14, మే 2011, శనివారం

కరడుగట్టిన కొడవలిని రెండు గడ్డిపూలు కోసిపారేశాయి

ఎర్రకోట బద్దలైపోయింది. అరుణపతాకం చిన్నబోయింది. కమ్యూనిజానికి కేరాఫ్ అడ్రస్, పత్తా లేకుండా పోయింది. కరడుగట్టిన కొడవలిని రెండు గడ్డిపూలు కోసిపారేశాయి. మూడున్నర దశాబ్దాలు... దుర్భేద్యమైన ఓటుబ్యాంకు. పటిష్ఠమైన కేడర్ అంతా సోదిలోకి లేకుండా పోయింది. బెంగాల్‌లో తిరుగులేని అధికార ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చిన లెఫ్ట్ ప్రాభవం పూర్తిగా మసకబారిపోయింది.
కామ్రేడ్ జ్యోతిబసు ఒక్కో ఓటు ఇటుకను కూడగట్టి నిర్మించుకున్న మహా సామ్రాజ్యం.. అక్షరాలా 34 సంవత్సరాల పాటు పదిల పరచుకున్న  అధికారాన్ని బుద్దదేవ్ భట్టాచార్య ఎర్రజెండాలో పెట్టి మరీ మమతా దీదీకి అప్పగించేశారు. క్లీన్ స్వీప్... మూడింట రెండు వంతుల మెజారిటీ.. దారుణాతి దారుణంగా వామపక్ష కూటమి పరిస్థితి దిగజారిపోయింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇన్నాళ్లూ లెఫ్ట్‌ను అక్కున చేర్చుకున్న బెంగాలీలు ఒక్కసారిగా అధః పాతాళానికి తొక్కి పారేశారు.
ఇంతకాలంగా అంతా ఊహిస్తున్నదే.. సెఫాలజిస్టులు లెక్కలు వేసి తేల్చి చెప్పిందే... బెంగాల్‌లో అధికార మార్పిడి జరుగుతుందని.. కానీ, ఇప్పటికీ అందరిలోనూ నమ్మకం లేనితనం.. లెఫ్ట్‌ఫ్రంట్ బెంగాల్‌లో ఓటమి పాలవటమా? అసలు జీర్ణించుకోగల వార్తేనా? అర్థం కాని విషయం..

కమ్యూనిజం.. దేశంలో మరెక్కడా కనిపించనంత బలంగా ఉన్నది బెంగాల్‌లోనే.. ప్రతి ఊళ్లో.. ప్రతి ఇంట్లో.. ప్రతి చోటా కమ్యూనిస్టులు ఉన్న ప్రాంతం బెంగాల్.. అలాంటి కరడు గట్టిన కమ్యూనిస్టు వ్యవస్థను ఒక్క మహిళ.. ఇంకా చెప్పాలంటే అబల.. ముందూ, వెనుకా ఎలాంటి అంగబలం, అర్థబలం, రాజకీయ బలం లేని మహిళ.. చిన్నపాటి ఇరుకు ఇంటిలో ఉంటూ.. సీదాసాదాగా జీవించే మహిళ కూకటి వేళ్లతో పెకిలించి వేయటం ఇప్పటికీ కలగానే కనిపిస్తుంది.
ఆమెకు ఇందిరాగాంధీకి ఉన్నట్లు రాజకీయ వారసత్వం లేదు. మాయావతికి ఉన్నట్లు రాజకీయ గురువు లేరు. జయలలితకు ఉన్నట్లు అండదండలిచ్చిన కొలీగ్‌లు లేరు. సోనియా మాదిరిగా వంశపారంపర్యత లేదు. ఆమె ఒక్కరు. పది ఫైర్‌బ్రాండ్‌ల పెట్టుగా మారి పెట్టని కోటను పటాపంచలు చేసేశారు.
తిరుగుబాట్లు, కార్మిక ఉద్యమాల ద్వారా 1977లో భారీ మెజార్టీతో బెంగాల్‌ను చేజిక్కించుకున్న లెఫ్ట్, పటిష్ఠమైన కోటనే కట్టుకుంది. 1979లో  బెంగాల్‌లో 4వేల మంది ఊచకోత జరిగినప్పుడు కానీ, ఆ తరువాత  ఎమర్జెన్సీ లాంటి రకరకాల ఉద్యమాలు వచ్చినప్పుడు కానీ, దేశంలో రాజకీయ సమీకరణాలు పెద్ద ఎత్తున మార్పులు జరిగినప్పుడు కానీ లెఫ్ట్ కోట చెక్కు చెదరలేదు. కానీ, జ్యోతిబసు రిటైర్ కావటంతోనే  అంతటి కోటా బీటలు వారటం మొదలు పెట్టింది. ఆర్థిక సంస్కరణలు, నందిగ్రామ్‌లు, సింగూరులు లెఫ్ట్‌ఫ్రంట్ పునాదుల్ని అమాంతంగా తొలగించివేశాయి.
2009 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోనే బెంగాల్‌లో లెఫ్ట్ సర్కారు వెంటిలేటర్‌పై నడిచే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మమతా దీదీ సంపూర్ణంగా.. సజీవంగా సమాధి చేసేశారు.
ఇప్పుడు లెఫ్ట్ పరిస్థితి దేశంలోనే అగమ్యగోచరంగా మారింది. ఇన్నాళ్లూ బెంగాల్‌ను చూసుకుని మురిసిపోయిన లెఫ్ట్‌కు ఇప్పుడు చెప్పుకోవటానికీ, చూపించుకోవటానికీ ఏమీ లేకుండా పోయింది. ఇంతకాలం ఉన్నది మూడు రాష్ట్రాలు.. అందులో బెంగాలు.. కేరళ రెంటిలోనూ లెఫ్ట్ అవుటయిపోయింది. త్రిపుర చిన్న రాష్ట్రం. జాతీయ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఒకటే.. ఇక జాతీయ రాజకీయాల్లో ఎర్రజెండా పరిస్థితి ఏమిటి?

3 కామెంట్‌లు:

Malakpet Rowdy చెప్పారు...

ఒక అయిదేళ్ళపాటు దేశద్రోహుల పీడ వదిలిపోయిందని సంతోషపడండి

Saahitya Abhimaani చెప్పారు...

కమ్యూనిస్ట్ పార్టీ 1977 నుంచి అధికారంలో ఉన్నంత మాత్రాన, బెంగాల్లో ఉన్న వాళ్ళంతా కమ్యూనిస్టులు కాదు. ఇవ్వాళ ఆ పార్టీ ఓడినంత మాత్రాన, ఆ భావ జాలం పూర్తిగా నశించిందనీ అని కాదు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ అంటే. ఆ రాజకీయ పార్టీ ఓటమి గురించి అంత ప్రాధాన్య ఇవ్వాల్సిన పని లేదు. మరొకసారి ఎన్నికల్లో గెలువ వచ్చు లేదా మల్లి ఓడనూ వచ్చు. రాజకీయ పార్టీలకు ఇది చాలా సహజమైన కార్యక్రమం.

అజ్ఞాత చెప్పారు...

కమ్యునిస్ట్ భావజాలం ఇక ఈ దేశం లో అంతర్ధానం అయ్యేరోజు దగ్గర లోనే ఉంది.