా కనిపిస్తాయి. అంతా బాగా ఉన్నట్లే అనిపిస్తుంది. కాస్త ఆకర్షణీయంగా ఉంటే చాలు.. అది తమకే కావాలని గోల చేసేస్తారు. దాని కోసం ఇల్లుపీకి పందిరి వేస్తారు. అన్నయినా, చెల్లె అయినా తమ తరువాతే అన్నంతగా అల్లరి చేస్తారు. వాళ్లను బుజ్జగించటానికి పేరెంట్స్  పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
ఈ శతాబ్దపు తొలినాళ్లలో పిల్లలు పూర్తిగా తల్లిదండ్రుల కంట్రోల్‌లోనే ఉండేవాళ్లు. పిల్లలు ఏదైనా అడిగితే అది మంచిది కాకుంటే తల్లిదండ్రులు పిల్లలకు వద్దని చెప్పేవాళ్లు.. అవసరమైతే కోప్పడటమో.. ఇంకా అలిగితే రెండు తగిలించైనా మందలించి కంట్రోల్ చేసే వాళ్లు.. కానీ 80వ దశకానికి వచ్చేసరికి సీన్ అంతా మారిపోయింది. పిల్లలను అడపాదడపా కోప్పడ్డా.. బుజ్జగించటానికే ప్రాధాన్యం పెరిగింది. గారం ఎక్కువైంది.  ఈ గారమే ఇప్పుడు గుదిబండై కూచుంది.
వాళ్ల అమాయకత్వమే కార్పోరేట్ వ్యాపారులకు పెట్టుబడిగా మారింది. వాళ్లను ఆకర్షించటమే వాళ్ల ముందున్న  ధ్యేయం.. వాణిజ్య ప్రకటనలూ వాళ్లను దృష్టిలో ఉంచుకునే రూపొందించారు.
సినిమాలు, సీరియళ్లకూ పిల్లలే టార్గెట్ అయ్యారు. చివరకు వాళ్ల కోసం ఏకంగా టెలివిజన్ చానళ్లే వచ్చిపడ్డాయి. కార్టూన్ నెట్‌వర్క్, పోగో, డిస్నీ వండర్‌లాండ్.. ఒకటేమిటి.. పదుల కొద్దీ చానళ్లు వచ్చేశాయి.
స్టార్‌వార్స్.. 80వ దశకంలో  ఒక సంచలనం. యాక్షన్  ఓరియెంటెడ్ సీరియళ్లు, సినిమాలు కిడ్స్ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసింది. స్టార్‌వార్స్ అందులోని కేరెక్టర్లు బొమ్మలుగా మారి ఇళ్లల్లోకి వచ్చిపడ్డాయి. వీడియోగేమ్స్‌గా మారి జాయ్‌స్టిక్‌లతో ఓ ఆటాడుకున్నాయి.
స్టార్‌వార్స్ తరువాత కుప్పలు తెప్పలుగా కిడ్స్ లక్ష్యంగా కామిక్ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్స్ సీరియళ్లుగా, సినిమాలుగా వచ్చేశాయి. హిమాన్‌తో  మొదలై బ్యాట్‌మ్యాన్, సై్పడర్‌మ్యాన్ లనుంచి నిన్న మొన్నటి బెన్‌టెన్ దాకా అన్ని టీవీ షోలు, సినిమాలు పైకి చూసేందుకు పిల్లల ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే అన్నట్లు కనిపిస్తాయి. కానీ, ఇవన్నీ వాళ్ల బొమ్మలను, ఇతర ప్రాడక్ట్‌లను అమ్ముకోవటానికి చేసిన మార్కెటింగ్ స్ట్రాటెజీ అన్న విషయాన్ని ఎవరూ గ్రహించలేదు. గ్రహించేలోపే పిల్లలు పేరెంట్స్ చేయిదాటిపోయారు. ఇప్పుడు ఎవరి ఇంట్లో చూసినా హిమాన్‌లు, సై్పడర్‌మ్యాన్‌లు, బాల హనుమాన్‌లు, బెన్‌టెన్‌లు ఇవే కనిపిస్తాయి.
ఈ పరిస్థితిని  ప్రపంచంలో ఏ తల్లీతండ్రీ నియంత్రించే స్థితిలో లేరు.. ఒక రకమైన అడిక్షన్‌కు లోనైపోయారు.. దీన్నుంచి బయట పడటం అంత తేలిక కూడా కాదు.. కార్పోరేట్ మాయాజాలంలో మనం కొట్టుకుపోతున్నాం..ఎక్కడ తేలుతామో దేవుడైనా చెప్పగలడో.. లేడో...

ఎంత రసికుడు దేవుడు?

2 comments
వలపు చదువుకు ఓనమాలు నేర్పేదెవరో తెలుసా? మెరమెర లాడే వయసులో మిసమిస లాడే పరువానికి పగ్గం కట్టేదెవరు? ఒక్కసారి ఆలోచించండి.. ఆ పగ్గం కట్టలు తెంచుకుని పైపైకి వచ్చే పడచుదనానికి కళ్ళెం వేసేదెవరు? గడుసు పిల్లకు వయసును గుర్తు చేసేదెవరు? ఇంకా అర్థం కాలేదా? లంగా.. ఓణి.. తెలుగుదనానికి సింబల్ అంటూ ఏవేవో కవిత్వాలు చెప్పేస్తారు కానీ, ఎగిసే ఆడతనానికి వన్ అండ్ ఓన్లీ హిట్ కాంబినేషన్ లంగాఓణీ..      
.......................
అందుకే అంతా అనుకునేది.. అందరిముందూ అనేది.. ఎంత రసికుడు దేవుడు? అని.. ఎన్ని పువ్వులు.. ఎన్ని రంగులు.. ఎన్ని సొగసులు ఇచ్చాడు.. రంగు రంగులు రంగరించి .. ఒంపు సొంపుల్లో దాచిపెట్టి మనసుకు మతి పోగొట్టాడు. నింగీనేలా కలిసే చోటు పదే పదే ఉసిగొల్పుతుంటే కన్నె మనసుకు తోడుగా నిలిచేది  లంగా ఓణీ. స్కర్ట్‌కీ... శారీకీ ఇంటర్‌మీడియేటర్ లంగాఓణీ. కన్నెపిల్లకు కవ్వింపులు నేర్పుతుంది. అందుకుందామనుకున్న వాటిని అందనివ్వదు. వాడి చూపులకు వగలు పోతుంది. ఆశ రేపి అల్లరి చేస్తుంది. ఊగించీ.. వేగించీ హుళక్కి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పరువం మురిపెం కలగలిస్తే లంగాఓణీ. ఆ పరికిణీ చాటున దాచిపెట్టిన దోరవయసు
దా.. దా.. దమ్మంటుంటే నిలవటం ఏ మగాడికైనా తరమేనా?
..............................
మొగ్గ విరిసే తీరాలి.. సిగ్గు విడిచే పోవాలి అన్నాడు ఆత్రేయ. మనసుకవి మాట అక్షరాలా నిజం..  అమ్మాయి గౌను నుంచి చీరలోకి మారే సంధి కాలం లంగాఓణీ సొంతం. చీరలో సగం కూడా ఉండదు.. కానీ, యూత్‌లో చిచ్చు రేపుతుంది. మొగ్గ పువ్వుగా మారుతున్న టైమ్‌లో అరవిరిసే అందాన్ని అప్సరసగా మార్చేస్తుంది..చీర పువ్వు అయితే, ఈ సగం చీర మొగ్గ. రసికుల గుండెల్ని ఫిదా చేసేసే చిలిపి...ఈ హాఫ్ శారీ..
ఆకు చాటున మల్లెలాగా తడిసీ తడవని కన్నెపిల్ల అందాలు తళుకు తళుకుమని మెరుస్తుంటే.. దొంగచూపులు చూడకుండా ఉండటం మగాడికి సాధ్యమవుతుందా? అదే మరి... ఎదుగుతున్న వయసు పొంగులు లంగాఓణి చాటు నుంచి మెరుస్తూ.. మగాణ్ణి అట్టే కట్టిపడేసి మతి మాసిపోయేలా చేయవూ....అప్పుడే ఎదిగి వస్తున్న వయసు.. కోడెనాగు లాంటిది.. ఇంకా చెప్పాలంటే కొండవాగు లాంటిది.. మరీ మరీ చెప్పాలంటే కోతి పిల్ల లాంటిది..మదిలో ఉంటే మనసూరుకోదు.. ఒంటరిగుంటే ఒళ్లూరుకోదు. ఎదురుగా పరికిణీ వేసుకున్న చిన్నది కనిపిస్తే సెగపుడుతుంది.. ఉడికిస్తుంది..ఉడుకెక్కిస్తుంది.. కవ్విస్తుంది.. కైపెక్కిస్తుంది. దాచినవన్నీ చూపీ చూపకుండా దోబూచులాడుతుంది. అందుకోమని దోవ చూపినట్లే చూపి మిడిసి మిడిసి పడుతుంది. పిడికెడు నడుము.. బారెడు జడ.. మూరెడు కొంగు.. వావ్ వాటె కాంబినేషన్..హాఫ్‌శారీ కట్టిన ఒళ్లు మిలమిల లాడుతుంది. చూసే వాళ్ల కళ్లే పాపం రెప్పలు కొట్టుకోవటం కూడా మానేస్తాయి. అప్పటిదాకా ఉన్న కట్టుబాటులన్నీ తెంచేసుకుని ఉరకలు పెడుతూ కొత్తపొంగులు వచ్చేస్తాయి. వాటిలో ఎన్ని గమ్మత్తులో.. కొంగు మూరెడే అయినా పిల్లగాలికి పైటెగిరిపోతుంటే చంద్రుడికి సైతం వేడెక్కకుండా ఉంటుందా?
...................................

అక్కడే చనిపోవాలి...

0 comments
మృత్యువు. ఈ పదం అంటే మనలో భయం లేనిదెవరికి? ఈ చావును తప్పించుకోవటానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు.. ఒక మనిషి బతకడని తెలిసిన తరువాత కూడా చివరి క్షణం వరకూ అతణ్ణి బతికించటం కోసం చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. లక్షలు ఖర్చు చేసేందుకైనా వెనుకాడం.. మనకు చావంటే అంత భయం. కానీ, మృత్యువును కోరి ఆహ్వానించే వారూ ఉన్నారు.. వారికి మృత్యువు ఒక వరం.. దాని కోసం అంతదూరం వెళ్లి మరీ మరణాన్ని ఆహ్వానిస్తారు. దాని కోసం వేచి చూస్తారు. ఆనందంగా మరణిస్తారు. ఎందుకింత ఆనందం.. ఇక్కడే ఎందుకు చనిపోవాలి?   
అక్కడే చనిపోవాలి.. అక్కడ చనిపోతే కైలాసంలోకి వెళ్లి శివుడిలో ఐక్యం చెందినట్లే.. సాక్షాత్తూ శివుడి సమక్షంలో మోక్షాన్ని సాధించినట్లే.. భారతీయుల్లో వేలాది ప్రజలు మృత్యువును కోరుకుంటున్న ప్రదేశం అది. ఆ స్మశానం అతి పవిత్రం.. ఈశ్వరుడు  తాను దగ్గరుండి జీవులను తనలో ఐక్యం చేసుకునే స్మశానం.. ఏమిటీ స్మశానం ప్రత్యేకత? ఇక్కడ అంతిమ సంస్కారం కోసం ఎందుకు తాపత్రయ పడాలి? నిజంగా మరణం తరువాత మరో జీవితం అనే ఉంటుందా? దీని వెనుక మర్మమేమిటి?
-------------------
అదొక స్మశాన వాటిక. అన్నింట్లో మాదిరిగానే ఇక్కడా చనిపోయిన వారిని తీసుకువచ్చి దహన క్రియలు చేస్తుంటారు. కానీ, ఇక్కడే తేడా ఉంది. ఇక్కడ చితి మంటలకు విరామం ఉండదు.. దహన కాండకు అంతు ఉండదు.. అనంతంగా అంతిమక్రియలు జరుగుతుంటాయి. అఖండంగా చితి మంటలు కాలుతుంటాయి. ఒకదాని వెంట ఒకటిగా శవయాత్రలు జరుగుతూనే ఉంటాయి. అంతిమ సంస్కారం కోసం క్యూలు ఉంటాయి.
సమయం ఉండదు.. దహనకాండలు నిర్వహించేందుకు రోజులో ఉన్న 24 గంటలు ఎంతమాత్రం సరిపోవు. సమయం తగ్గించుకోవటానికి ఒక చితిపై మరో చితిని పేర్చేస్తారు. ఒక శవం మూడు వంతులు కాలిందో లేదో పక్కనే ఉన్న నదిలోకి తోసేసి మరో దహన కాండను చేపడతారు.. ఆ నదిలో ఆ భౌతిక దేహం భాగాలు కొట్టుకుపోతాయి.
చూసే వాళ్లకు అసహ్యం వేస్తుంది.. జుగుప్స కలుగుతుంది. భయం వేస్తుంది. శవాల్ని పూర్తిగా దహనం కూడా చేయకుండా నదిలోకి ఎందుకు విసిరేస్తున్నారన్న ఆగ్రహమూ కలుగుతుంది.. అసలు అక్కడ వేరే స్మశానాలు లేవా? వేరే చోట దహనం చేయవచ్చు కదా? అంతిమ సంస్కారాలు ప్రశాంతంగా నిర్వహించాలన్న జిజ్ఞాస చనిపోయిన వారి బంధువులకు ఉండదా? వారిని ఏం చేసినా తప్పు లేదన్న విసుగూ కలుగుతుంది..
నిజమే చూస్తుంటే పరమ భయంకరంగా కనిపించే చోటు.. ఎక్కడో, ఎప్పుడో సినిమాల్లో నరకంలో శిక్షలను చూశాం...ఇది అలాంటిదేనా? ఈ స్మశానానికి ఎందుకింత గిరాకీ.. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తూ పరమేశ్వరుడే కాటికాపరిలా ఉన్నాడు..  ఇక్కడే ఆయన నివాసమున్నాడు. ఈ చితాభస్మమే ఆయన విభూతిగా మారుతోంది. ఈశ్వరుడు కొలువైన స్మశానమది. మణికర్ణికా స్మశాన ఘట్టం అది. సత్యహరిశ్చంద్రుడు కాపలాగా ఉన్న స్మశాన వాటిక అది. ఈశ్వరుడు విశ్వనాథుడిగా ఉన్న స్మశానమది. వారణాసి... బెనారస్.. కాశీ.. క్రైస్తవులకు జెరూసలేం ఎలాంటిదో.. హిందువులకు కాశీ అలాంటిది.
...........................................
 శైవక్షేత్రానికి తోడు పవిత్రమైన గంగానదీ తీరం..  ఇక్కడ పుణ్యస్నానం ఆచరించటం, దేవుణ్ణి దర్శించటం ఎంత ముఖ్యమో, ఇక్కడ చనిపోవటం అంత ముఖ్యం. ఇక్కడికి వచ్చిన వారికి ఒకటే కోరిక.. మరణించటం. అదే స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగటమే పరమపదం. ఇది విపరీతం కాక మరేమిటి? వారణాసికి ఎందుకింత క్రేజి?               
మామూలుగా ఆధ్యాత్మిక క్షేత్రం అంటే అక్కడికి వెళ్లాలి.. నదిలో స్నానం చేసి, దేవుణ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తిరిగి వస్తాం.. కానీ, కాశీకి వెళ్తే కాటికి వెళ్లినట్లే.. కాటికి వెళ్లేందుకే కాశీకి వెళ్లాలి. దీనికి కారణం ఆ స్మశాన వాటికే.. అక్కడే దహనం కావాలి. ఆ గంగలోనే అస్థికలు కలవాలి. అప్పుడే మోక్షం కలుగుతుంది. శివసాన్నిధ్యం దొరుకుతుంది. గంగా తరంగాలలో ప్రతిధ్వనించే భక్తుల మనోరథమిది.
ఎవరేమన్నా సరే.. అసహ్యమేసినా సరే.. తమ వారి శరీరాన్ని సగం కాలగానే గంగలోకి తోసేసినా సరే.. వెనక్కి తగ్గేది లేదు. అంత్యక్రియలు ఆ ఘాట్‌లోనే జరిగి తీరాల్సిందే. ఎందుకంటే ఇది సత్య హరిశ్చంద్రుడు కాపలా కాసిన స్మశాన వాటిక. ఈ స్మశాన వాటికలో  మహా విష్ణువు తన సుదర్శన చక్రంతో భూమిని కట్ చేసి బావిని ఏర్పాటు చేశాడట. ఆ బావిలో విశాలాక్షి పార్వతీదేవి చెవిరింగులు పడిపోయాయి. అందుకే ఈ స్మశాన వాటికకు మణికర్ణిక అన్న పేరు వచ్చింది.
ఇక్కడ అణువణువూ భక్తి భూమిక అనంతంగా ఉంటుంది. ఒక విశ్వేశ్వరుడు మాత్రమే కాదు.. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. శివుడి పన్నెండు జ్యోతిర్లింగాలలో  కాశీ ఒకటి.  అన్నింటికీ మించి దేవనది గంగమ్మ ఈశ్వరుడి పాదాల చెంత నుండి ప్రవహిస్తున్నది. ఇన్ని ఆధ్యాత్మిక భావభూమికలు ఒకచోట కలగలిసిన ఆధ్యాత్మిక భూమి మరెక్కడా కనిపించదు.
ఇక్కడి గంగా నదిలో స్నానం చేస్తే సాధారణంగా కలిగే శరీర వికారాల నుంచి ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుందంటారు. ఇక్కడ విశాలాక్షిగా ఉన్న పార్వతీదేవి అన్నపూర్ణగా భక్తులను ఆదరిస్తుంది. ఎంతమంది వచ్చినా ఇక్కడ భోజనానికి లోటు ఉండదు. ఇది బెనారస్‌లోని ప్రత్యేకత. ఈ స్మశానాన్ని శివుడి కైలాసంగా భావిస్తారు కాబట్టే ఇక్కడ చనిపోవటం ఒక వరంగా భక్తులు విశ్వసిస్తారు.
........................................
మళ్లీ అదే ప్రశ్న.. ఎవరికీ అర్థం కాని.. అవగాహన లేని ప్రశ్న... జవాబు తెలియని ప్రశ్న.. అదే.. చనిపోవటం వరం అని అనుకోవటం ఏమిటి? పిచ్చితనం కాకపోతే.. ? అదీ ఇంతదూరం వచ్చి చనిపోవటం విడ్డూరం కాక మరేమిటి? అదీ ఒక చితిపైన మరో చితి పేర్చటం.. ఒక శవాన్ని కాలకుండానే మరో శవాన్ని దహనం చేయటాన్ని ఎలా అంగీకరిస్తున్నారు.. మూఢనమ్మకం కాదా ఇది? దీని వల్ల పర్యావరణ వేత్తలూ గగ్గోలు పెడుతున్నారు.. గంగమ్మ కాలుష్యమైపోతోందని.. దీనికి పరిష్కారం వెతకలేక సర్కారూ చేతులెత్తేసింది.? ఎందుకింత వెర్రి?                        ప్రపంచానికి, మన దేశానికి లైఫ్ స్టైల్‌లో చాలా తేడా ఉంటుంది. ఎంతగా వెస్ట్రన్ కల్చర్‌ను మనం అడాప్ట్ చేసుకున్నా, బేసిక్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. పుట్టుక నుంచి చావు దాకా మన లైఫ్‌స్టైల్ ఒక స్పెసిఫిక్ టార్గెట్‌తో సాగుతుంది. జీవితంలో  కుటుంబం పట్ల, సమాజం పట్ల ధర్మాన్ని నిర్వర్తించటం, తగినంత సంపాదించుకోవటం, విజయం సాధించటం, జీవితంలో సుఖాలను అనుభవించటం, కోరికలను తీర్చుకోవటం, చివరకు ప్రశాంతంగా చనిపోవటం.. ఇది ఒక ట్రెడిషనల్ లైఫ్‌స్టైల్.. దీనికి పురాణాలు ధర్మ, అర్థ, కామ మోక్షాలని పేర్లు పెట్టాయి. ఇదిగో ఈ చివరిదైన మోక్షం కోసమే కాశీలోని స్మశాన వాటికకు జనం వస్తారు.
క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దానికి ముందు నుంచే గంగానదీ తీరంలో నాగరికత అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతికా అంటూ గరుడపురాణంలోనే స్పష్టంగా కాశీ గురించి ప్రస్తావించారు. వారణాసి క్రీస్తుపూర్వం అయిదు వందల సంవత్సరాలప్పుడే ఏర్పడింది. మొదట్నుంచీ కూడా హిందూ సంప్రదాయాలను పూర్తిగా అనుసరిస్తున్న నగరం వారణాసి మాత్రమే. పుట్టడం, పెళ్లి చేసుకోవటం, జీవితంలో విజయం సాధించటం, మరణించటం.. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనిషి జీవితంలో జరగాల్సిందే. అందులో చివరిదైన మృత్యువు మాత్రం కాశీలోనే రావాలి.
కాశీ అంటే శివుడి మహా స్మశానం అని అర్థం. ఈ మహా స్మశానానికే శ్రీరాముడి పూర్వీకుడైన హరిశ్చంద్రుడు కాపలా కాశాడు. ధర్మాన్ని నిలబెట్టాడు. సత్యవ్రతాన్ని నిరూపించాడు.
సాక్షాత్తూ ఈశ్వరుడు లయకారుడై చనిపోయిన వారి ఆత్మలను తనలో లయం చేసుకుంటాడని బలమైన విశ్వాసం కాబట్టే ఈ మణికర్ణికాఘాట్‌లో అంత్యక్రియల కోసం ప్రజలు అల్లాడిపోతుంటారు. చరమాంకంలో కాశీకి వచ్చి అక్కడే శేషజీవితాన్ని గడిపేసి  ఆ స్మశాన వాటికలోనే లయమైపోతారు.
ఎందుకింత విపరీతం అన్నదానికి హేతుబద్ధత లేదు. భక్తుల విశ్వాసమే ఇందుకు ప్రాతిపదిక. భారతీయ సంస్కృతిలోని అనంతమైన మోక్ష సాధనే ఈ బలమైన కోరికకు అసలు కారణం. చనిపోయిన తరువాత ఆత్మ అనేది ఉంటుందనే నమ్మకం. ఈ ఆత్మ దేవుడిలో లీనం కావాలనే కోరిక.. ఇవన్నీ కాశీలో, అదీ మణికర్ణికా ఘాట్‌లో అంతిమ ఘట్టం పూర్తయినప్పుడే జరుగుతాయనే భావనకు హేతువులు వెతకటం సాధ్యమేనా?
-----------------------------
చనిపోవటాన్ని మనిషి తానుగా కోరుకోవటం మన జీవన విధానంలో ఉన్న గొప్ప లక్షణం. ఒక జీవితానికి ముగింపు ప్రశాంతంగా సాగిపోవాలి. మృత్యువు తప్పదని తెలిసి తెలిసీ, దాన్నుంచి పారిపోవటం వెర్రితనం.. ఎంతగా పారిపోయినా, అది రాకుండా పోదు. ఇది అందరికీ తెలిసినా, చివరి వరకూ ఏదోరకంగా దాన్నుంచి దూరం కావటానికి ప్రయత్నిస్తారు.. కానీ, కాశీకి వెళ్లిన వారికి మాత్రం జీవితం ప్రశాంతంగా ముగిసిపోవాలన్న కోరిక కలుగుతుంది. ఆ ప్రదేశంలోని గొప్పతనం అదే.. అయితే శవాల దహనకాండ ఇంత దారుణంగా ఉండటాన్ని మాత్రం ఎలా అంగీకరిస్తున్నారన్నదే ఎవరికీ అంతుపట్టని ప్రశ్న..
వారణాసికి ప్రతి నెలా దాదాపు లక్ష మంది యాత్రికులు వస్తుంటారు. గంగానదిలో రోజూ పవిత్ర స్నానాలు జరుగుతూనే ఉంటాయి. అదే సమయంలో ప్రతి నెలా దాదాపు రెండు నుంచి మూడు వేల మంది ఇక్కడికి వలసలు వస్తుంటారు. వీరంతా ఇక్కడే తమ జీవితాన్ని ముగించాలన్న ఉద్దేశంతో వచ్చేవారే.. ఇక్కడే చనిపోయే వారే.
కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో, గంగానదీ తీరంలో కనీసం వంద ఘాట్‌లు ఉంటాయి. వీటిలో ఎక్కు స్నాన ఘాట్‌లు ఉంటే క్రిమేషన్ ఘాట్‌లు పాతిక దాకా ఉంటాయి. వీటన్నింటికీ కూడా ఏదో ఒక స్థల పురాణం చెప్తారు. పురాణ కథ వినిపిస్తారు. ఇన్ని స్మశాన వాటికలు ఉన్నా, మణికర్ణికా ఘాట్‌కు ఉన్న డిమాండ్ సామాన్యమైంది కాదు.
ఈ స్మశాన వాటికలోనే ఎందుకు దహనం కావాలి? సగం కాలిన శరీరాన్ని గంగలోకి విసిరేసినా ఎందుకు ఒప్పుకోవాలి? గమ్మత్తేమిటంటే, కొందరి భౌతిక దేహాలను ఎలాంటి దహన కాండ చేయకుండానే, ఖననం లాంటి క్రియలు చేయకుండానే నేరుగా గంగలో వదిలేస్తారు. ఈ శవాలను వామాచార పద్ధతిలో రుద్రుని పూజించే అఘోరాలు సేకరించి వాటికి పూజలు చేసి ఉపాసిస్తారు. కొందరు అఘోరాలు ఈ శవాలను ఆహారంగా కూడా స్వీకరిస్తారు. సామాన్య లోకానికి అర్థం కాని భయంకరమైన జీవితాలను శవాలతో సహవాసం చేస్తూ గడుపుతారు.
ఎందుకిలా జరుగుతుంది? దీనికి కారణం లేకపోలేదు.. మనిషి చనిపోయిన తరువాత స్వర్గానికి కానీ, నరకానికి కానీ వెళ్తాడనేది నమ్మకం. కాశీలో చనిపోతే నరకబాధలు ఆత్మకు ఉండవు. ఆ బాధలన్నీ తమ భౌతిక దేహానికి ఈ భూమి మీదే అనుభవంలోకి వచ్చేస్తాయి. అన్ని రకాల శిక్షలూ ఇక్కడే లభిస్తాయి. మణికర్ణికా స్మశాన వాటికలో కాటి కాపరులు శిక్షిస్తారు.. గంగానది శిక్షిస్తుంది. అఘోరాలు శిక్షిస్తారు. ఈ జన్మలోని కర్మలన్నింటికీ ఫలితాలు ఇక్కడ అంతమైనప్పుడే లభిస్తాయి. తరువాత లభించేది మోక్షమే.
ఈ మోక్షం కోసమే కాశీకి జనం వెళ్తారు. ఈ మోక్షం కోసమే హరిశ్చంద్రఘాట్‌లో అంతిమ సంస్కారానికి ఆరాటపడతారు.. ఈ మోక్షం కోసమే మృత్యువును వరంగా కోరుకుంటారు. ఈ మోక్షం కోసమే చకోరపక్షుల్లా ఇక్కడ ఎదురు తెన్నులు చూస్తుంటారు..
సైన్స్‌కు ఇది నచ్చదు. పర్యావరణానికి ఇది సరిపడదు. హేతువాదానికి ఇది అంతుపట్టదు. భక్తి, విశ్వాసాలకు ఇది పతాక సన్నివేశం. శరీరంపై అంతులేని ప్రేమకు చితిపేర్చే మహా స్మశానం. మణికర్ణిక.. భూతనాధుడి అస్తిత్వానికి గుర్తు. మోక్ష సాధనకు ఇది చివరి స్థానం.


మూడో కన్ను

0 comments
ఒక రెప్ప తెరిచినంత మాత్రాన్నే మన్మథుడు బూడిద కుప్పగా మారిపోయాడు. ఒక రెప్ప తెరిచినంత మాత్రాన్నే మహాప్రళయమే వచ్చింది.  అది మహాదేవుడి మూడో కన్ను..  పరమేశ్వరుడి త్రినేత్రం లోకాన్నే భస్మరాశిగా మార్చేస్తుంది. ఏమిటీ త్రినేత్రం..? మనకు ముక్కోటి దేవతలున్నారు..త్రిమూర్తులున్నారు.. ఏడేడు లోకాల్లో ఉన్న వాళ్లు చాలామందే ఉన్నారు. వీళ్లలో ఏ ఒక్కరికీ  లేని త్రినేత్రం మహాశివుడికే ఎందుకు ఉంది? ఆ కన్ను అగ్ని జ్వాలలనే ఎందుకు విరజిమ్ముతోంది? ఇలా ఉండటం సాధ్యమేనా? త్రినేత్రం నిజమేనా? అంతు చిక్కని దేవరహస్యమా?  
----------------------------------------
స్మశానవాసి..చర్మాంబరధారి, బూడిద రాసుకుని తిరిగేవాడు, అన్నింటినీ వదిలేసిన వాడు, అన్నింటికీ అతీతుడు, పేరు బోళాశంకరుడు, అడిగినంతనే వరాలిచ్చే దేవుడే, కోపమొస్తే భస్మం చేయగలవాడు, మూడు కన్నులవాడు, ఆ కన్ను తెరిస్తే మిగిలేది భస్మరాశులే..
పుట్టుక ఆయనే.. మరణం ఆయనే. ప్రకృతి పురుషుల్లో ఆది పురుషుడు ఆయన.. సృష్టికి కారకుడు ఆయనే.. లయకారుడూ ఆయనే. అందుకే ఆయన పరమ ఈశ్వరుడు అయినాడు.. దేవుళ్లలో మహాదేవుడు అయినాడు. ఆయన ఎంతగా అనుగ్రహాన్ని చూపిస్తాడో.. అంతకు వెయ్యిరెట్లు ఆగ్రహాన్ని ప్రదర్శించగలడు.. ఆ కన్ను తెరవనంత వరకు బోళా శంకరుడు.. కన్ను తెరిస్తే మహా ప్రళయకారుడు.. సమస్త విశ్వాన్ని తనలో లయం చేసుకోగల రుద్రుడు.
దేవతలందరిలో మూడు కన్నులు కలవాడు ఈశ్వరుడే.. ఈయనలోనే మరో విశేషం ఉంది. లింగరూపంలో దర్శనమివ్వడం.. ప్రపంచంలో మరే దేవుడికీ లేని రూపం.. పరమ ప్రత్యేకం.  శివుడికి ఎందుకు ఇలాంటి రూపం ఉంది.  ఏమిటీ ప్రత్యేకం. మూడో కంటికీ, లింగ రూపానికి మధ్య పోలికేదైనా ఉందా? శివుడి మూడో కన్నే శివలింగమా?  అసలు మూడో కన్ను దేనికి సంకేతం? దానికీ, శివ లింగానికి మధ్య సంబంధం ఏమిటి?
------------------
మన దేవీదేవతలలో ఒక్కొక్కరు ఒక్కో రూపంలో కనిపిస్తారు. ఒక్కో వాహనాన్ని ఉపయోగిస్తారు. ఒక్కో రంగాన్ని ప్రభావితం చేస్తారు. కానీ ఉమా మహేశ్వరులు ఈ సృష్టికే ఆది దంపతులు. ఆమె ఆయనకు శక్తి. మరి ఆయనకు త్రినేత్రం ఏ విధంగా ఉంది? శివుడిలో మాత్రమే త్రినేత్రం ఉందా? లేక మనందరిలోనూ త్రినేత్రం ఉంటుందా? దానికీ శివలింగానికి ఉన్న పోలిక ఏమిటి?
పరమేశ్వరుడిలో మూడో కన్ను అంతర్లీనంగా ఉంటుంది. సాధారణ సమయాల్లో ఆయన పరమ సాధువు. బోళా శంకరుడు. కోరుకున్నదే తడవుగా కోరికలు తీర్చే మహాదేవుడు. కానీ, ఆయన లయకారుడిగా మారిపోతే ఆదిశక్తి కూడా ఆ ఆగ్రహాన్ని తట్టుకోలేదట.  పార్వతీదేవిని వివాహం చేసుకునేలా చేసేందుకు తన తపస్సును భగ్నం చేసిన మన్మథుడ్ని క్షణంలో బూడిదగా మార్చేశాడు. శివుడి మూడో కన్ను అంత శక్తిమంతమైంది. దాన్ని ఓ అగ్ని పర్వతం అని పురణాలు వ్యాఖ్యానించాయి. అందులోంచి వచ్చే అగ్ని శిఖలు సూర్యుడి కిరణాలకంటే వేల రెట్లు వేడిగా ఉంటాయిట. సాక్షాత్తూ ఆది సూర్యుడే  మూడో కన్నుగా  శివుడి భృకుటిపై కొలువై ఉన్నాడట.
ఇదంతా నిజమేనా? దేవుడు లేడని నమ్మేవాళ్లకు మూడో కన్ను గురించిన మీమాంసే ఉండదు.  దేవుడిని నమ్మే వాళ్లలో  దీనిపై వివాదమే లేదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి.. లయకారుడు కాబట్టి.. ప్రళయకాలంలో సమస్త విశ్వాన్ని అంతమొందించే బాధ్యతను తనపై మోస్తున్నాడు కాబట్టి ఆయనకు మూడో కన్ను ఉంటుంది. ఈశ్వరుడి అనంతమైన శక్తికి అది ఒక ప్రతీక.
పురాణాల సంగతి కాసేపు పక్కన పెడదాం.. మూడో కన్ను నిజంగా కన్నేనా? దీని వెనుక మర్మమేదైనా ఉందా? అంతే కాదు.. మూడో కన్ను శివుడికి మాత్రమే ఉండటం ఏమిటి? అన్న సందేహమూ రావటం సహజమే. మిగతా దేవుళ్లే కాదు.. మనుషులకూ మూడో కన్ను ఉండే అవకాశం లేదా? ఉంది. మనలోనే శివుడున్నాడు. నిజం. మనలోనే ఆయన కొలువై ఉన్నాడు. మన రూపాన్ని ధరించి ఉన్నాడు. తన మూడో కంటిని మనకు కూడా ప్రసాదించాడు. ఇది ఇప్పటి దాకా అంతుచిక్కని దేవ రహస్యం.. సైన్సు లెక్కలకు జవాబు తేలని ప్రాబ్లమ్.
మన శరీరంలోనే, మూడోకన్ను దాగి ఉంది. మన నడకను, నడతను, జీవిత మార్గాన్ని నిర్దేశించి అడుగడుగునా ఆదేశాలిస్తూ ముందుకు నడిచేలా చేస్తుంది. మనకి జ్ఞానాన్నిస్తుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. అదే పీనియల్ గ్లాండ్.. సాక్షాత్తూ పరమేశ్వరుడి మహాలింగ స్వరూపం.. ఆయన త్రినేత్రం. సమస్త విశ్వాన్ని తనలో కలుపుకునే సామర్థ్యం ఉన్న మేధ. ఒక్క మాటలో చెప్పాలంటే మన లోపల నివసిస్తున్న మహా శివుడు.
పీనియల్ గ్లాండ్.. ఏమిటిది?  ఎలా ఉంటుంది? మనిషిలో ఉండే ఈ విభాగానికి, శివుడి మూడో కంటికి సంబంధం ఉన్నదేమిటి? మన భారతీయ సంస్కృతిలో ఉన్న విశేషమే అది. భగవంతుడితో భక్తుడు అనుసంధానమై ఉంటాడు.. భక్తుడితో భగవంతుడు మమేకమై ఉంటాడు. పరమేశ్వరుడి స్వరూపం వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యం కూడా కూడా ఇలాంటిదే. శివుడి మూడో కన్ను గురించి కానీ, ఆయన లింగ రూపం గురించి కానీ, రక రకాల కథలు చెప్పుకుంటారు. పురాణాలు చెప్పే కథలు కొన్నయితే, సైన్స్ పేరుతోనో, హేతువాదం పేరుతోనో వినిపించే కథనాలు మరికొన్ని. కానీ, శివుడి మూడో కన్నుకు, మన మేధస్సులోని పీనియల్ గ్లాండ్‌కు దగ్గరి సంబంధం ఉంది.
జాగ్రత్తగా గమనించండి.. మన మెదడులో సరిగ్గా మధ్యభాగంలో ధాన్యపు గింజ ఆకారంలో ఒక గ్రంథి ఉంటుంది. అన్ని రకాల కనెక్టివ్ కణాలన్నీ ఈ గ్రంథిని చుట్టుముట్టి ఉంటాయి. దీని ఉపరితల భాగం పియల్ కాప్స్యూల్ చే చుట్టి ఉంటుంది. ఇది సరిగ్గా మిడ్ బ్రెయిన్‌లో ఉంటుంది. చాలా నరాల ఫైబర్లు ఇందులోకి చొరబడి ఉంటాయి. దీని వల్ల మన శరీరంలోని అన్ని రకాల చర్యలను పీనియల్‌గ్రంథి నియంత్రిస్తుంది.
మీరు ఒక్కసారి రెండు కళ్లూ మూసుకుని ధ్యాన ముద్రలో ఉండండి. మీ దృష్టిని రెండు కళ్ల మధ్య ఉన్న భృకుటిపై ఉంచండి.. మనసులో మీరు కోరుకున్న రూపం మీ భృకుటిపై సాక్షాత్కరిస్తుంది. మీరు మనసును, మెదడును పూర్తిగా కంట్రోల్‌లో ఉంచేందుకు ఇదే ఉపయోగ పడుతుంది. మనలోని ఆగ్రహాన్ని, అనుగ్రహాన్ని ఇదే నిర్ణయిస్తుంది. ఆగ్రహం వచ్చినప్పుడు మన భృకుటి ముడిపడటం మీరెప్పుడైనా చూశారా? ఖచ్చితంగా రెండు కళ్ల మధ్యనున్న భాగం ముడిపడుతుంది. మనలోని మూడో కంటికి ఇదే తార్కాణం.
మెలటోనియన్ ఉత్పత్తిని పీనియల్ గ్రంథి చేస్తుంది. దీని కాంతిని రెటీనాలోని సెన్సిటివ్ కణాలు కాంతిని కనిపెడతాయి. ఈ కాంతిని శరీరంలోని అన్ని భాగాలకు వివిధ రూపాలలో, మార్గాలలో ప్రసరింపచేస్తుంది. పైకి కనిపించే రెండు కళ్లు బయటకు కనిపించే దృశ్యాలనే ప్రతిబింబిస్తాయి.  పీనియల్ గ్లాండ్ అనేది అంతర్గత కాంతిని శక్తిమంతం చేస్తుంది. అందుకే దీన్ని మూడో కన్ను అన్నారు.
పీనియల్ గ్లాండ్ ఎలాంటి విధులను నిర్వహిస్తుందన్న దానిపై మనిషికి, అతని సైన్స్‌కు ఇంతవరకూ పూర్తిగా అర్థం కాలేదు. దాని స్థానం మెదడులోపల ఉంటుందని, దీనికి మంచి ప్రాధాన్యం ఉంటుందని మాత్రమే అర్థం చేసుకున్నారు. కానీ, దాని రహస్యాన్ని పూర్తిగా ఛేదించలేకపోయారు. కానీ, మన పూర్వికులు మాత్రం ముందే దీన్ని నిరూపించారు. మనలోని జ్ఞానచక్షువే త్రినేత్రంగా తేల్చారు. ఇందుకు మూల స్థానం మన రెండు కళ్ల మధ్యభాగం. అందుకే దాన్ని కూల్‌గా ఉంచేందుకే మనం అక్కడ బొట్టును ఉంచుతాం.. ఈశ్వర విభూతిని, వైష్ణవ తిరుమణిని అక్కడే ఉంచుతాం. ఎందుకంటే అదే మన కేంద్ర స్థానం.. ఈశ్వర స్థానం.
----------------
శివ పార్వతులు పురాణ దంపతులని హిందూ ధర్మం భావిస్తుంది. అంటే మానవజాతికి వారు ఆది దంపతులు. అందుకే  మనిషిలో శివతత్త్వం సంపూర్ణంగా ఉంటుందని విశ్వసిస్తుంది. అందుకే పీనియల్ గ్లాండ్ పరమేశ్వరుని మూడో కన్ను మాత్రమే కాదు.. ఆయన లింగస్వరూపం కూడా అని నిర్వచిస్తోంది. శివలింగం వెనుక ఉన్న రహస్యం కూడా ఇదేనని పురాణాలు వివరిస్తున్నాయి.
ఇదే మన మేధస్సును, మన పనితీరు క్రమాన్ని నిర్ణయించే హార్మోన్. దేవదారు చెట్టు శంకువు ఆకారంలో ఉంటుంది. ఇంకాస్త జాగ్రత్తగా చూడండి.. ఇదే మహా శివలింగం. మన శరీరంలోనే నెలకొని ఉన్న లింగ స్వరూపం. శివలింగం ఆత్మకు గుర్తు. పరమేశ్వరుడి ఆత్మకు ప్రతిరూపమే శివలింగం. ఆయన త్రినేత్రమే శివలింగంగా ఆవిర్భవించింది. మనిషి  మెదడులో పీనియల్ గ్లాండ్‌ది ఆత్మస్థానం అని పాశ్చాత్య ఫిలాసఫర్లు సైతం ఒప్పుకున్నారు.  ముందుగానే చెప్పుకున్నట్లు భౌతిక రూపంలో ఇది మాస్టర్ గ్రంథిగా ఉపయోగపడుతుంది. స్పిర్చ్యువల్ లెవల్స్‌లో మూడో కన్నుగా తెరుచుకుంటుంది.
వైద్యశాస్త్రం ప్రకారం పీనియల్ గ్లాండ్ చీకటి నుంచి కాంతిని ఉత్పత్తి చేస్తుంది. మన దేవాలయాల్లో  గర్భగుడి చీకట్లోనే  ఉంటుంది. దీపాల వెలుగులోనే స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. పీనియల్ గ్లాండ్ ఇలాంటిదే. ఇందులోని ఆత్మలింగం నుంచే కాంతి పుంజాలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. మనలో ఆరు చైతన్య చక్రాలు ఉంటాయి. సహస్రార చక్రం పీనియల్ గ్లాండ్‌లో ఉంటుంది. ఈ గ్రంథి మనకు కావలసిన సమస్త శక్తిని ఇస్తుంది. దేవతలకు అమృతం, సోమరసం ఎలాగో, మనకు కావలసిన మెలటోనిన్, సెరోటోనిన్, డిఎంటి5లను పీనియల్ గ్రాండే ఉత్పత్తి చేస్తుంది. మనకు ప్రాణాధారం ఇవే. మన దేవాలయ వాస్తును జాగ్రత్తగా పరిశీలిస్తే మనిషికీ, మనిషిలోపలి శక్తి చైతన్య కేంద్రాలకు మధ్య ఉన్న సంబంధం స్పష్టంగా కనిపిస్తుంది.

తల...         గర్భగుడి
పీనియల్ గ్లాండ్ ... శివలింగం
ఇదే జ్ఞాన చక్షువు.. మూడో కన్ను
ధ్వజస్తంభం... మూలాధార చక్రం
మనిషి చనిపోయినప్పుడు కపాలమోక్షం జరుగుతుందని చెప్తారు. దహనం సమయంలో తలలో ప్రధానభాగం పగిలి శబ్దం వస్తుంది. అది వేరే ఏదో కాదు. పీనియల్ గ్రంథి ముక్కలైపోవటమే కపాలమోక్షమని అంటారు. స్పిర్చ్యువల్ లెవల్స్‌లో ఇది చివరి సన్నివేశం. పీనియల్ గ్లాండ్ స్మశానంలో పగిలిపోతుంది. ఈశ్వరుడు స్మశానంలో ఉంటాడు.
మన లోపల మరో మనిషి ఉన్నాడని, అతణ్ణి కనుగొంటే దేవుణ్ణి కనుగొన్నట్లేనని భారతీయ తత్త్వ వేత్తలు మొదట్నుంచీ చెప్తున్నారు. ఇస్లాం, క్రిస్టియానిటీల్లోనూ, బౌద్ధ, జైన మతాల్లోనూ ఈ అభిప్రాయమే బలంగా ఉంది. దాన్ని మనసు అన్నారు.. ఆత్మ అన్నారు.. జీవుడు అన్నారు.. వీటన్నింటినీ మించి ఆ లోపల ఉన్నది వేరెవరో కాదు ఈశ్వరుడే.. పరమేశ్వరుడే.. ఆయన ఆత్మలింగమే మనలోపల ఉన్నది. అది తెరిచే కన్నే త్రినేత్రం.

వాళ్ల దేవుడు చచ్చిపోయాడు

1 comments
తల్లి కడుపు నుంచి పుట్టినప్పుడు వాళ్లు దేవుణ్ణి బాగా విశ్వసించారు.. ఆయనే తమను సృష్టించారని నమ్మారు.. అందమైన భూమ్మీద అందంగా జీవితాన్ని గడిపేయొచ్చని కలలు కన్నారు. జీవితం చాలా హాయిగా, సంతోషంగా, ఆహ్లాదంగా సాగిపోతుందని ఆశపడ్డారు. కానీ వాళ్లు కోరుకున్న ఆ జీవితం ఎనిమిదేళ్లకే ముగిసిపోయింది. తమకు సంబంధం లేకుండా, ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే రోజులు గడుస్తున్నాయి. తామేం చేశామో వారికి తెలియదు.. తమకు మంచి జీవితాన్ని ఇస్తాడనుకున్న దేవుడు పత్తాలేకుండా పోయాడు.. వారి దృష్టిలో వాళ్ల దేవుడు చచ్చిపోయాడు..  నిజంగానే చచ్చిపోయాడు.  
ఓ అమ్మాయి.... పేరు మీనా
‘‘మా ఊళ్లో నాకు తెలిసిన ఓ అమ్మాయి ఈ సంతకు వెళ్దామని తీసుకువచ్చింది. సంతకు వెళ్లిన తరువాత మరో మహిళ మాకు పరిచయమైంది. కాసేపటికి తన దగ్గరున్న బిస్కట్ ఇచ్చింది. మగతగా అనిపించింది...అంతే ఆ తరువాత ఏమైందో తెలియదు.. నేను నిద్ర లేచేసరికి ముంబయిలో ఉన్నా.. మళ్లీ తిరిగి రాలేదు..’’
మరో అమ్మాయి.....పేరు అనిత
‘‘మా నాన్న చనిపోయారు.. ఆ బాధలో ఉన్నప్పుడు, మా ఫ్రెండ్ తారా సినిమాకెళ్దామని తీసుకెళ్లింది.. మా ఇద్దరి వయసు 12ఏళ్లు.. సినిమాహాల్ దగ్గర ఇద్దరు అబ్బాయిలు కలిశారు.. ఖాట్మండుకు వెళ్లి పశుపతి ఆలయాన్ని చూసి వద్దామని అన్నారు..సినిమా తరువాత అంతా కలిసి ఖాట్మండు బస్సెక్కాం. వాళ్లిద్దరు తనకు తెలుసని తారా చెప్పింది.. నేను ఆమెను నమ్మాను.. మాకు తినటానికి బ్రెడ్ ఇచ్చారు.. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.. మేము మళ్లీ తిరిగి రానే లేదు..’’
ఇంకో అమ్మాయి... పేరు  మెయిలీ
‘‘పదిహేనేళ్ల వయసులోనే నాకు పెళ్లి అయింది.. రెండేళ్ల పాప కూడా ఉంది. పాపకు న్యుమోనియా వచ్చింది.. డాక్టర్ సిటీకి తీసుకెళ్లమన్నారు.. బస్‌స్టాప్‌లో తొమ్మిదేళ్లుగా తెలిసిన ఒకతను తనకు దేశంలోనే గొప్ప డాక్టర్ తెలుసని చెప్పాడు.. ఆయనతో కలిసి రైలెక్కాను.. తాగేందుకు పెప్సీ ఇచ్చాడు.. నేను నిద్ర లేచేసరికి బొంబాయిలో ఉన్నా.. తరువాత తెలిసింది అతను నన్ను 50 వేల రూపాయలకు అతను అమ్మేశాడని.’’
......................................................................................
మీనా, అనిత, మెయిలీ, ఒక్కొక్కరిది ఒక్కో బాధ.. తమ మానాన తాము బతుకుతున్న వారి బతుకులను మరెవరో వచ్చి హటాత్తుగా మార్చివేశారు.. వాళ్లకు సంబంధం లేని, ఇష్టం లేని జీవితంలోకి బలవంతంగా నెట్టేశారు. మైనారిటీ అయినా తీరని అమ్మాయిలు వాళ్లు.. కష్టం, సుఖం అంటే ఏమిటో అర్థం కాని వయసులో జీవితం కుక్కలు చింపిన విస్తరి అయిపోతే.. వాళ్లను ఆదుకునేందుకు నమ్ముకున్న దేవుడు జాడ తెలియకుండా వెళ్లిపోయాడు.. అందుకే వాళ్లు అంటారు దేవుడు చచ్చిపోయాడని..
వేరెవరి కోసమో వాళ్లు జీవించాలి.. మరెవరికో సుఖాన్ని అందించేందుకు వాళ్లు శ్రమించాలి.. ఇంకెవలి అవసరాలు తీర్చేందుకు వాళ్లు సంపాదించాలి.. స్వాతంత్య్రం దేశానికి ఉంది.. వాళ్లకు లేదు. వాళ్ల బతుకులు వాళ్లవి కావు. చుట్టూ లక్షల మంది ఉంటారు.. వాళ్లలో ఒక్కరైనా తనవాళ్లు ఉండరు.. ఒంటరి తనం.. వెంటాడుతుంది.. వేటాడుతుంది.. ఊబిలోకి కూరేస్తుంది.. ఎందుకిలా జరుగుతోంది? వాళ్లేం తప్పు చేశారు?   
ఒక నమ్మకం ..వాళ్లకు ద్రోహం చేసింది. ఒక అవసరం..వాళ్లను బలహీనులను చేసింది. ఒక అమాయకత్వం , జీవితాన్నే నాశనం చేసింది
రోజుకు 2500 మంది-పిల్లలు..మహిళలు అన్న తేడాలేదు.. ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైపోతారు.. ఏమైందో తెలియదు. ఎవరు తీసుకెళ్లారో తెలియదు. ఎక్కడ తేలుతారో మాత్రం తెలుసు. ప్రపంచంలో సెక్స్ ట్రేడ్ జరుగుతున్న అతి పెద్ద ప్రాంతం ఎక్కడుంది? మీకు తెలుసా? పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోకండి.. భేషుగ్గా మన ముంబయిలోనే ఉంది. దాన్ని కామాటిపురా అని పిలుచుకుంటారు. ఇదిగో ఇలా రోజూ మాయమైపోతున్న పిల్లలు, మహిళలంతా తేలేది ఇక్కడే.. ఇంటర్ సెక్సువల్ టూరిజంలో అగ్రస్థానంలో ఉన్న ఏకైక ప్రాంతం. వేల మంది పాలుగారే పిల్లలు, మహిళలు  ఏడాదికి దాదాపు నలభై కోట్ల బిజినెస్ చేస్తున్నారు. ఏడేళ్ల వయసులోనే అమ్మాయిల్ని ఎత్తుకొచ్చేసి కామాటిపుర ప్రాంతంలో పడేస్తున్నారు.. నిన్నటి పసిపిల్ల ఇవాళ్టి బానిసగా మారుతోంది.
వాళ్లకేం తెలియదు.. అక్కడ కోటేల్లో ఓనర్ చెప్పినట్టు నడుచుకోవాలి.  పసితనం లేదు.. పెద్దరికం లేదు.. వయస్సుతో పరిమితం లేదు.. జెండర్ ఫిమేల్ అయితే చాలు.. ఎంత చిన్న వయసయితే అంతగా ఆడుకోవచ్చు.. లేతమనసులతో ఆడుకోవటం అంటే చాలామందికి సరదా.. అందుకే వారికి అంత డిమాండ్.. ఒకసారి వారికి దొరికిపోయారా అంతే సంగతులు.. చావలేరు.. బతకలేరు.. శరీరం ఓ సెక్స్ యంత్రంగా మారిపోతుంది. అలాగే బతకాలి.. వేరే మార్గం లేదు. రక్షించేవాడు లేడు.. రాడు..వినకపోతే అంతే సంగతులు. చెప్పిటన్లు వినేంత వరకు చిత్రహింసలు ఉంటూనే ఉంటాయి. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. పది రోజులైనా సరే.. అక్కడి నుంచి బయటకు వచ్చేది లేదు.. వాళ్లు చెప్పింది వినకుంటే ఏమైపోతారో తెలియదు.. నో వే..
.......................
చనిపోయిన తరువాత నరకం అనేది ఉంటుందో లేదో తెలియదు.. ఉంటే ఆ శిక్షలు ఎలా ఉంటాయో అంతకంటే తెలియదు.. పుస్తకాల్లో చదువుకోవటం... సినిమాల్లో చూడటం తప్ప మనకు తెలిసినంత వరకు నరకం జస్ట్ ఓ భయం.. కానీ, ఆ భయమే జీవితమైతే. ఆ జీవితంలో ఆ రకమైన శిక్షలు కామన్ ఎలిమెంట్ అయితే ఇదిగో ఈ అమాయకుల బతుకుల్లాగే తెల్లారుతాయి. పోలీసుల థర్డ్ డిగ్రీ గురించి విన్నాం.. సినిమాల్లో చూశాం.. కానీ, నిజం ఏమిటన్నది ఎవరికీ తెలియదు.. ఆ డిగ్రీ ఏ లెవల్లో ఉంటుందో అర్థం కాదు.. కానీ, ఇదిగో  ఒక్కసారి కామాటిపురకు వెళ్తే.. అమాయక ఆడపిల్లలపై ప్రయోగించేది థర్డ్ డిగ్రీ కాదు.. ఒకవేళ ఉంటే.. దాన్ని అంటే టెంత్ డిగ్రీ..
సిగరెట్లతో కాలుస్తారు, కొరకంచుతో వాతలు పెడతారు, యాసిడ్ పోస్తారు, కాళ్లు విరుగుతాయి, రోజుల్లోనే రోగిష్టిగా మారతారు. నడవలేరు. కూర్చోలేరు. నిలబడలేరు..
క్షణాల్లో, గంటల్లో  వాళ్ల జీవితాలు ఊహించరి రీతిలో మారిపోతాయి. సెక్స్ ట్రేడింగ్ అనేది మన దేశంలోనే ఎక్కువగా జరుగుతోందనుకుంటే పొరపాటే.. .. మనతో పాటు, నేపాల్, ఆసియాలోని అన్ని దేశాల్లో , మాజీ సోవియట్ యూనియన్‌లో, ఆఫ్రికాలో.. ప్రతి చోటా.. ప్రపంచంలో విటుడనేవాడున్న ప్రతిచోటా అమ్మాయిల అమ్మకాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ప్రతి రోజు వేల మంది వ్యభిచార కూపంలోకి పడిపోతున్నారు.
సెక్స్‌ట్రేడ్.. ఇప్పుడిదొక తేలికైన వ్యాపారం.. పెట్టుబడిలేని వ్యాపారం.. దీనికి ఇన్వెస్ట్‌మెంట్ అమ్మాయి అందమే.. అదీ లేత అందం.. ఇక్కడ ఎంత చిన్న వయసయితే, అంత డిమాండ్.. పన్నెండేళ్లు.. కొంచెం తగ్గితే తొమ్మిదేళ్లు.. ఇంకాస్త తగ్గితే ఎనిమిదేళ్లు..ఒక్కసారి  మాయమాటలు చెప్పి అమ్మాయిని ఈ కూపంలోకి ఒక్కసారి తెచ్చిపడేస్తే చాలు.. యాభై వేల నుంచి ఒక్కోసారి లక్ష రూపాయల దాకా సంపాదించేయొచ్చు. మాఫియాలను మించిన దందా ఇది.
మన దేశంలో  నడుస్తున్న వ్యభిచార గృహాల్లో ఎంతమంది మగ్గుతున్నారో మీకు తెలుసా? అక్షరాలా రెండు లక్షల మంది. ఇందులో ఇండియా, నేపాల్ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువ. అందులోనూ తొమ్మిది, పదేళ్ల వయసున్న అమ్మాయిల సంఖ్యే యాభై వేల దాకా ఉంటుంది. అక్కడ విటుడి సుఖం, ఆనందం మాత్రమే ప్రధానం.. అమ్మాయిని వీలైనంత ఎక్కువగా  బాధపెట్టి లైంగికంగా అనుభవించటంలోనే వీళ్లు ఆనందాన్ని చూస్తారు.. ప్రపంచం మొత్తం మీద 12 లక్షల మంది పిల్లలు ప్రతి ఏటా అపహరణకు గురవుతున్నారట.. వీరిలో 8 లక్షల మంది వరకు ఆడపిల్లలు.. అంతా వ్యభిచార కూపాలకే తరలిపోతున్నారు.. మగవాడి రాక్షసానందాలకు ఇంత మంది పసికూనల జీవితాలు మొగ్గలోనే వాడిపోతున్నాయి.
మనుషులు- తోటి మనుషులతో చేసే వ్యాపారం ఇది. ఆడ మనుషులతో చేసే వ్యాపారం.. అన్నెంపున్నెం తెలియని అమ్మాయిలతో చేసే వ్యాపారం.  దీనికి లైసెన్సులు అక్కర్లేదు.. చట్టాలు అవసరం లేదు.. ఈ వ్యాపారం బడాబాబుల అనందం కోసం..వెయ్యి రూపాయలకు చిల్లర ఉన్నదన్న సంగతి కూడా తెలియని వారి సంతోషం కోసం, ఆనందం కోసం నడిపే దుకాణాలివి..
అమ్మాయిల అమ్మకం అనేది ప్రపంచ వ్యాప్తంగా మల్టీబిలియన్ డాలర్ల వ్యాపారంగా మారింది. మన దేశంలోనే వ్యభిచారంలో మగ్గుతున్న వారిలో ప్రతిమూడో అమ్మాయి వయసు పన్నెండేళ్ల లోపే ఉంటుంది. పేరుకు గొప్ప ప్రజాస్వామ్యమని చెప్పుకుంటాం.. సూపర్ పవర్‌గా ఎదుగుతోందని బుజాలు తడుముకుంటాం.. టీవీ మైకుల ముందు తెగ మాట్లాడేసే మహానుభావులు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్లు చేసిన అభివృద్ధికి అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది. అంతా పైకి నవ్వుతూనే కనిపించాలి.. ముఖానికి రంగు పులుముకున్నట్లే.. నవ్వునూ పులుముకుని తీరాలి. లోపల బాధ ఉబికివస్తున్నా పంటిబిగువునుంచి బయటపడటానికి వీల్లేదు.. కస్టమర్ ఏం చేస్తే అందుకు ఒప్పుకోవాలి. మద్యం తాగిస్తే తాగాలి. సిగరెట్ ఇస్తే పీల్చాలి.. ఏ ఒక్కరు ఎదరు తిరిగినా చెప్పేదేముంది? ట్రాఫికింగ్ ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరించిన నెట్‌వర్క్.  ఒక్క అమెరికాలోకే ప్రతి సంవత్సరం 50 వేల మంది అమ్మాయిల రవాణా జరుగుతోందంటేనే ఈ వ్యాపారం ఎంత బాగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.
ట్రాఫికింగ్ అపహరణ
ట్రాఫికింగ్ టార్చర్
ట్రాఫికింగ్ మర్డర్
ట్రాఫికింగ్ మానవ హక్కుల ఉల్లంఘన
ట్రాఫికింగ్ లైంగిక దోపిడీ
గొర్రెల్ని సంతలో పెట్టి అమ్మేసినట్లు అమ్మేయటం. ఏ ఒక్క దేశమూ మినహాయింపు కాదు.. పైగా దీన్ని సిగ్గులేని ప్రభుత్వాలు సెక్స్ టూరిజంగా అనధికార పర్మిట్లు ఇచ్చేస్తున్నాయి. పర్యాటకుల లైంగికానందం కోసం పసికూనలను బలిపెడుతున్నాయి.
వీళ్లున్న చోట ఖాకీలు ఉంటారు కానీ, పోలీసింగ్ అనేది ఉండదు.. చట్టాలు, సంకెళ్లు అనే పదాలకు చోటుండదు. అంతా మనీమేటర్సే.. అమ్మాయిని అమ్మకానికి పెట్టడం దగ్గర నుంచి పోలీసింగ్ వరకు అంతా పచ్చనోట్లపైనే సాగుతుంది. ఏడాదికో, పదేళ్లకో ఒకసారి సమాజాన్ని ఉద్ధరిస్తామని చెప్పుకునే ఏదో ఓ సంస్థ కొందరిని ఈ కూపం నుంచి బయటకు తీసుకొచ్చి ఘనకార్యం చేసినట్లు చెప్పుకుంటుంది. పది మందినో, పాతిక మందినో బయట పడేసినంత మాత్రాన లక్షలాది మంది పరిస్థితి ఏమిటి? అదే దూకుడు ఎందుకు కంటిన్యూ కాదు? అని ప్రశ్నిస్తే జవాబుండదు..
స్కూలు కెళ్లిన పాపాయి తిరిగి రాదు
వీధిలో ఆడుకుంటున్న అమ్మాయి అదృశ్యమవుతుంది
ఫ్రెండ్స్‌తో వెళ్లిన కూతురు మళ్లీ కనిపించదు.
ఇది ఏ ఒక్కరి సమస్య కాదు..
ఎందుకిలా జరుగుతోంది ఒక్కసారి ఆలోచించండి.. పేదరికంలో ఉన్న వాళ్లు మాత్రమే ఈ బాధలు పడటం లేదు.. మధ్యతరగతి వ్యవస్థలోనూ ఇదే జరుగుతోంది. కాకపోతే అక్కడ పేదలది గతి లేని బతుకులయితే, ఇక్కడ మధ్యతరగతిది గతి తప్పిన బతుకులుు. ఇక్కడ పిల్లలది తప్పు కాదు.. అమ్మాయిలది తప్పు కాదు.. వ్యవస్థది.. నేరగాళ్లది.. మాఫియాది.. అందుకే ఆ అమ్మాయిలకు దేవుడు నిజంగానే చచ్చిపోయాడు.

తెలంగాణ హుళక్కే...హ్యాట్సాఫ్‌ టు ఎస్‌ఏ

31 comments
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఇక రానట్టేనా? అధిష్ఠానంపై ఎస్‌.ఏ. లాబీయింగ్‌ బలంగా పనిచేసినట్టు స్పష్టం అవుతోంది.. కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం ప్రస్తుత పోకడలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతోంది. యుపిఏ ప్రభుత్వాన్ని కానీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాందీని కానీ మేనేజ్‌ చేయటంలో ఎస్‌ఏ పూర్తిగా సక్సెస్‌ అయింది. అటూఇటూ తిరిగి నికృష్ట కమిటీ చేత ఎస్‌ఏ రాయించుకున్న నివేదికలోని ఆరో సిఫార్సునే అమలు చేయబోతోంది.. ఇప్పుడు కేంద్రంలో డార్జిలింగ్‌ తరహా పరిష్కారాన్ని తెలంగాణాకు అపెユ్ల చేయటం.. గూర్ఖాలాండ్‌ తరహాలో ప్రత్యేక ప్రాంతీయ అభివృద్ధి మండలిని విస్తృత అధికారాలతో.. ఆర్థిక ప్యాకేజీని ప్రకటించటం ద్వారా టి.కాంగ్రెస్‌ నేతల నోళ్లు మూయించాలని కాంగ్రెస్‌ డిసైడ్‌ అయిపోయింది.. గులాంనబీ ఆజాద్‌ విదేశాల నుంచి తిరిగి రాగానే వచ్చే వారంలో ఈ ప్రతిపాదనను వాళ్లకు చెప్పి ఒప్పిస్తారు.. వీళ్లు గొర్రెలు కాబట్టి మెడలూపి వచ్చేస్తారు. నికృష్ట కమిటీ తన ఆరో ప్రతిపాదనలోనూ చెప్పింది ఇదే.. ఓ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయటం.. దానికి రాజ్యాంగబద్ధత కల్పించటం.. దానికో చైర్మన్‌ను కేబినెట్‌ హోదాతో నియమించటం.. 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందాన్ని పక్కాగా అమలు చేయటం..ఇవన్నీ ఆరో ప్రతిపాదనలో చక్కగా ఉన్నవే..

1956 ఫిబ్రవరిలోనే పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది.. అప్పటికి ఇంకా రెండు రాష్ట్రాలు విలీనం కాలేదు.. నవంబర్‌ లో రెండు రాష్ట్రాలు విలీనమయ్యాయి. కానీ, ఆగస్టు నాటికే.. అంటే ఆంధ్రప్రదేశమనేది ఏర్పాటు కావటానికి ముందే ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కేశారు. ఇక రీజనల్‌ మండలి.. దానికి ఓ చట్టబద్ధత కల్పిస్తారట.. ఆ చట్టబద్దత ఎలాంటిదంటే.. తెలంగాణాకు ఏం కావాలో అది సమైక్యరాష్ట్ర శాసనసభకు సిఫార్సులు చేయవచ్చంట.. ఆ సిఫార్సులను సభ చర్చించి ఆమోదిస్తే అమలవుతాయి.. లేకపోతే లేదు.. సభలో మెజార్టీ ఎవరుంటారు? ఎస్‌ఏ.. ఆమోదించాల్సింది ఎస్‌ఏ.. వాళ్లు ఆమోదించరు.. అవి అమలు కావు.. వివాదం ఏర్పడితే.. రీజనల్‌ మండలి చైర్మన్‌ ముఖ్యమంత్రి, స్పీకర్‌, గవర్నర్‌ అధ్యక్షతన ఉన్న కమిటీ పరిష్కరిస్తుంది.. ఇది తెలంగాణా అభివృద్ధికి వర్కవుట్‌ అయ్యే ఫార్ములా.. ఆహా.. ఎంత గొప్ప సిఫార్సు.. ? ఈ మండలి ప్రయోగం ఇప్పటిది కాదు. రాష్ట్రం ఏర్పాటుకు ముందే మండలి ఏర్పాటు జరిగింది.. దానికి ఇవాళ్టికీ దిక్కూమొక్కూలేదు..ఈ ప్రయోగాలన్నీ విఫలమైన తరువాతే రాష్ట్ర ఏర్పాటు వ్యవహారం రంగంమీదకు వచ్చింది. పి.చిదంబరం పెద్ద పోటుగాడిలాగా యూనియన్‌ హోం మినిస్టర్‌ హోదాలో డిసెంబర్‌ 9న ప్రకటన చేసేశారు. . తెల్లవారి ట్రబుల్‌ షూటర్‌ అని పేరుపెట్టుకున్న ప్రణబ్‌ పార్లమెంటులో హామీ ఇచ్చేశారు.. తీరా ఎస్‌ఏ సూట్‌కేసులు వచ్చేసరికి అంతా ముఖం యుటర్న్‌ తీసుకున్నారు.. గొప్ప నిజాయితీపరుడని తెగ పొగిడేసిన శ్రీకృష్ణ లాంటివాడే నికృష్టంగా కవర్లను అందుకున్నప్పుడు వీళ్లెంత? ఇక లోకల్‌ తెలంగాణ లీడర్లను మేనేజ్‌ చేయటం పెద్ద కష్టమా? తెలంగాణ నాయకత్వాన్ని అవసరార్థం ఆందోళనలు చేసే పరిస్థితికి తీసుకొచ్చేశారు. తెలంగాణ నాయకత్వంతోనే ఉద్యమంపై నివురు కప్పేలా చేశారు.. అది అందులోనే చల్లారేలా చేసేందుకు తెగ కష్టపడుతున్నారు. నివురు చాటున ఉద్యమం ఉక్కిరిబిక్కిరవుతోంది.. నీచమైన నాయకత్వం ఉద్యమాన్ని హైజాక్‌ చేసుకున్నంతకాలం ఇలాగే సాగుతుంది. ఆ నాయకత్వం కబంధ హస్తాల నుంచి అది బయటపడ్డప్పుడు.. జన ప్రళయం తప్పదు.. గతంలో ఇడ్లీసాంబార్‌ గోబ్యాక్‌ అన్న నినాదం విధ్వంసాన్ని సృష్టించింది.. ఇప్పుడు ఆంధ్రాగోబ్యాక్‌ అన్న నినాదమే తలెత్తితే ఆ సంక్షోభాన్ని నియంత్రించటం ఈ నాయకత్వం వల్ల అయ్యే పనేనా?