27, ఫిబ్రవరి 2010, శనివారం

నేను రాను బిడ్డో సర్కారి దవాఖానకు...

ప్రభుత్వాసుపత్రుల్లో విచిత్రాలు.. విషాదాలు చోటు చేసుకోకపోతే ఆశ్చర్యపోవాలి కానీ... లేకపోతే ఎందుకు?.. ఒకటి కాదు..రెండు కాదు.. వరుసగా... ఒకదాని వెంట ఒకటిగా ఘటనలు జరుగుతున్నా... సర్కారు నోట ఒకే మాట... విచారణ జరిపిస్తాం... ఇంతే తప్ప చర్యల దగ్గరకు వచ్చేసరికి వాటి గురించి ఆలోచించే తీరిక అమాత్యులకు కానీ, అధికారులకు కానీ ఇసుమంతైనా ఉండదు.. ఫలితం ఇవాళ విశాఖ కెజిహెచ్‌లో జరిగిన ఘటన... ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన పసిగుడ్డు కుక్క పాలైంది...

విశాఖ పట్నం కింగ్‌ జార్జి హాస్పిటల్‌... అబ్బో.. దీనికున్న పేరు ప్రతిష్ఠలు అన్నీ ఇన్నీ కావు.. వైద్యంలో ఎంత పేరుందో.. నిర్లక్ష్యంలోనూ అంతే పేరు ఉంది... ఇక్కడి వైద్య అధికారులకు, సిబ్బందికి పేరుకు మాత్రమే ఉద్యోగం... బాధ్యతలంటే వీరికి ఎంతమాత్రం సరిపడవు.. నిన్న రాత్రి అనురాధ అనే ఓ మహిళ కెజిహెచ్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది... ఆ పసికందుకు మొదట స్నానం చేయించాలంటే అయిదు వందల రూపాయలు కావాలంటూ సిబ్బంది తెగేసి చెప్పారు.. అందుకు అనూరాధ కుటుంబ సభ్యులు కాదనటంతో పసికందును అలాగే వదిలేసి వెళ్లారు..తెల్లవారేదాకా కూడా పుట్టింది మగబిడ్డో.. ఆడబిడ్డో కూడా చెప్పలేదు.. బంధువులకు అప్పజెప్పలేదు.. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కుక్క... కళై్లనా తెరవని శిశువును నోట కరచుకుని పరిగెత్తుకుని వెళ్లి పీక్కు తింది...
ఇంత దారుణం జరిగిన తరువాత పుట్టింది మృత శిశువంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్లేటు మార్చారు.. రికార్డులూ మార్చేస్తున్నారు...

చివరకు మీడియాలో వార్తలు వచ్చాయి కాబట్టి రాష్ట్ర రాజధానిలో వైద్య ఆరోగ్య శాఖమంత్రి రొటీన్‌గా చెప్పే డైలాగే అదే నండీ విచారణ జరిపిస్తామని చెప్పేశారు..
ఒక ఘటన జరగ్గానే సంబంధిత శాఖ మంత్రులు ఎలా స్పందించాలో అలాగే స్పందించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు.. విశాఖ కెజిహెచ్‌లో ఓ పసికందు.. వీధి కుక్కకు పలహారంగా మారితే మంత్రి యథాలాపంగానే విచారణ జరిపిస్తామన్నారు.. మన ప్రభుత్వాసుపత్రుల పట్ల మంత్రికి ఉన్న అపారమైన శ్రద్ధకు జోహారు అర్పించకుండా ఎలా ఉండగలం?
ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్న ఆ బాధితుల శోకాన్ని తీర్చేదెవరు? అవి ఆసుపత్రులా?
కుక్కలు, పందులు సై్వరవిహారం చేసే చెత్తకుప్పలా?
సామాన్యులు కుక్కల కంటే హీనంగా కనిపిస్తున్నారా?
నిర్వహణకు మరోపేరు నిర్లక్ష్యమేనా?
ఆపరేషన్‌ థియేటర్‌లోకి కుక్క ఎలా ప్రవేశించింది?
రికార్డులు తారుమారు చేస్తున్నదెవరు?
ఇలాంటి దారుణాలకు జవాబుదారీ ఎవరు?
సర్కారీ వైద్యం ఎప్పుడు కళు్ల తెరుస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఎవరు జవాబు చెప్పాలి...
2.
ఒకటా రెండా? ఎన్నని చెప్పేది సర్కారీ ఆసుపత్రుల్లో విషాదాలు.. వివాదాల గురించి...
శిశు మరణాలు ఇవాళ ఈ దవాఖానల్లో కొత్తగా జరుగుతున్నవేం కాదు.. ఇవాళే వింటున్న వార్తలంతకంటే కాదు.. ఇంతకు ముందు ఇంతకంటే దారుణాలే చోటు చేసుకున్నాయి... మన పాలకుల్లో పట్టించుకునే వాళు్ల ఎవరైనా ఉంటేనే కదా.. సమస్యలు పరిష్కారమయ్యేది....

ఇప్పుడు తాజాగా విశాఖ కెజిహెచ్‌లో శిశువు కుక్కల పాలు కావటానికి కారణం ఏమిటి?... ఆసుపత్రికి ప్రసూతికోసం వచ్చిన ఆ తల్లి అంతులేని గర్భశోకానికి బాధ్యులెవరు?... ఎనిమిది నెలల క్రితం ఇదే ఆసుపత్రిలో ఇలాగే ఓ పసికందును ఎవరో ఎత్తుకుపోతే ఇప్పటి వరకు ఆ పసివాడి జాడ ఏమైందో ఇవాల్టి వరకూ తెలియదు.. అంతలోనే మరో ఘటన...
అంతకు ముందు కర్నూలులో ఓ పసివాణ్ణి పంది ఎత్తుకుపోయింది..
అవి సర్కారు ఆసుపత్రులు కావు..? పెంటకుప్పలే.. కుక్కలు.. పందులు యథేచ్చగా ఆసుపత్రుల్లో ఆపరేషన్‌ థియేటర్‌ వరకూ రావటం ఎక్కడి విచిత్రం... వైద్యం చేయించుకుంటున్న రోగుల దగ్గరకు ఎలాంటి సైడ్‌ ఎఫెక్‌‌స్ట రాకుండా ఉండేందుకు బంధువులను సైతం రానివ్వరే... అలాంటిది ఇంత హీనాతిహీనంగా జంతువులు తిరగుతుంటే.. వాటిని ఆసుపత్రులని ఎలా పిలవాలి?

జిల్లాల్లోనే కాదు.. ఏకంగా రాష్ట్ర రాజధానిలోనే ఇలా జరిగిన ఘటనలో కొల్లలు... ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌ ఇందుకు కేంద్రాలు... మూసీ కాలువలో శిశువుల మృతదేహాలు దొరికితే అడిగే దిక్కు లేదు.. చర్యలు తీసుకున్న నాథుడు లేడు... ఎప్పటిలాగే ఇవాళా ఓ శిశువు పుట్టడమే మృత్యుముఖంలో పుట్టింది.. పుట్టి మరణించింది.. అధికారులకు ఆ శిశువును గురించిన చింత ఎంతమాత్రం లేదు.. ఎందుకంటే ఆ శిశువు ఓ పేదరాలి కడుపున జన్మించింది కాబట్టి....
3.
ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వాసుపత్రులకు తేడా ఎక్కడ వస్తోంది? నిర్లక్ష్యమేనా అది? ఆసుపత్రుల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవరికీ తెలియని అయోమయం రాజ్యమేలుతోంది...అప్పుడే పుట్టిన శిశువుల్ని జంతువులు మాంసం ముద్ద అని లాక్కెళ్తాయి... దోపిడీ దొంగలు డాక్టర్ల వేషం వేసుకుని వచ్చి రోగుల్ని నిలువు దోపిడీ చేస్తారు....
ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే.. అక్కడ వైద్యం జరుగుతుందో... దోపిడీ జరుగుతుందో తెలియని పరిస్థితి... తాము వెళు్తన్నది ఆసుపత్రులకా? మరో చోటికా తెలియదు... సర్కారీ దవాఖానాలను ఇవాళ నిర్లక్ష్యపు రోగం చుట్టుకుంది.. ఏ మందు వేసినా అది నయం అయ్యే పరిస్థితి కనిపించటం లేదు..
రాష్ట్ర రాజధానిలోనే... అత్యంత ప్రసిద్ధి చెందిన రెండు ఆసుపత్రుల్లోనే దొంగలు డాక్టర్ల అవతారమెత్తుతున్నారు.. అందినకాడికి అందినంత రాచ మార్గం లోనే దోచుకు పోతున్నారు..
మెదక్‌ జిల్లాకు చెందిన వాణిశ్రీ జబ్బు పడి గాంధీ ఆసుపత్రికి వచ్చింది. వారం రోజుల పాటు ఇన్‌పేషంట్‌గా చేరి చికిత్స చేయించుకుంటోంది.. ఇంతవరకు బాగానే ఉంది.. ఓ రోజు ఉదయం హటాత్తుగా ఓ డాక్టర్‌ వచ్చి ఇంజక్షన్‌ ఇవ్వాలి పక్కగదిలోకి రమ్మన్నాడు... వాణిశ్రీ, ఆమె తల్లి ఇద్దరూ డాక్టర్‌ గదిలోకి వెళ్లారు.. సదరు డాక్టర్‌ ఆ తల్లికి ఓ చీటీపై మందులు రాసిచ్చి తీసుకురమ్మన్నాడు.. ఆమె అలా వెళ్లిందో లేదో... వాణిశ్రీకి డాక్టర్‌ ఇంజక్షన్‌ ఇచ్చాడు.. ఆమె మత్తులోకి జారిపోయింది.. ఆమె తిరిగి లేచేసరికి మూడున్నర తులాల గొలుసు మాయమైపోయింది. చీటీలో ఉన్న మందు తీసుకురావటానికి వెళ్లిన బాధితురాలి తల్లికి అలాంటి మందే లేదంటూ షాపు వాళు్ల చెప్పటం మరో విచిత్రం...
ఇంత జరిగాకైనా సర్కారు నిద్ర లేచిందా అంటే అబ్బే అలాంటి అలవాటు డిక్ష్నరీలోనే లేదు.. వారం తిరక్కుండానే నీలోఫర్‌లో అదే దొంగ మరో దొంగతనం చేశాడు...
రోగులకు పూర్తి భద్రతను కలిపిస్తామని సర్కారు వారు కబుర్లు చెప్పటంలో, ఉపన్యాసాలు దంచేయటంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరు.. అసలు సంగతి దగ్గరకు వచ్చేసరికే, వారికి ఏం చేయాలో కూడా తోచదు.. విచిత్రమేమంటే నీలోఫర్‌ ఆసుపత్రికి కట్టుదిట్టమైన భద్రతే ఉంటుంది.. అయినా దొంగ తన పని తాను కానిచ్చేసుకుని వెళ్తాడు...
ఇక సర్కారీ ఆసుపత్రుల్లో ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మాత్రం ఎవరైనా వెళ్లేందుకు ఎలా సాహసించగలరు?

15, ఫిబ్రవరి 2010, సోమవారం

డయ్యర్‌ వారసులు...


రక్తతర్పణం జరిగింది.. విద్యార్థులతో పాటు... ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా చెప్పుకునే మీడియా ప్రతినిధుల రక్తమూ ఏరులై పారింది... ఆ రుధిర ధారల్లో భద్రతాబలగాల బూట్లు తడిసి సంబరపడ్డాయి. పోలీసులు పదఘట్టనల హోరులో విలేఖరులు, విద్యార్థుల రోదనలు రోదసిలో కలిసిపోయాయి.. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసింది ఎవరు?

ప్రశాంతంగా ఉన్న తెలంగాణాలో అగ్గి రాజేసింది ఎవరు?
ఓయులో రక్త చరిత్రను రచించిందెవరు?
కెమెరా కళ్లకు గంతలు కట్టే సాహసం చేసిందెవరు?
మీడియా ప్రాథమిక హక్కులను కాలరాసిందెవరు?
ఓయు నిషేధిత ప్రాంతమా?
మనం ఏ సమాజంలో ఉన్నాం...?
ఏమిటీ దారుణం?

ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాలో చదువుల చెట్టుకు పోలీసు చెద పట్టింది.. ఈ చెదలు ఇప్పుడప్పుడే వదిలేట్టు లేదు.. ప్రశాంతంగా ఎదుగుతున్న విద్యాఫలాలను పూర్తిగా నాశనం చేసేంత వరకు ఈ చీడ విరగడ అయ్యేట్టు కనిపించటం లేదు.. ఇంతకాలం విద్యార్థులనే పీడించిన ఈ పీడ.. ఇప్పుడు మీడియాకూ పాకింది... విచ్చలవిడిగా తాము సాగించే పాశవికత్వానికి సాక్షీభూతంగా నిలిచిన మీడియాను తొలగించటానికి మూకుమ్మడిగా విరుచుకుపడ్డ తీరు గతంలో బ్రిటిష్‌ పోలీసులకు కూడా తెలిసి ఉండదు.. జలియన్‌ వాలాబాగ్‌లో ప్రజల్ని ఊచకోత కోసిన జనరల్‌ డయ్యర్‌కు కూడా ఈపాటి తెలివి తేటలు ఉండకపోవచ్చు..

ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరుగుతున్న సందర్భంలోనైనా దానికి సంబంధించిన వార్తల్ని కవర్‌ చేసేందుకు మీడియాను అనుమతిస్తారు.. కార్గిల్‌ లోనైనా, ఆఫ్గనిస్తాన్‌లోనైనా, ఇరాక్‌లోనైనా, ప్రపంచానికి ఆ యుద్ధాల వార్తలని ప్రపంచానికి అందజేసింది మీడియానే... ప్రభుత్వానికి, ప్రజలకు ఒక వారధిలా వ్యవహరించేది మీడియా... అలాంటి మీడియా కాళ్లూ చేతులూ కట్టేసి కూర్చోబెట్టడం సాధ్యమేనా?
ఉస్మానియాను ప్రభుత్వం నిషేధ ప్రాంతంగా ప్రకటించలేదు.. ఉస్మానియా ఓ విశ్వవిద్యాలయం... రెండు నెలలుగా ఓయు కేంద్రంగా విద్యార్థులు తెలంగాణా రాష్ట్రం కావాలంటూ ఉద్యమాలు చేస్తున్నారు... వాటిని కవర్‌ చేయటం, అక్కడ చోటు చేసుకుంటున్న ఘటనలను ప్రసారం చేయటం మీడియా విధి.. వార్తలను సేకరించటం, ప్రసారం చేయటం మీడియా ప్రాథమిక హక్కు... దీన్ని కాదనే అధికారం ఎవరికీ లేదు..కానీ ఈ హక్కుపై ఇవాళ పోలీసు ఉక్కుపాదం పడింది...

ఎందుకు మీడియాను పోలీసులు టార్గెట్‌ చేసుకోవలసి వచ్చింది..? కేవలం శాంతిభద్రతలను పరిరక్షించటం కోసమే పోలీసులు బాధ్యతాయుతంగా పని చేస్తుంటే...మీడియా కవరేజి వల్ల జరిగే నష్టం ఏమిటి? అంటే, మరింకేదో చేసేందుకు పోలీసులు పూనుకున్నారు కాబట్టే... మీడియాను అక్కడి నుంచి తప్పించేందుకు పూనుకున్నారు.. వాళ్లపై లాఠీలు ఝళిపించటమే ప్రత్యామ్నాయంగా కనిపించింది... ఇంకేం.. ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయలేదు.. పది మందిపై వందల మంది ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.. కనపడ్డవారిని కనపడ్డట్టుగా చితకబాదారు..
అంతా అయ్యాక తీరిగ్గా.. అయ్యో దురదృష్టం.. సారీ... తప్పయింది.. చూసుకోలేదు.. కావాలని కొట్టలేదు.. అంటూ మాటలు చెప్పుకొచ్చారు.. ఓ పక్క సారీలు చెప్తూనే.. మరోపక్క చితక్కొట్టారు.. ఈ పరిణామం.... ఓ అరాచక వ్యవస్థను...నియంతల పరిపాలనను తలపించింది...రెండో ప్రపంచయుద్ధ కాలంలో మీడియాను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, తాను కోరుకున్న వార్తలు మాత్రమే ప్రచురితమయ్యేలా చేసుకున్న హిట్లర్‌ వ్యవస్థలో ఉన్నామా మనం?

ఉస్మానియాలో ఈ దాడి ఓ పథకం ప్రకారం జరిగిందన్నది నిర్ద్వంద్వం.. లాఠీచార్జీకి విద్యార్థులే బాధ్యులని ఇవాళ తీరిగ్గా కథలు చెప్పటం సర్కారు వారికి వెన్నెతో పెట్టిన విద్యే... వాస్తవానికి విద్యార్థులు రెండు నెలలుగా అక్కడ నిరసనలు, ప్రదర్శనలు చేస్తున్నారు.. దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు.. క్యాంపస్‌లో ఇటు సీఫెల్‌ వరకు, అటు తెలుగు విశ్వవిద్యాలయం హాస్టల్‌ వరకు ప్రదర్శనలు చేస్తారు.. నినాదాలు చేస్తారు.. ఈలోగా అక్కడ విధ్వంసం చేసేందుకు ఏమీ లేవు.. ధ్వంసం చేసుకుంటే వారి కాలేజీలను వారే ధ్వంసం చేసుకోవాలి.. వారి పుస్తకాలను వారే తగులబెట్టుకోవాలి.. అలా జరిగే అవకాశం ఎలాగూ లేదు.. అలాంటప్పుడు క్యాంపస్‌లోకి వెళ్లి అక్కడ టెంట్‌ వేయాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చింది...? క్యాంపస్‌ దాటి బయటకు వస్తే వారిని అడ్డుకోవచ్చు... అంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే క్యాంపస్‌లోపల క్యాంప్‌ పెట్టారా?
విద్యార్థులే కవ్వించారని పోలీసులు అంటున్నారు.. రెండు నెలలుగా లేని కవ్వింపు.. నిన్నటి ప్రదర్శనలోనే ఉన్నట్టుండి చోటుచేసుకుందా? ఒక వేళ విద్యార్థులు కవ్విస్తే.. ఇంత పైశాచికంగా కొడ్తారా? అది కవర్‌ చేసిన పాపానికి మీడియాపై దురాగతానికి పాల్పడతారా? ఈ ఘటనతో మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు బలగాలు చాలా చక్కని నిర్వచనం ఇచ్చాయి...ఇలాంటి పోలీసులను మనం రక్షక భటులని పిలుస్తున్నాం.. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంటుంది?
జమ్ము కాశ్మీర్‌ సరిహద్దుల్లో నిత్యం ఘర్షణలతో దద్దరిల్లిపోయే ప్రాంతాన్ని పిఓకే.. పాక్‌ ఆక్యుపైడ్‌ కాశ్మీర్‌ అని పిలుస్తారు.. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి ప్రాంతంగా పిఓయు తయారైంది.. అంటే పోలీస్‌ ఆక్యుపైడ్‌ ఉస్మానియా...

12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

శ్రీ కృష్ణ కమిటి విధివిధినాలను ప్రకటించారు

శ్రీ కృష్ణ కమిటి విధివిధినాలను కేంద్ర హోం శాఖ పీఆర్‌ఓ ఓంకార్‌ కేడియా ప్రకటించారు.. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకూ దీనికి కాలపరిమితి విధించారు. మొత్తం ఏడు అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించింది.
ఏడు అంశాలను కేంద్ర హోంశాఖ ఇవాళ ప్రకటించింది.
1. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తో పాటు రాష్ట్రాన్ని యదాతథంగా ఉంచాలన్న డిమాండ్లను కమిటీ అధ్యయనం చేస్తుంది.
2.రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి.. ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధిని సమీక్షించడంతో పాటు.. వివిధ ప్రాంతాల్లో డెవలప్‌మెంట్ ప్రోగ్రెస్‌ను కమిటీ పరిశీలిస్తుంది.
3.మహిళలు, విద్యార్థులు, మైనార్టీలు, ఎస్సీ,ఎస్టీ, బీసీలపై.. ఇటీవలికాలంలో జరిగిన అభివృద్ధిపైనా కమిటీ దృష్టి పెడుతుంది.
4.ఈ మూడు అంశాలకు సంబంధించి కీలకమైన విషయాలను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ గుర్తిస్తుంది.
5.రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడంతోపాటు.. అందరి సంక్షేమం కోసం రాజకీయ పార్టీల నుంచి సలహాలు స్వీకరించి.. రోడ్‌మ్యాప్‌కు ప్రణాళికను కమిటీ రూపొందిస్తుంది.
6. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికోసం.. ట్రేడ్‌యూనియన్లు, రైతుసంఘాలు, మహిళ,విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు జరుపుతుంది.
7. కమిటీ ప్రాధాన్యం ఉందని భావించిన ఇతర అంశాలపైనా సలహాలు, సూచనలను చేస్తుంది. ఇలా ఏడు అంశాలతో విధివిధానాలను రూపొందించిన ప్రభుత్వం.. కమిటీ కాలపరిమితిని డిసెంబర్ 31 వరకూ విధించింది.




10, ఫిబ్రవరి 2010, బుధవారం

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు !

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు దాదాపుగా ఖరారయ్యాయి. కోల్‌కతాలో నక్సల్‌ సమస్యపై జరుగుతున్న సమావేశంలో ఉన్న కేంద్ర హోం మంత్రి చిదంబరం ఢిల్లీ తిరిగి వచ్చిన తరువాత ఈ సాయంత్రం కమిటీ టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్సెస్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎనిమిది నెలల నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల డిమాండ్లను సమన్వయ పరుస్తూ ఈ విధి విధానాలను కేంద్ర హోం శాఖ ఆచితూచి రూపొందించింది...

రాష్ట్ర రాజకీయం ఆసక్తిగా ఎదురు చూస్తున్న జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తుదిరూపునిచ్చింది. ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీల ఆమోద ముద్ర పడిన వెంటనే వీటిని కేంద్ర హోం మంత్రి ప్రకటిస్తారు... కమిటీ ఏ విధంగా పనిచేయాలి.. ఏయే అంశాలపై దృష్టి సారించాలన్న విషయంపై కేంద్ర హోం శాఖ తీవ్రంగా కసరత్తు చేసింది. జస్టిస్‌ శ్రీకృష్ణ, కమిటీ కార్యదర్శి వికె దుగ్గల్‌లతో పూర్తి స్థాయి సంప్రతింపులు జరిపిన తరువాత ఈ మార్గదర్శకాలు ఖరారయినట్లు తెలుస్తోంది..
౧. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీకృష్ట కమిటీ కాలపరిమితి ఎనిమిది నెలలుగా విధించే అవకాశం ఉంది. అవసరమైతే మరో నాలుగు నెలలు ఈ కాలపరిమితిని పొడిగించవచ్చని కేంద్ర హోం శాఖ వర్గాలు చెప్పాయి...౨. రాష్ట్రంలో నెలకొన్న సమస్యకు సామరస్య పూర్వక పరిష్కారాన్ని చూపడం జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ప్రధాన బాధ్యత.
౩. కమిటీ మార్గదర్శకాల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ఏ ఒక్క ప్రాంతానికీ మొగ్గు చూపకుండా జాగ్రత్త పడ్డారు..
౪. అదే సమయంలో ఉద్యమాలకు ప్రధాన కారణమైన తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు..
౫. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి మాత్రమే ప్రాతిపదిక కాదు..
తెలంగాణ వెనుకబాటు తనం.. అందుకు గల కారణాలను కమిటీ పూర్తిగా పరిశీలిస్తుంది. ఇందుకోసం పలు అంశాల అజెండాను రూపొందించారు..
౬. జస్టిస్‌ ఫజల్‌ అలీ నేతృత్వంలో మొదటి రాష్ట్రాల పునర్విభజన కమిటీలో తెలంగాణ గురించి ప్రస్తావించిన చారిత్రక, సామాజిక, అభివృద్ధి అంశాలను ప్రస్తుత కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది.
౭. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు... అవసరాన్ని బట్టి మరింత లోతుల్లోకి వెళ్లి సమస్యను పరిష్కరించటమే లక్ష్యంగా జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ పనిచేస్తుంది.

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ న్యూఢిల్లీ, హైదరాబాద్‌ కేంద్రాలుగా పనిచేస్తుంది. ప్రభుత్వం లాంఛనంగా నోటిఫికేషన్‌ జారీ చేసిన వారం రోజుల్లోగా మొదటి సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ఇతర వర్గాలు, ప్రజలతో విస్తృతంగా చర్చలు జరుపుతుంది..
అన్నింటికంటే కీలకం జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం కావచ్చు... కానీ, దీని మార్గదర్శకాలు భవిష్యత్తులో వెల్లువెత్తే చిన్న రాష్ట్రాల డిమాండ్ల ను సమర్థంగా ఎదుర్కునేందుకు బ్లూప్రింట్‌ గా ఉండేట్లు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది..

8, ఫిబ్రవరి 2010, సోమవారం

బిరుదురాజు రామరాజు కన్నుమూశారు


ప్రముఖ సాహిత్య వేత్త, జానపదాల పరిశోధకులు ఆచార్య బిరుదురాజు రామరాజు ఈ ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు.. ఆయన వయస్సు ౮౬ సంవత్సరాలు.. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.. తెలుగు సాహిత్యంలో మరుగున పడిపోతున్న జానపద సాహిత్యాన్ని, గేయాలను పరిశోధించి వెలుగులోకి తీసుకువచ్చిన మేధావి ఆయన.. జానపదాలలోని అనేక ప్రక్రియలను తెలుగు ప్రపంచానికి మరోసారి పరిచయం చేసిన సాహిత్యవేత్త రామరాజు.. దీంతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న యోగుల గురించి ఆరు సంపుటాల్లో పరిశోధనాత్మక గ్రంథాలను వెలువరించారు.. జాతీయ ప్రొఫెసర్‌గా అరుదైన గౌరవం పొందిన ఆచార్యులు బి.రామరాజు... ఆయన మృతికి ప్రజాకవి, అందశ్రీ, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు..



3, ఫిబ్రవరి 2010, బుధవారం

అసలైన ఫాదర్స్ డేగా ఫిబ్రవరి 2 nu జరుపుకోవాలి

ఇష్టమైంది తొలగిపోయింది.. అయిష్టమైంది మిగిలిపోయింది. ప్రేమ దూరమైంది... కన్నపేగు తెగిపోయింది. ఆ కన్న గుండె ఎలా తట్టుకుంటుంది... వైసూ.. వైసూ అని ౭౨ గంటల పాటు పలవరించిన ఆ గుండె... తన పిలుపుకు ఇక జవాబు రాదని తెలిసి అలసిపోయి ఆగిపోయింది..
మూడు రోజుల క్రితం వరకు ఆ ఇల్లు పూదోట.. ఆనందం తప్ప అలజడే తెలియని భవనం అది.. భార్యాభర్త.. ముగ్గురు పిల్లలు.. కావలసినంత ఆస్తి.. అంతు లేని ఆప్యాయతలు.. తమకు అసలు కోరతే లేదనుకున్నారు.. రాదనుకున్నారు.. సంతోషం తప్ప మరేదీ ఉండదని తలచారు..
ఇప్పుడు అంతా కొరతే... కొరతే...

అనుకోకుండా వచ్చిన సునామీలో అంతా కొట్టుకుపోయింది... కలల సౌధం కుప్పకూలిపోయింది. శాంతియుత వాతావరణం భగ్నమైంది.. నిన్నటి దాకా అన్నీ ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా అనాథగా మారింది... ఇది ఆ ఒక్క కుటుంబానికే కాదు.. రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా నివ్వెర పోవటం కూడా కష్టమే అయింది... ఏమిటీ దారుణం? ఎందుకింత కష్టం? ప్రతి మాటలో, ప్రతి చర్చలో, ప్రతి ఆలోచనలో ప్రకంపన సృష్టించిన ఘటన...దీనికి మరపు లేదు.. అది సాధ్యం కాదు..

వైసూ... వైసూ.. ఆయన గుండెంతా ఇదే చప్పుడు... తొమ్మిదేళ్ల పాటు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నప్రేమ... పుట్టినప్పటి నుంచి తన చిన్నారి పాపను పొత్తిళ్లలో దాచుకుని కాపాడుకున్న తండ్రి ప్రభాకర్.. చివరి నిమిషం వరకూ భద్రంగానే తిరిగి వస్తుందని అనుకున్నాడు... డబ్బుల కోసమే తన పాపను దుండగులు ఎత్తుకెళ్లారని.. పోలీసుల హడావుడి కాస్త తగ్గిన తరువాత డబ్బులు డిమాండ్ చేస్తే ఇచ్చేసి తన పాపను తాను తెచ్చుకుంటాననే ధీమాతోనే ఉన్నాడు... కానీ, దుండగులు డబ్బుల కోసం కాకుండా ఉసురు తీసేందుకే తన పాపను ఎత్తుకెళ్లారని ఊహించలేకపోయాడు.. మూడు రోజుల తరువాత తన చిన్నారిని నిప్పుల కొలిమిలో బూడిద చేయటం అంతటి తండ్రినీ ఒక్కసారిగా దిగ్భ్రమకు గురిచేసింది.. ఏ దశలోనూ అలా జరుగుతుందని ఊహించనైనా ఊహించని తండ్రి ఒక షాక్కు గురవటం దురదృష్టం.. అదే షాక్లో ఆయన హృదయం చలించటం మానేసింది..

ఆ తండ్రికి కూతురిపై ఉన్న ప్రేమ అంత గొప్పది.. వైష్ణవి చనిపోయినప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధపడ్డారు.. కానీ, కూతురి కోసం తండ్రి విగత జీవుడవటాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు..
మనం ప్రపంచంలో ఎన్నో జీవితాలను చూస్తున్నాం.. ఎన్నో వార్తల్ని కంటున్నాం.. కానీ, ఇలాంటి ఘటన అనూహ్యం... అందుకే ఈ తండ్రీ కూతుళ్ల ప్రేమకు శాశ్వతత్వం కల్పించాలని ప్రజానీకం బలంగా కోరుకుంటున్నారు... అంతర్జాతీయంగా ఎన్నో రోజుల్ని ప్రత్యేకంగా మనం జరుపుకుంటున్నాం.. మదర్స్డే.. ఫాదర్స్ డేలు అందులో కొన్ని... ఇవి ఎందుకోసం జరుపుకుంటారో మనలోనే చాలా మందికి తెలియదు.. ఇదిగో ఫిబ్రవరి ౨ ప్రభాకర్ తన పాప కోసం ప్రాణం విడిచిన రోజును ఫాదర్స్డేగా ఎందుకు జరుపుకోకూడదు.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నది ఇదే..
ఇది నిజం.. తండ్రి ప్రేమకు అసలైన నిర్వచనం వెల్లడైన రోజు ఫిబ్రవరి 2....
ఇది నిజం.. కూతురిపై ఆప్యాయత ప్రతిఫలించిన రోజు ఫిబ్రవరి 2....
ఇది నిజం... కూతురంటే గుండెలపై కుంపటి కాదు... ఆనందాల సందడి అని రుజువైన రోజు ఫిబ్రవరి 2...
ఇది నిజం.. కన్న కూతురికోసం తండ్రి హృదయం తల్లడిల్లిన రోజు ఫిబ్రవరి 2...
ఇది నిజం.. కూతురి ప్రాణం తన ప్రాణంగా తండ్రి గుండె ఆగిపోయిన రోజు ఫిబ్రవరి 2...
అందుకే ఆ తండ్రీ తనయల ప్రేమను అజరామరం చేయాలి..అసలైన ఫాదర్స్ డేగా ఫిబ్రవరి 2ను జరుపుకోవాలి...




తెలంగాణాపై కమిటీ ఏర్పాటు

తెలంగాణాపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మొత్తం మీద కమిటీని ఏర్పాటు చేసింది. ఏ వర్గానికీ ఇబ్బంది లేకుండా, విధి విధానాలను ఖరారు చేయకుండానే ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీకృష్ణ దీనికి నేతృత్వం వహిస్తారు.. ఈయనతో పాటు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ రీసర్చ్‌ ఫెలో డాక్టర్‌ అబు సలీం షరీఫ్‌, ఢిల్లీ ఐఐటిలో హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవీందర్‌ కౌర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు..
కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి వినోద్‌ కె.దుగ్గల్‌ కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తారు..
డిసెంబర్‌ 9, 23౩న కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనలు, జనవరి 5న ఎనిమిది రాజకీయ పార్టీలతో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వచ్చిన డిమాండ్లను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు హోం శాఖ ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలు, గ్రూపులు, ప్రజలతో విస్తృతమైన చర్చలు జరుపుతుందని మాత్రమే వెల్లడించింది. ఈ ప్రకటనలో హోం శాఖ ఎక్కడా తెలంగాణా ఊసు ఎత్తలేదు.. కమిటీ చైర్మన్‌తో చర్చించిన తరువాతే విధి విధానాలను ఖరారు చేస్తారని పేర్కొంది..



2, ఫిబ్రవరి 2010, మంగళవారం

ఆరోప్రాణం



ఒక పసి మొగ్గను విరిసీ విరియకుండానే చిదిమేశారు.. తాను ఎంతో అపురూపంగా చూసుకుంటున్న మొగ్గ తన కళ్ల ముందే రాలిపోతే చెట్టు తట్టుకోలేకపోయింది... ఒక్కసారిగా కూకటివేళ్లతో సహా కుప్ప కూలిపోయింది... ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకున్న కొమ్మలూ, రెమ్మలూ ఏం కావాలి? దానిపై గూడు కట్టుకున్న పక్షులు ఎక్కడ తలదాచుకోవాలి..
తప్పు చేసిందెవరు?
శిక్ష అనుభవిస్తున్నదెవరు?
ఆ తండ్రీ కూతుళ్లు ఎవరికి అపకారం చేశారు..?
చిట్టితల్లిని వేల డిగ్రీల కొలిమిలో వేసి బూడిద చేసేంత కసాయిలు ఎవరు?
ఎందుకిలా జరిగింది?

ఎవరికీ అర్థం కావటం లేదు.. ఎంతకీ అంతుపట్టడం లేదు.. రాష్ట్ర మంతటా ఒకటే ఆలోచన.. ఒకే ఆవేదన.. ఈ కాలంలో కూడా ఇలాంటి దారుణాలు ఉంటాయా? అనే అందరినీ తొలుస్తున్న ప్రశ్న.. ఎన్నో కిడ్నాపు వార్తలు కన్నాం.. విన్నాం...హత్యలూ చూశాం... కానీ, విజయవాడలో పెను విషాదంగా ముగిసిపోయిన కిడ్నాపు ఉదంతం ఏ ఒక్కరికి మింగుడు పడటం లేదు..
బెజవాడలో పసిపిల్ల నాగవైష్ణవిని కిడ్నాప్‌ చేసినప్పుడు అంతా ఇదొక వార్త అనుకున్నారు..
టెలివిజన్లలో ఆమె చిత్రాన్ని చూసినప్పుడు అంత చక్కని అమ్మాయి క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నారు..
౪౮ గంటల తరువాత కూడా ఆ అమ్మాయి చనిపోయిందన్న వార్త విని చలించిపోయారు..
అయ్యో పాపం అని బాధపడ్డారు.. ఆగ్రహించారు..దుర్మార్గులు దొరికితే తామే చంపేస్తామన్నారు...
తెల్లవారేసరికి తన బిడ్డ ప్రాణం తన ప్రాణంగా చేసుకున్న ఆ తండ్రి చనిపోవటం ప్రజల్ని ఒక కుదుపు కుదిపింది...
ఒక్కసారిగా ఊపిరి స్తంభించిపోయింది..
ప్రతి శరీరం ఉన్న పాటున ఉలికిపాటుకు గురైంది...
ప్రతి ప్రాణం కలవర పడింది...
ఎవరికీ అర్థం కావటం లేదు.. ఎంతకీ అంతుపట్టడం లేదు..
కూతురును పదకొండేళ్ల పాటు ఎంతో అపురూపంగా పెంచుకున్న తండ్రి ప్రేమ..
చిట్టితల్లిని కిడ్నాప్‌ చేసిన క్షణం నుంచి ఆమెకోసం అహరహం పరితపించిన నాన్న మనసు...
మీరేం అడిగినా ఇస్తా... మీ పైన కేసులూ పెట్టను.. నా పాపను నాకివ్వండి.. ఎక్కడో ఓ చోట వదిలిపెట్టండి.. నేను తెచ్చుకుంటానని ప్రాధేయపడ్డ హృదయం...
ఆమె లేదని తెలిసి.. అతి కిరాతకంగా బూది చేసారని విని భళ్లున పగిలిపోయింది. శ్వాస ఆగిపోయింది. కూతురితోపాటే తానూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. ఒకే ఊపిరిగా, ఒకే ప్రాణంగా.....

‘‘నేను తండ్రిని.. ఓ కూతురికి తండ్రిని.. తల్లే కాదు.. తండ్రి కూడా బిడ్డల కోసం ప్రాణాలిస్తాడు.. నా వైష్ణవిని కూతురిలా కాదు.. పూవులా పదిలంగా పెంచుకున్నాను..గుండెల్లో దాచుకున్నాను.. ఆడపిల్ల తండ్రి గుండెలపై కుంపటి కాదు.. కలల పంట.. ఆశల మూట.. ఆనందాల పూదోట అని ప్రతి తండ్రికీ చెప్పాలనుకున్నాను.. చెప్పకుండానే వెళ్లిపోతున్నాను.. ’’ అని అనుకుంటూ వెళ్లిపోయాడు.
ఆ కూతురిపై ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పది.. కూతురిపై ఇంతగా ప్రేమను పంచుకుని.. ఆమెను ప్రాణంగా పదిలపరుచుకున్న తండ్రి ప్రభాకర్‌... ఆమెతో పాటే వెళ్లిపోవటం ప్రజలందరిలో ఒక ఉద్వేగానికి కారణమైంది. ఇప్పుడు ఆ కుటుంబం వ్యథ తీర్చేదెవరు? ఒకే సారి భర్త, కూతురును పోగొట్టుకున్న ఆ ఇల్లాలి వేదన చల్లారేది ఎలా?
ఇవాళ తన బంధువుల్ని హటాత్తుగా కోల్పోయిన కుటుంబం ఈ రాష్ట్రం.. శోకతప్త హృదయంతో తల్లడిల్లిపోతోంది.. ఈ ఘోరాన్ని చూడలేక.. విషాదాన్ని దిగమింగుకోలేక మౌనంగా రోదిస్తోంది..