28, ఫిబ్రవరి 2012, మంగళవారం

ద్రవ్యోల్బణం...ఎవరికీ అర్థం కాని బ్రహ్మపదార్థం

ద్రవ్యోల్బణం... దేశ ఆర్థిక వ్యవస్థలో ఇదో విచిత్రమైన పదం.. ఎవరికీ అర్థం కాని బ్రహ్మపదార్థం. దీని సూచీ ఎందుకు పెరుగుతుందో.. ఎందుకు తగ్గుతుందో.. దీనికీ, ధరల సూచీకీ ఉన్న సంబంధం ఏమిటో.. ᆱద్రవ్యోల్బణం సూచీ పెరిగితే ధరలు పెరుగుతాయని, తగ్గితే తగ్గుతాయని చెప్తారు... కానీ, ఇప్పుడు మైనస్‌లోకి పడిపోయినా ధరలు తగ్గటం లేదు... పైగా చుక్కలనంటుతున్నాయి.  ఇదంతా ఒక  మాయ.. దీన్ని  ఎలా అర్థం చేసుకోవాలో  సామాన్య ప్రజానీకానికి అంతుపట్టని వ్యవహారం..
అర్థ శాస్త్రంలో  ఇన్‌ఫ్లేషన్‌ అంటే వివిధ వస్తువులు, సర్వీసులకు సంబంధించి సాధారణ స్థాయిలో ఉండే ధరలు అని అర్థం. దీన్నే ద్రవ్యోల్బణం అని మనం చెప్పుకుంటాం. దీన్ని ఒక నిర్ణీత కాలానికి లెక్కిస్తారు. అమెరికన్‌ సివిల్‌ వార్‌ సమయంలో ప్రెユవేట్‌ బ్యాంక్‌ నోట్‌ కరెన్సీ ప్రింట్‌ అయింది. అప్పుడే  మొట్టమొదటిసారిగా ఇన్‌ఫ్లేషన్‌ అన్న పదం ప్రత్యక్షంగా వాడుకలోకి వచ్చింది. కరెన్సీ డిప్రిసియేషన్‌ను సూచిస్తూ దీన్ని ఉపయోగించారు. మన కరెన్సీలోని ప్రతి రూపాయితో  వస్తువులను కానీ, సర్వీసులను కానీ కొనుగోలు చేస్తాం. మనీకి ఉండే నిజమైన విలువ, ప్రజల కొనుగోలు శక్తి మన ఆర్థిక వ్యవస్థలో జమాఖర్చులను ప్రభావితం చేస్తాయి. ఒక విధంగా సాధారణ ద్రవ్యోల్బణం రేటు వినియోగ దారుల ధరల సూచి అని చెప్పవచ్చు. ఇన్‌ఫ్లేషన్‌ రేటు సందిగ్ధంగా ఉంటే దాని వల్ల ఆర్థిక వ్వయస్థపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. పెట్టుబడులకు ప్రోత్సాహం లభించదు. హై ఇన్‌ఫ్లేషన్‌ రేటు వస్తువుల కొరతకు కారణమవుతాయి. ఇది స్థూల జాతీయోత్పత్తిపైనా ప్రభావం చూపుతుంది.  అందువల్లే ద్రవ్యోల్బణం అంటే అటు పాలకులకు, ఇటు పారిశ్రామిక వేత్తలకు అంత హడల్‌..

నిపుణులు చెప్పినట్లు ద్రవ్యోల్బణ సూచీ పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి. దీనిపై ఎవరికీ ఎలాంటి ఆక్షేపణ లేదు. కానీ, అదే సూచీ పడిపోయినప్పుడు ధరలు కూడా పడిపోవాలి కదా? కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. సరిగ్గా ఏడాది క్రితం ఇన్‌ఫ్లేషన్‌ రేటు పధ్నాలుగు శాతం చేరుకున్నప్పుడు పాలకులకు చెమటలు పట్టాయి. అప్పుడు ధరలను చూస్తే కందిపప్పు వంద రూపాయలు, బియ్యం నలభై రూపాయలు.. అన్ని వస్తువుల ధరలూ అమాంతంగా పెరిగిపోయాయి. ప్రజలు ఏదో భరించారు... సరే ఆ తరువాత రిజర్వు బ్యాంకు రెపోరేట్లను సవరించటం, ఇతర ఏర్పాట్లు చేయటంతో  ద్రవ్యోల్బణం రేటు కొంత తగ్గినట్లు అనిపించింది..  తగ్గినప్పుడు ఎలాగూ ధరలు తగ్గుతాయని అనుకున్నారు. ఆశపడ్డారు. కానీ పరిస్థితి తిరగబడింది. ఒక దశలో శాస్త్రీయతకు భిన్నంగా ద్రవ్యోల్బణం రేటు పూర్తిగా నెగెటివ్‌ జోన్‌లోకి పడిపోయింది.
అలాంటప్పుడు ధరలు పూర్తిగా తగ్గాలి. కానీ, అలా జరగలేదు. ఇన్‌ఫ్లేషన్‌ రేటు ఎక్కువగా ఉన్నప్పటికంటే ఎక్కువగా రేట్లు పెరిగిపోయాయి. అప్పుడు ఆ ధరలను భరించిన ప్రజలు ఆ తరువాతా.. భరిస్తూనే ఉన్నారు.
తరువాత పెరిగితే ఊహించని స్థాయిలో పెరిగిపోవటం.. తగ్గితే అనూహ్యంగా పడిపోవటం.. ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తోంది. బంగారం ధరలు కనీవినీ ఎరుగని స్థాయిలో పెరిగిపోయాయి. కంట్రోలింగ్‌ అనే పదానికి అర్థమే లేకుండా పోయింది ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గర.

ఇప్పుడయితే దేని రేటు ఎంత ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి..   చివరకు కూరగాయలూ కొనే పరిస్థితి కనుచూపు మేరలో కొనే పరిస్థితి కనిపించటం లేదు. వంద రూపాయల నోటుకు ఒక రూపాయికున్నంత విలువ కూడా లేకుండా  పోయింది.
ద్రవ్యోల్బణం లెక్కింపులోని డొల్లతనాన్ని ఈ పరిణామం సూచిస్తున్నది. టోకు ధరల సూచీ ఆధారంగా దీన్ని లెక్కించటం వల్ల ఇన్‌ఫ్లేషన్‌ నెగెటివ్‌ జోన్‌లో పడిపోయిందని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో డిమాండ్‌ పడిపోవటం వల్ల ద్రవ్యోల్బణం మైనస్‌ అయిందని, మనం ఒక విధంగా డేంజర్‌ జోన్‌లోకి వెళ్లినట్లేనని మరికొందరు అంటున్నారు.

ద్రవ్యోల్బణాన్ని తప్పుగా లెక్కిస్తున్న వాస్తవాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికి గుర్తించింది. వాస్తవాన్ని వాస్తవంగా ప్రతిబింబించే స్థాయిలో  కొత్త ద్రవ్యోల్బణ సూచీని తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, అది జరగలేదు..  టోకు ధరల ఆధారంగానే సూచించే ప్రయత్నమూ విఫలమైంది.  వాస్తవ ధరల ముఖచిత్రాన్ని నిష్కర్షగా ఆవిష్కరించే విధంగా ద్రవ్యోల్బణ సూచీ అవసరం. సూచీ మాటెలా ఉన్నా,  మోత మోగిస్తున్న ధరలను ఆకాశం నుంచి కిందకు దింపటానికి ప్రణబ్‌ ముఖర్జీ తన బడ్జెట్‌లో అర్జెంటుగా తీసుకునే చర్యలు ఏమిటన్నది ఇప్పటికి మాత్రం సస్పెన్సే....

బడ్జెట్‌-అంటే ఏమిటి?

బడ్జెట్‌ అనగానే మామూలు ప్రజలకు అర్థమయ్యేది ఒకే ఒక్కటి.. ధరలు.. ఏ వస్తువు ధర పెరిగింది? ఏ వస్తువు ధర తగ్గింది? రైతులకైతే.. అప్పులేమైనా మాఫీ చేస్తున్నారా? విత్తనాలపై సబ్సిడీ ఇస్తున్నారా అనేదే తెలుస్తుంది. ఇక ఉద్యోగుస్థులైతే ఇన్‌కమ్‌టాక్స్‌ పరిమితి ఏమైనా పెంచారా? లేదా? అన్నది తెలుసుకుంటే చాలనుకుంటారు.. బడ్జెట్‌ అంటే ఇంతేనా? ఇంకేమైనా ఉందా? అంటే బోలెడు ఉందనే చెప్పాలి.. అంతా అనుకున్నట్లు బడ్జెట్‌  బ్రహ్మపదార్థమేం కాదు.. కొంత మనసు పెట్టి  గమనిస్తే.. చాలా తేలిగ్గా అర్థమవుతుంది...

ప్రతి వ్రభుత్వానికి ప్రజల పట్ల తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించటానికి మానవ వనరులతో పాటు ఆర్థిక వనరుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజల సంక్షేమం కోసం చేసే ఖర్చుల కోసం పన్నులు, సుంకాలు, సెస్‌లు, అప్పులు ఇతర రూపాలలో నిధులు సమీకరిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం పార్లమెంటులో వార్షిక ఆర్థిక ప్రతిపాదనలు చేసి ఆమోదం పొందుతుంది. సదరు ఆర్థిక సంవత్సరంలో ఆ ప్రతిపాదనలనే ఆమలు చేస్తారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఖర్చు చేయాల్సి ఉంటుంది.
రాజ్యాంగంలోని 112 వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పేరు మీదుగా ఆర్థిక సంవత్సరపు వార్షిక స్టేట్‌మెంట్‌ తయారవుతుంది.  అయితే దాన్ని తయారు చేసే బాధ్యత 77(3)వ అధికరణం ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రిపై ఉంటుంది. ఈ స్టేట్‌మెంట్‌కే బడ్జెట్‌ అని పేరు.
కేంద్ర ఆర్థిక మంత్రి జనరల్‌ బడ్జెట్‌తో  పాటు రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రాల బడ్జెట్‌ కూడా పార్లమెంటులో ప్రవేశపెడతారు.

 బడ్జెట్‌ రూపకల్పనలో భాగస్వామ్యం పంచుకునే విభాగాలు...విధులు
メ కేంద్ర ప్రణాళికా సంఘం...
అన్ని మంత్రిత్వ శాఖలకు ఇది ఓవరాల్‌ టార్గెట్‌లను నిర్దేశిస్తుంది.
メ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌...(కాగ్‌)
అక్కౌంట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. నిఘా వేస్తుంది.
メ అడ్మినిస్ట్రేటివ్‌ మినిస్ట్రీస్‌.. ప్రణాళికా ప్రాధాన్యాలను నిర్ణయించేముందు  ఆర్థిక మంత్రి
అడ్మినిస్ట్రేటివ్‌ మినిస్ట్రీస్‌ విభాగాన్ని తప్పక సంప్రతిస్తారు.
メ వ్యయం.. ఖర్చుకు సంబంధించిన రెవెన్యూ విభాగం...
メనాన్‌-టాక్స్‌- ఆర్థిక వ్యవహారాల విభాగం
メపన్నులు- రెవెన్యూ విభాగం
メలోటు-ఆర్థిక వ్యవహారాల విభాగం

నిజానికి ప్రతి సంవత్సరం బడ్జెట్‌ ప్రక్రియ సెప్టెంబర్‌లోనే ప్రారంభమవుతుంది.
కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ అన్ని మంత్రిత్వ శాఖలకు, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, వివిధ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన శాఖలకు బడ్జెట్‌ సర్క్యులర్‌ విడుదల చేయటంతో ప్రారంభమవుతుంది. ఆయా విభాగాలు, రాష్ట్రాలు నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి తమ అంచనాలను సవరించుకోవటంతో పాటు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి  తమ ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖకు పంపిస్తాయి.  ఈ ప్రతిపాదనలన్నీ అందిన తరువాత అడ్మినిస్ట్రేటివ్‌ మినిస్ట్రీస్‌, ఇతర కీలక విభాగాలతో సమావేశాలు నిర్వహిస్తుంది. అవసరమైన వ్యయ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.
దేశంలోని వివిధ వర్గాల నుంచి తమకు లభించే ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంది.  వ్యవసాయం, రైతులు, కార్మికులు, సామాజిక వర్గాల నుంచి వచ్చే ఆదాయాలను బేరీజు వేస్తుంది. ఆదాయ వనరుల సమీకరణ ఎలా చేయాలో, ఎన్ని అవకాశాలు ఉన్నాయో రెవిన్యూ విభాగంతో సంప్రతించి ప్రతిపాదనలు రెడీ చేస్తారు...
ఆ తరువాత ఖర్చుల అంచనాలను తయారు చేస్తారు. ప్రీ బడ్జెట్‌ మీటింగ్‌లు అయిపోయిన తరువాత స్టేట్‌మెంట్‌ బడ్జెట్‌ ఎస్టిమేట్స్‌ను బడ్జెట్‌ డివిజన్‌కు పంపిస్తారు.  అక్కడ తుది పన్నుల ప్రతిపాదనలు తయారవుతాయి. ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి వీటికి తుదిరూపాన్ని ఇస్తారు.....

చివరకు ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం తయారవుతుంది. ఇది రెండు విభాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో సాధారణ ఆర్థిక వ్యవహారాలు, విధాన ప్రకటనలు ఉంటాయి. రెండో భాగంలో వివిధ రకాల పన్నుల గురించిన ప్రతిపాదనలు చోటు చేసుకుంటాయి.
లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత రాజ్యసభలోనూ ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు.
బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వెంటనే లోక్‌సభ దానిపై చర్చ ప్రారంభిస్తుంది. సభ్యుల సూచనలు సలహాలు తీసుకున్న తరువాత ఆర్థిక మంత్రి జవాబిస్తారు. అనంతరం బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఓటింగ్‌ జరుగుతుంది. సాధారణ మెజారిటీతో పార్లమెంటు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఓడిపోతే.. రాజీనామా చేయాల్సి ఉంటుంది.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన ఆర్థిక మంత్రులు

1.
లియాఖత్‌ అలీఖాన్‌(1946-47)
1946లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. ఆల్‌ ఇండియా ముస్లింలీగ్‌లో క్రియాశీల నాయకుడైన లియాఖత్‌ అలీఖాన్‌ భారత విభజనలో కీలక పాత్ర పోషించారు.  మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ ముస్లిం లీగ్‌ ప్రతినిధిగా లియాఖత్‌ అలీఖాన్‌ను మంత్రివర్గంలో చేర్చుకుని ఆర్థిక శాఖను అప్పజెప్పారు. 1947లో పాకిస్తాన్‌ ఏర్పాటైన తరువాత స్వతంత్ర పాకిస్తాన్‌కు మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు...
2.
ఆర్‌.కె.షణ్ముగం శెట్టి(1947-48)
స్వతంత్ర భారత దేశానికి మొదటి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన తొలి ఆర్థిక మంత్రి ఆర్‌కె షణ్ముగంశెట్టి. 1947 నవంబర్‌ 26న మొదటి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో దేశ ఆర్థిక పరిస్థితిపై సమీక్ష తప్ప ఎలాంటి కొత్త పన్నులు విధించలేదు. ఎందుకంటే మరో 95రోజుల్లో పూర్తి స్థాయిలో 1948-49 బడ్జెట్‌ ప్రవేశపెట్టాలి కాబట్టి  తొలి బడ్జెట్‌ రివ్యూకే పరిమితమైంది. ఈయన్ను కొద్ది రోజులకే ప్రధానమంత్రి నెహ్రూ రాజీనామా చేయించారు.
3.
కెసి నెర్గీ..(1948)
కేవలం 35 రోజులపాటే కేంద్ర ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఒకే ఒక్కడు... నెర్గీకి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశమే రాలేదు.

4
జాన్‌ మొథాయ్‌(1948-50)
ఈయన ఒక ఆర్థిక వేత్త. దేశ తొలి రైల్వే మంత్రిగా వ్యవహరించారు. తరువాత ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టారు. ఈయన వరుసగా రెండు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. 1950లో ప్రణాళికా సంఘానికి ఎక్కువ అధికారాలు కట్టబెట్టిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో రాజీనామా చేశారు.
5
సిడి దేశ్‌ముఖ్‌(1950-56)
ఈయన ఆర్థిక మంత్రి కావటానికి ముందు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు తొలి గవర్నర్‌గా పనిచేశారు. 1951లో తొలి జనరల్‌ ఎన్నికల నేపథ్యంలో  బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. తొలి ఎన్నికలు 1951-డిసెంబర్‌-1952 ఫిబ్రవరిలో జరిగాయి. ఎన్నికల తరువాత ఏర్పడ్డ ప్రభుత్వంలో  దేశ్‌ముఖ్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బడ్జెట్‌ కాపీలను హిందీలో తయారు చేయటం ఈయన హయాంలోనే మొదలైంది. తొలి రెండు పంచవర్ష ప్రణాళికలను రూపొందించి అమలు చేయటంలో ఈయన ముఖ్యభూమిక పోషించారు. ఇంపీరియల్‌ బ్యాంకును ఈయనే జాతీయం చేశారు. దేశంలో కొత్త కంపెనీల చట్టాన్ని ప్రవేశపెట్టారు. మహారాష్ట్ర నుంచి ముంబయిని వేరు చేయాలన్న నిర్ణయంపై నిరసనలు వ్యక్తం అయిన నేపథ్యంలో దేశ్‌ముఖ్‌  రాజీనామా చేశారు.

6
టిటి కృష్ణమాచారిః(1957-58)(1964-66)
దేశానికి రెండుసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి నేత. 1957లో రెండో సాధారణ ఎన్నికలు ఈయన సమయంలోనే జరిగాయి. దేశంలో  మూడు భారీ ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసిన ఘనత, మూడు ఆర్థిక సంస్థలు ఐడిబిఐ, ఐసిఐసిఐ, యుటిఐ లను నెలకొల్పిన క్రెడిట్‌ కృష్ణమాచారికి దక్కుతుంది. 1958లో  ఎల్‌ఐసి ముంద్రా కేసులో జస్టిస్‌ చాగ్లా కమిషన్‌ తప్పు పట్టడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.
1964-66లో మరోసారి కృష్ణమాచారి రెండోసారి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. తొలిసారి సామాజిక భద్రత అన్న అంశాన్ని ప్రస్తావన చేసింది కృష్ణమాచారినే... ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. 1964లో ఫ్యామిలీ పెన్షన్‌ పథకాన్ని ప్రకటించారు. రాజస్థాన్‌ కెనాల్‌ స్కీమ్‌, దండకారణ్య, దామోదర్‌ వ్యాలీ ప్రాజెక్టులు, నైవేలీ లిగ్నైట్‌ ప్రాజెక్టులను టిటి కృష్ణమాచారి ప్రకటించారు.

7
జవహర్‌లాల్‌ నెహ్రూః(1958-59)
౧౯౫౮లో సరిగ్గా బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఫిబ్రవరి మాసంలోనే టిటి కృష్ణమాచారి రాజీనామా చేయటంతో   ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ స్వయంగా ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించారు.  1958-59 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనూహ్యంగా తనపై భారం పడిందని ఆయన ఆనాడు తన బడ్జెట్‌ ప్రసంగంలో అన్నారు.

 8
మొరార్జీ దేశాయ్‌(1959-64)(1967-69)
1959నుంచి 1964వరకు జవహర్‌ లాల్‌ నెహ్రూ కేబినెట్‌లో అత్యధిక కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన కీర్తి మొరార్జీ దేశాయ్‌కి దక్కింది. రెండు సార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన మొరార్జీదేశాయ్‌ దాదాపు పది బడ్జెట్‌లను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. ఇందులో అయిదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ తొలి దఫాలో ప్రవేశపెట్టారు. 1959 నుంచి 1964 వరకు పూర్తి స్థాయి బడ్జెట్‌లను, 1962-63లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  ఆ తరువాత 1967లో రెండోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టారు. ఈసారి ఆయన మూడు పూర్తి స్థాయి బడ్జెట్‌లను, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1969లో దేశంలోని ప్రధాన బ్యాంకులను ఒక ఆదివారం సాయంత్రం జాతీయం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ ఉండటం వల్ల వాటి పనితీరు మెరుగుపడుతుందని ఆయన భావించారు. కానీ, దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.
9
ఇందిరాగాంధీః(1970-71)
మొరార్జీ దేశాయ్‌ రాజీనామా చేసిన తరువాత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆర్థిక మంత్రిత్వ శాఖను తన దగ్గరే ఉంచుకున్నారు. ఈవిధంగా దేశానికి తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు.
10
వై.బి.చవాన్‌(1971-1975)
౧౯౭౧లో అయిదో సాధారణ ఎన్నికలు పూర్తయిన తరువాత  ఆర్థిక మంత్రిగా వైబి చవాన్‌ను ఇందిర నియమించారు. 1971 నుంచి 75 వరకు ఆయన పూర్తి బడ్జెట్లను ప్రవేశపెట్టారు.
11
సి. సుబ్రహ్మణ్యం(1975-77)
1975, 76లలో రెండు బడ్జెట్లను సుబ్రహ్మణ్యం ప్రవేశపెట్టారు. ఎక్సైజ్‌ ద్వారా ఆదాయాన్ని పెంచే మార్గాలను మొదటిసారి అమలు చేసిన ఆర్థిక మంత్రి సుబ్రహ్మణ్యం.
12
హెచ్‌ఎం పటేల్‌(1977-79)
మార్చి 1977లో ఏడో జనరల్‌ ఎన్నికల తరువాత మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. మొరార్జీదేశాయ్‌ ప్రధానమంత్రిగా ఏర్పడిన కాంగ్రెసేతర ప్రభుత్వంలో  హెచ్‌ఎం పటేల్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

13
చౌదరి చరణ్‌సింగ్‌(1979-80)
1979వ  ఆర్థిక సంవత్సరానికి చౌదరి చరణ్‌సింగ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అప్పుడు ఆయన దేశ ఉపప్రధానమంత్రిగా ఉన్నారు.
14
రామస్వామి వెంకట్రామన్‌(1980-82)
1980లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్‌ వెంకట్రామన్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1980-81, 1981-82 ఆర్థిక సంవత్సరాలకు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ తరువాత వెంకట్రామన్‌ ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా  ఉన్నత పదవులను చేపట్టారు.
15
ప్రణబ్‌ ముఖర్జీ(1982-84)
ఇందిర కేబినెట్‌లో ప్రణబ్‌ ముఖర్జీ తొలిసారి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడే.  ప్రణబ్‌ ముఖర్జీ 1982, 83, 84 బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.
16
విపి సింగ్‌(1985-87)
ఇందిరాగాంధీ మరణం తరువాత ప్రధానమంత్రి అయిన రాజీవ్‌ మంత్రి వర్గంలో విపి సింగ్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 85, 86 బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. దేశంలో లైసెన్స్‌ రాజ్యానికి చరమగీతం పాడే దిశగా చర్యలు తీసుకున్న ఘనత విపి సింగ్‌ది.....ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు అదనపు అధికారాలను కట్టబెట్టారు. దీని వల్ల దేశంలో అత్యంత సంపన్నులపై కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేసింది. ఈ దాడులను ఎదుర్కొన్న వారిలో ధీరూభాయ్‌ అంబానీ కూడా ఉన్నారు. ఈ కారణంగా రాజీవ్‌గాంధీపై ఒత్తిళ్లు పెరగటంతో విపిసింగ్‌ను తప్పనిసరిగా తప్పించాల్సి వచ్చింది.

17
రాజీవ్‌గాంధీ(1987-88)
1987-88 ఆర్థిక సంవత్సరానికి ప్రధానమంత్రి  రాజీవ్‌గాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రుల్లో రాజీవ్‌ మూడో వారు. మరో విశేషమేమంటే ఈ ముగ్గురు ప్రధానులూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావటం. జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఆయన కూతురు ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ... ముగ్గురూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1987లో నే దేశంలో జీరో బేస్డ్‌ బడ్జెటింగ్‌ ప్రారంభమైంది. జీరోబేస్డ్‌ బడ్జెట్‌ అంటే ఆర్థిక శాఖకు వచ్చిన ప్రతి డిమాండ్‌ను, ప్రతిపాదనలను ముందే సమీక్షించి, విశ్లేషించి తుది నిర్ణయం తీసుకోవటం. పార్లమెంటులో బడ్జెట్‌ తుది ఆమోదం పొందకముందే ఈ ఎక్సర్‌సైజ్‌ పూర్తవుతుంది. ఈ విధానాన్ని మూడు దశల్లో అమలు చేశారు.
18.
ఎన్‌డి తివారీ(1988-89)
ఎన్‌డి తివారీ రాజీవ్‌ కేబినెట్‌లో 1988-89 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.
19
మధు దండవతే(1990-91)
1989 నవంబర్‌లో సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడింది. దీనికి నాయకత్వం జనతాదళ్‌  వహించింది. విపిసింగ్‌ ప్రధాని అయ్యారు. మధు దండవతే ఆర్థిక మంత్రిగా 1990-91 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

20
యశ్వంత్‌ సిన్హా(1991-92)(1998-2002)
కేంద్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యశ్వంత్‌సిన్హా ఆర్థిక మంత్రి అయ్యారు. 1991-92ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1998లో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 1998లో ఆర్థిక మంత్రిత్వ శాఖ చేపట్టారు. 1998లో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన యశ్వంత్‌ ఆ తరువాత 2002-03 వరకు వరుసగా బడ్జెట్లను ప్రవేశపెట్టారు. బ్రిటిష్‌ కాలం నుంచి సాయంత్రం అయిదు గంటలకు బడ్జెట్‌లను ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని మార్చారు. మధ్యాహ్నం 12 గంటలకే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎక్సైజ్‌ డ్యూటీలను రేషనలైజ్‌ చేయటంపై యశ్వంత్‌ సిన్హా ప్రత్యేక దృష్టి పెట్టారు. దిగుమతులను మరింత సరళీకృతం చేశారు.

21.
మన్మోహన్‌ సింగ్‌ (1991-96)
రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌గా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌ 1991లో ప్రధానమంత్రి పదవిని పివి నరసింహరావు చేపట్టిన తరువాత ఆర్థిక మంత్రి బాధ్యతలను చేపట్టారు. 1991-92 సంవత్సరానికి ఫైనల్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్‌ను ఒక ఆర్థిక మంత్రి, పూర్తి స్థాయి బడ్జెట్‌ను మరో మంత్రి ఇద్దరు కూడా వేర్వేరు పార్టీలకు చెందిన వారు ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. పివి నరసింహరావు, మన్మోహన్‌సింగ్‌ల నేతృత్వంలో ఆర్థిక సంస్కరణల పర్వం మొదలు కావటంతో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావటం ప్రారంభమైంది. సంక్షోభంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ వీరి హయాంలో మళ్లీ నిలదొక్కుకుంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో కుదువబెట్టిన బంగారం రిజర్వులను ఈ ఇద్దరే విడిపించారు. ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్‌ ఆద్యుడు. దిగుమతి సుంకాన్ని 300 శాతం నుంచి 50 శాతానికి తగ్గించారు. కరంట్‌ అకౌంట్‌లో రూపీ కన్వర్టబిలిటీని రెండు దశల్లోనే జరిగేట్లు చేసిన ఘనత కూడా మన్మోహన్‌దే. ఆ తరువాత దేశంలో  పూర్తికాలం ప్రధానమంత్రిగా పనిచేసి, రెండో దఫా కూడా ప్రదానమంత్రిగా ఎన్నికైన ఘనతను సాధించారు.

22.
జస్వంత్‌సింగ్‌( 1996)(2002-04)
అటల్‌ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో తొలిసారి ఆర్థిక మంత్రిగా జస్వంత్‌సింగ్‌ 17 రోజులు మాత్రమే పనిచేశారు. 2002లో  రెండోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మార్కెట్‌ అనుకూల ఆర్థిక సంస్కరణలను జస్వంత్‌సింగ్‌ అమలు చేశారు..
23
పి.చిదంబరం(1996-1998)(2004-2008)
1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి చిదంబరం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అప్పుడు ఆయన తమిళ మానిలా కాంగ్రెస్‌లో సభ్యుడు. 1997-98లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అసలు చర్చ జరక్కుండానే ఆమోదం పొందింది. మళ్లీ 2004లో మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలో యుపిఎ సర్కారు ఏర్పడ్డ తరువాత చిదంబరం తిరిగి ఆర్థిక మంత్రిగా ఎన్నికయ్యారు. నాలుగు సంవత్సరాల పాటు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. మన్మోహన్‌, మాంటెక్‌ సింగ్‌ ఆహ్లువాలియా, చిందబరంలను ఆర్థిక వేత్తల త్రయంగా పిలుస్తారు.
24.
ప్రణబ్‌ ముఖర్జీ..
2009 ఎన్నికల తరువాత ప్రణబ్‌ ముఖర్జీ  ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  ప్రస్తుత లోక్‌సభలో ప్రణబ్‌ది ఇది నాలుగో బడ్జెట్‌.

8, ఫిబ్రవరి 2012, బుధవారం

మద్య గీత

మేమంతా పవిత్రులం... మాకు పాపం చేయటమే తెలియదు.. రాముడు కూడా మా మంచితనం ముందు ఆఫ్టరాలే.. మేమూ, మా వాళ్లూ కడిగిన ముత్యాలు.. కేవలం ౫ లక్షలు తీసుకున్నామని ఆరోపించటానికి మా స్థాయి ఏమిటో తెలుసుకోవద్దా.. ఎవరు పడితే వాళ్లు ఆరోపించగానే మాపై విరుచుకుపడేయటమేనా? ముందూ వెనుకా ఆలోచించనక్కర్లేదా? మన నాయకులు.. మంత్రుల ఆలపిస్తున్న మధువు గీతం ఇది.
                                  
నేను చాలా మంచి బాలుణ్ణి.. అసలు గాడి తప్పిన నా శాఖను చక్కదిద్దటానికి నేను పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. అలాంటి నాకు ఓ వ్యాపారి పది లక్షలు ఇవ్వటం విడ్డూరం కాదా? సాక్షాత్తూ  మద్యం మంత్రి ఎక్సైజ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆలపించిన గీతాసారం.

మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు ముట్టాయంటూ ఏసిబి రిమాండ్‌ నోట్‌లో మంత్రివర్యుల పేరు ప్రముఖంగా ప్రస్తావించటం రాజకీయంగా, ప్రభుత్వ పరంగా పెను సంచలనానికి దారి తీసింది. ఒక మంత్రి.. ఎమ్మెల్యేలు.. పార్టీ నాయకులు.. అధికారులు.. పాత్రికేయులు.. అందరూ ఒక తాను ముక్కలేనని సదరు రిమాండ్‌ నోట్‌ తేల్చింది.
ఒక్కొక్కరూ చెప్తున్న సుద్దులు వింటుంటే ప్రజాస్వామ్యం పగలబడి నవ్వుతోంది.
మంత్రిగారి మాటల ప్రకారం ఆరోపించిన వాడు ఓ క్రిమినల్‌ .. గంజాయి స్మగ్లర్‌.. రెండు డెకాయిట్‌ కేసులు.. ఆరు అటెంప్ట్‌ టు మర్డర్‌ కేసులు ఉన్న వాడు.. బినామీ పేర్లతో ౫౦ మద్యం దుకాణాలను నడిపిస్తున్నవాడు..  దొడ్డిదారిన మద్యం వ్యాపారం లైసెన్స్‌ తీసుకున్న ఓ క్రిమినల్‌ ఆరోపిస్తే... దాన్ని క్లారిఫై చేసుకోకుండా రిపోర్ట్‌ తీసుకుంటారా? విచారించండి.. తేలితే చూద్దాం.. రాజీనామా చేసే సంగతి.. ఇదీ మంత్రిగారి మాట.. ఇదిసరే.. మరి అలాంటి క్రిమినల్‌ స్వేచ్ఛగా బయట ఎలా తిరుగుతున్నాడు. మద్యం వేలం పాటల్లో ఎలా పాల్గొనగలిగాడు. లైసెన్స్‌ ఎలా సంపాదించగలిగాడు..? మంత్రిగారికి తెలియని బాగోతం ఇది..
మహబూబాబాద్‌ ఎమ్మెల్యే కవితకయితే అయిదు లక్షలు ఆఫ్టరాల్‌. అసలు ఆ మాత్రం సొమ్ములు తనకిచ్చాననటం కూడా జస్ట్‌ ఏ సిల్లీ థింగ్‌..నాలాంటి దానికి కేవలం అయిదు లక్షల రూపాయలే ముడుపు ఇచ్చానని చెప్పటం ఆమెకు విడ్డూరంగా అనిపించింది. అంటే ఆమె స్థాయి అయిదు లక్షలు కాదేమో.. యాభై లక్షలు కావచ్చు.. ఆమెకే తెలియాలి.
ఇక టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆ పార్టీ నేతలకైతే కడిగిన ముత్యమే.. అసలు ఖమ్మంలో మద్య నిషేధం కోసం పోరాటం చేస్తున్న నాయకుడు. అలాంటి వాడు మద్యం వ్యాపారి దగ్గరి నుంచి లంచం తీసుకోవటం ఏమిటి? ఇది టిడిపి నేతల వాదన.

పాపం కమ్యూనిస్టులయితే మహా పేదవాళ్లు.. ఖమ్మంలో  మహాసభలు నిర్వహించేందుకు మాత్రమే ఈ  మద్యంవ్యాపారి నుంచి చందా రూపంలో వసూలు చేశారు. అదీ నెలకు పదివేల చొప్పున లెండి.... ఇంతకు మించి వాళ్లకు మరేమీ తెలియదు.
ఇదీ మన నేతల పవిత్రత.. ప్రజాప్రతినిధుల నీతివంతమైన జీవితం. అంతా మంచివాళ్లే.. మరి అవినీతి చేస్తున్నది ఎవరన్నది ఎవరికీ తెలియదు.. చివరకు ముఖ్యమంత్రికి కూడా.... 

6, ఫిబ్రవరి 2012, సోమవారం

చిలుక ఎగిరిపోతోంది

నిన్న ఉన్నట్లుగా ఇవాళ లేదు
రేపు ఉన్నట్లుగా ఎల్లుండి ఉండట్లేదు
శరీరంలో మార్పులు...
తలపుల్లో మార్పులు
నడకలో మార్పులు
నడతలో మార్పులు
కాలేజీలో తొలి అడుగు
కేరెక్టర్‌లో  సరికొత్త మలుపు
ఆమె అతను కావాలి..
అతనితోనే చనువు కావాలి..
చనువుతోని స్నేహం కావాలి
స్నేహంలోని ఆకర్షణ కావాలి
వాళ్లతోనే ఫ్రెండ్లీనెస్‌..
ఆ స్నేహంలో తెలియనిదేదో ఓ ఫీల్‌
టీనేజీ లైఫ్‌లో అదో థ్రిల్‌
స్నేహానికి హద్దులు లేవు
సరదాలకు నో లిమిట్స్‌
ఒద్దికకు.. అణుకువలకు చోటు లేదు
కలిసి తిరిగితే తప్పు లేదు..
తిరగకపోతే లైఫే వేస్టు
బాయ్‌ఫ్రెండ్‌ లేని గాళ్‌ కూడా ఉంటుందా?
ఫన్‌ అంతా మగాళ్లకేనా?
మాకేం తక్కువ
మా డ్రెస్‌కోడ్‌ మాది..
మా లైఫ్‌సెユ్టల్‌ మాది..
క్లబ్బులు..పబ్బులు..
పార్కులు.. షికార్లు...
అన్నీ మేమూ చేస్తాం...
బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేస్తాం..
వై నాట్‌..
ఆమె బల్లగుద్ది చెప్తోంది
తాను మారానని
ఆమె రెక్కలు రెపరెపలాడుతున్నాయి
కోయిల రమ్మంటోంది
ఆమె ఎగిరిపోతోంది