12, నవంబర్ 2014, బుధవారం

నా దేవరహస్యం పుస్తకం లో అమ్మ కోసం ఉబికి వచ్చిన ఉద్వేగం ......

........................................................
అమ్మ .. వరంగల్లుకు కాకతి భద్రకాళి ఎలాగో.. మా కుటుంబానికి అమ్మే అమ్మలగన్నయమ్మ. జీవించి ఉన్నప్పుడు ఏమీ చేసిన వాడను

కాను. చేద్దామనుకున్నప్పుడు కంటిముందు లేకుండా పోయి కఠినంగా శిక్షిస్తోంది. 28 ఏళ్ల వయసులో ఊరొదిలి పెట్టి హైదరాబాద్

వచ్చి చేరినవాణ్ణి.. పెద్దవాడు తప్ప చిన్నవాణ్ణి... ఎప్పుడూ దగ్గర ఉన్నవాణ్ణి కాను. గత 20 ఏళ్లలో చుట్టపు చూపుగానే

వరంగల్లుకు వెళ్లి వచ్చిన వాణ్ణి.. అయినా ఆమె ముగురమ్మల మూలపుటమ్మ.. ఏనాడూ నన్ను వేరు చేయలేదు.. చేసి దూరం చేయలేదు.

వరంగల్లుకు వెళ్లి తిరిగి హైదరాబాద్ బయలుదేరేప్పుడు తప్పనిసరిగా ఆమె చేతులమీదుగా కొంత నగదు తీసుకొని రావలసిందే. అది పది

రూపాయలైనా కావచ్చు.. వంద రూపాయలైనా కావచ్చు. పెద్దవాడికైనా, నాకైనా తప్పనిసరిగా ఇచ్చి పంపించేది. ఆమె దిండుకింది నుంచి

తీసి ఇచ్చే ఆ డబ్బులు నాకు అషై్టశ్వర్యాలతో సమానం.. రెండేళ్లు దాటింది. ఇప్పుడూ వరంగల్లుకు వెళ్తున్నా.. వస్తున్నా..

కానీ.. వచ్చేప్పుడు ఎవరిని డబ్బులడగాలి.. ఏమని అడగాలి? వరంగల్లు నుంచి బయలుదేరిన ప్రతిసారీ శరీరంలోని కండరాలన్నీ

ఒక్కుదుటున కదిలిపోతాయి.. ఒళ్లు గగుర్పొడుస్తుంది. అమ్మ కనీసం మంచంపైనైనా సరే అలాగే ఉంటేె బాగుండుననిపిస్తుంది. ఆమె

పడుకున్న మంచం అమ్మ ఉన్నప్పటిలాగానే మౌనంగా పలకరిస్తుంది.. ఆమె కూర్చున్న కుర్చీ యథాతథ స్థానంలో అలాగే ఉండిపోయింది.

అందులో ఆమె మాత్రం లేదు. వాటి స్థానం మారిస్తే ఆమె జ్ఞాపకం మాసిపోతుంది. అందుకే వాటిని నాన్నగారు కదల్చలేదు..
జీ స్టోరీస్ కథనాల పరంపరలో ఒక ఎపిసోడ్ ‘‘మీరు మీ అమ్మతో మాట్లాడుతున్నారా’’ అన్న శీర్షికతో కార్యక్రమాన్ని ప్రసారం

చేస్తే.. అమ్మ ఆందోళన చెందింది. నన్ను దృష్టిలో ఉంచుకుని రాశావా అని నిలదీసింది. రోజూ ఒకసారి ఫోన్‌చేసి పలకరించకపోతే

నిష్ఠూరమాడింది. రెండేళ్లనుంచి ఆమె పలకరింపులు లేవు.. నిష్ఠూరాలు లేవు.. ఆప్యాయతలు లేవు.. కానీ, మౌనంగానే ఆమె సజీవమై నా

వెన్నంటే ఉండి, వెన్ను తట్టి నడిపిస్తోంది. ఇదేమీ భావోద్వేగం కాదు. వాస్తవం. జీవితంలో ఎవరికీ ఎదురుకాని అపూర్వ అనుభవం.

అమ్మ అస్తమించిన తరువాత అంత్యక్రియలలో భాగంగా కొత్త చీర, ఆకుపచ్చ గాజులు...పసుపు, కుంకుమలతో సాగనంపాము. రెండవరోజున

ఉత్తరక్రియలు నిర్వహించటానికి వెళ్లిన నాకు అమ్మ చేతి గాజు ఒకే ఒక్కటి.. పగుల కుండా, కరగకుండా చితాభస్మంలోంచి పునీతమై నా

చేతికి చిక్కింది. సాధారణంగా మట్టిగాజులు అంత వేడిలో కరిగిపోకుండా ఉండటం అసాధ్యం. కనీసం పగిలిపోవాలి. అన్ని గాజులూ అలాగే

కరిగిపోయాయి, కానీ, నేనున్నానంటూ నిండు ముత్తైవతనానికి ఆదర్శమైన గాజుగా అమ్మ మళ్లీ తిరిగి వచ్చింది. నన్ను సంపూర్ణంగా

కటాక్షిస్తోంది.. ఈ గ్రంథాన్ని ఆమెకు సభక్తికంగా అర్పించుకుంటున్నాను.

కామెంట్‌లు లేవు: