8, ఫిబ్రవరి 2012, బుధవారం

మద్య గీత

మేమంతా పవిత్రులం... మాకు పాపం చేయటమే తెలియదు.. రాముడు కూడా మా మంచితనం ముందు ఆఫ్టరాలే.. మేమూ, మా వాళ్లూ కడిగిన ముత్యాలు.. కేవలం ౫ లక్షలు తీసుకున్నామని ఆరోపించటానికి మా స్థాయి ఏమిటో తెలుసుకోవద్దా.. ఎవరు పడితే వాళ్లు ఆరోపించగానే మాపై విరుచుకుపడేయటమేనా? ముందూ వెనుకా ఆలోచించనక్కర్లేదా? మన నాయకులు.. మంత్రుల ఆలపిస్తున్న మధువు గీతం ఇది.
                                  
నేను చాలా మంచి బాలుణ్ణి.. అసలు గాడి తప్పిన నా శాఖను చక్కదిద్దటానికి నేను పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. అలాంటి నాకు ఓ వ్యాపారి పది లక్షలు ఇవ్వటం విడ్డూరం కాదా? సాక్షాత్తూ  మద్యం మంత్రి ఎక్సైజ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆలపించిన గీతాసారం.

మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు ముట్టాయంటూ ఏసిబి రిమాండ్‌ నోట్‌లో మంత్రివర్యుల పేరు ప్రముఖంగా ప్రస్తావించటం రాజకీయంగా, ప్రభుత్వ పరంగా పెను సంచలనానికి దారి తీసింది. ఒక మంత్రి.. ఎమ్మెల్యేలు.. పార్టీ నాయకులు.. అధికారులు.. పాత్రికేయులు.. అందరూ ఒక తాను ముక్కలేనని సదరు రిమాండ్‌ నోట్‌ తేల్చింది.
ఒక్కొక్కరూ చెప్తున్న సుద్దులు వింటుంటే ప్రజాస్వామ్యం పగలబడి నవ్వుతోంది.
మంత్రిగారి మాటల ప్రకారం ఆరోపించిన వాడు ఓ క్రిమినల్‌ .. గంజాయి స్మగ్లర్‌.. రెండు డెకాయిట్‌ కేసులు.. ఆరు అటెంప్ట్‌ టు మర్డర్‌ కేసులు ఉన్న వాడు.. బినామీ పేర్లతో ౫౦ మద్యం దుకాణాలను నడిపిస్తున్నవాడు..  దొడ్డిదారిన మద్యం వ్యాపారం లైసెన్స్‌ తీసుకున్న ఓ క్రిమినల్‌ ఆరోపిస్తే... దాన్ని క్లారిఫై చేసుకోకుండా రిపోర్ట్‌ తీసుకుంటారా? విచారించండి.. తేలితే చూద్దాం.. రాజీనామా చేసే సంగతి.. ఇదీ మంత్రిగారి మాట.. ఇదిసరే.. మరి అలాంటి క్రిమినల్‌ స్వేచ్ఛగా బయట ఎలా తిరుగుతున్నాడు. మద్యం వేలం పాటల్లో ఎలా పాల్గొనగలిగాడు. లైసెన్స్‌ ఎలా సంపాదించగలిగాడు..? మంత్రిగారికి తెలియని బాగోతం ఇది..
మహబూబాబాద్‌ ఎమ్మెల్యే కవితకయితే అయిదు లక్షలు ఆఫ్టరాల్‌. అసలు ఆ మాత్రం సొమ్ములు తనకిచ్చాననటం కూడా జస్ట్‌ ఏ సిల్లీ థింగ్‌..నాలాంటి దానికి కేవలం అయిదు లక్షల రూపాయలే ముడుపు ఇచ్చానని చెప్పటం ఆమెకు విడ్డూరంగా అనిపించింది. అంటే ఆమె స్థాయి అయిదు లక్షలు కాదేమో.. యాభై లక్షలు కావచ్చు.. ఆమెకే తెలియాలి.
ఇక టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆ పార్టీ నేతలకైతే కడిగిన ముత్యమే.. అసలు ఖమ్మంలో మద్య నిషేధం కోసం పోరాటం చేస్తున్న నాయకుడు. అలాంటి వాడు మద్యం వ్యాపారి దగ్గరి నుంచి లంచం తీసుకోవటం ఏమిటి? ఇది టిడిపి నేతల వాదన.

పాపం కమ్యూనిస్టులయితే మహా పేదవాళ్లు.. ఖమ్మంలో  మహాసభలు నిర్వహించేందుకు మాత్రమే ఈ  మద్యంవ్యాపారి నుంచి చందా రూపంలో వసూలు చేశారు. అదీ నెలకు పదివేల చొప్పున లెండి.... ఇంతకు మించి వాళ్లకు మరేమీ తెలియదు.
ఇదీ మన నేతల పవిత్రత.. ప్రజాప్రతినిధుల నీతివంతమైన జీవితం. అంతా మంచివాళ్లే.. మరి అవినీతి చేస్తున్నది ఎవరన్నది ఎవరికీ తెలియదు.. చివరకు ముఖ్యమంత్రికి కూడా.... 

కామెంట్‌లు లేవు: