28, ఫిబ్రవరి 2012, మంగళవారం

బడ్జెట్‌-అంటే ఏమిటి?

బడ్జెట్‌ అనగానే మామూలు ప్రజలకు అర్థమయ్యేది ఒకే ఒక్కటి.. ధరలు.. ఏ వస్తువు ధర పెరిగింది? ఏ వస్తువు ధర తగ్గింది? రైతులకైతే.. అప్పులేమైనా మాఫీ చేస్తున్నారా? విత్తనాలపై సబ్సిడీ ఇస్తున్నారా అనేదే తెలుస్తుంది. ఇక ఉద్యోగుస్థులైతే ఇన్‌కమ్‌టాక్స్‌ పరిమితి ఏమైనా పెంచారా? లేదా? అన్నది తెలుసుకుంటే చాలనుకుంటారు.. బడ్జెట్‌ అంటే ఇంతేనా? ఇంకేమైనా ఉందా? అంటే బోలెడు ఉందనే చెప్పాలి.. అంతా అనుకున్నట్లు బడ్జెట్‌  బ్రహ్మపదార్థమేం కాదు.. కొంత మనసు పెట్టి  గమనిస్తే.. చాలా తేలిగ్గా అర్థమవుతుంది...

ప్రతి వ్రభుత్వానికి ప్రజల పట్ల తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించటానికి మానవ వనరులతో పాటు ఆర్థిక వనరుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజల సంక్షేమం కోసం చేసే ఖర్చుల కోసం పన్నులు, సుంకాలు, సెస్‌లు, అప్పులు ఇతర రూపాలలో నిధులు సమీకరిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం పార్లమెంటులో వార్షిక ఆర్థిక ప్రతిపాదనలు చేసి ఆమోదం పొందుతుంది. సదరు ఆర్థిక సంవత్సరంలో ఆ ప్రతిపాదనలనే ఆమలు చేస్తారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఖర్చు చేయాల్సి ఉంటుంది.
రాజ్యాంగంలోని 112 వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పేరు మీదుగా ఆర్థిక సంవత్సరపు వార్షిక స్టేట్‌మెంట్‌ తయారవుతుంది.  అయితే దాన్ని తయారు చేసే బాధ్యత 77(3)వ అధికరణం ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రిపై ఉంటుంది. ఈ స్టేట్‌మెంట్‌కే బడ్జెట్‌ అని పేరు.
కేంద్ర ఆర్థిక మంత్రి జనరల్‌ బడ్జెట్‌తో  పాటు రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రాల బడ్జెట్‌ కూడా పార్లమెంటులో ప్రవేశపెడతారు.

 బడ్జెట్‌ రూపకల్పనలో భాగస్వామ్యం పంచుకునే విభాగాలు...విధులు
メ కేంద్ర ప్రణాళికా సంఘం...
అన్ని మంత్రిత్వ శాఖలకు ఇది ఓవరాల్‌ టార్గెట్‌లను నిర్దేశిస్తుంది.
メ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌...(కాగ్‌)
అక్కౌంట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. నిఘా వేస్తుంది.
メ అడ్మినిస్ట్రేటివ్‌ మినిస్ట్రీస్‌.. ప్రణాళికా ప్రాధాన్యాలను నిర్ణయించేముందు  ఆర్థిక మంత్రి
అడ్మినిస్ట్రేటివ్‌ మినిస్ట్రీస్‌ విభాగాన్ని తప్పక సంప్రతిస్తారు.
メ వ్యయం.. ఖర్చుకు సంబంధించిన రెవెన్యూ విభాగం...
メనాన్‌-టాక్స్‌- ఆర్థిక వ్యవహారాల విభాగం
メపన్నులు- రెవెన్యూ విభాగం
メలోటు-ఆర్థిక వ్యవహారాల విభాగం

నిజానికి ప్రతి సంవత్సరం బడ్జెట్‌ ప్రక్రియ సెప్టెంబర్‌లోనే ప్రారంభమవుతుంది.
కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ అన్ని మంత్రిత్వ శాఖలకు, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, వివిధ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన శాఖలకు బడ్జెట్‌ సర్క్యులర్‌ విడుదల చేయటంతో ప్రారంభమవుతుంది. ఆయా విభాగాలు, రాష్ట్రాలు నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి తమ అంచనాలను సవరించుకోవటంతో పాటు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి  తమ ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖకు పంపిస్తాయి.  ఈ ప్రతిపాదనలన్నీ అందిన తరువాత అడ్మినిస్ట్రేటివ్‌ మినిస్ట్రీస్‌, ఇతర కీలక విభాగాలతో సమావేశాలు నిర్వహిస్తుంది. అవసరమైన వ్యయ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.
దేశంలోని వివిధ వర్గాల నుంచి తమకు లభించే ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంది.  వ్యవసాయం, రైతులు, కార్మికులు, సామాజిక వర్గాల నుంచి వచ్చే ఆదాయాలను బేరీజు వేస్తుంది. ఆదాయ వనరుల సమీకరణ ఎలా చేయాలో, ఎన్ని అవకాశాలు ఉన్నాయో రెవిన్యూ విభాగంతో సంప్రతించి ప్రతిపాదనలు రెడీ చేస్తారు...
ఆ తరువాత ఖర్చుల అంచనాలను తయారు చేస్తారు. ప్రీ బడ్జెట్‌ మీటింగ్‌లు అయిపోయిన తరువాత స్టేట్‌మెంట్‌ బడ్జెట్‌ ఎస్టిమేట్స్‌ను బడ్జెట్‌ డివిజన్‌కు పంపిస్తారు.  అక్కడ తుది పన్నుల ప్రతిపాదనలు తయారవుతాయి. ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి వీటికి తుదిరూపాన్ని ఇస్తారు.....

చివరకు ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం తయారవుతుంది. ఇది రెండు విభాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో సాధారణ ఆర్థిక వ్యవహారాలు, విధాన ప్రకటనలు ఉంటాయి. రెండో భాగంలో వివిధ రకాల పన్నుల గురించిన ప్రతిపాదనలు చోటు చేసుకుంటాయి.
లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత రాజ్యసభలోనూ ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు.
బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వెంటనే లోక్‌సభ దానిపై చర్చ ప్రారంభిస్తుంది. సభ్యుల సూచనలు సలహాలు తీసుకున్న తరువాత ఆర్థిక మంత్రి జవాబిస్తారు. అనంతరం బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఓటింగ్‌ జరుగుతుంది. సాధారణ మెజారిటీతో పార్లమెంటు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఓడిపోతే.. రాజీనామా చేయాల్సి ఉంటుంది.

4 కామెంట్‌లు:

Murthy చెప్పారు...

Good one. Very informative in simple way. Thank you ఆనందిని గారు.

Apparao చెప్పారు...

చాల చక్కగా వివరించారు

Apparao చెప్పారు...

చాల చక్కగా వివరించారు

Apparao చెప్పారు...

చాల చక్కగా వివరించారు