26, నవంబర్ 2009, గురువారం

గ్రేట్‌ ఓటరు - చిరంజీవి రెండో షో అట్టర్‌ ఫ్లాప్‌

గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీల సత్తా ఏమిటో తేలిపోయింది. వైఎస్‌ జీవించి ఉన్నప్పుడు కాంగ్రెస్‌ చుట్టూ ఏకపక్షంగా తిరిగిన రాజకీయం ఇప్పుడు తెలుగుదేశం వైపు మళ్లింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెల్చుకున్న తెలుగుదేశం ఈ ఎన్నికల్లో దాదాపు పదిహేను నియోజక వర్గాల్లో బలాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. కాంగ్రెస్‌తో దాదాపు సమానంగా డివిజన్లను సాధించటం తెలుగుదేశం శ్రేణుల్లో తిరుగులేని ఉత్సాహాన్ని నింపిందనటంలో సందేహం లేదు. అయితే పూర్తిగా స్థానిక రాజకీయాలను ఆధారం చేసుకుని జరిగిన ఎన్నికల్లో సాధించిన ఫలితాలే అయినా, ఇప్పుడున్న వాతావరణంలో రాష్ట్ర రాజకీయాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయనటంలో సందేహం లేదు.

చివరి రెండురోజుల్లో హఠాత్తుగా ప్రచారంలోకి దిగిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సుడిగాలిగా 30 డివిజన్లలో ప్రసంగాలు చేసినా, కాంగ్రెస్‌ గెలుచుకోగలిగింది కేవలం 13 డివిజన్లలోనే... జగన్‌ వర్గీయులైన సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌ రెడ్డి నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ దాదాపు అడ్రస్‌ లేకుండా పోయింది. అటు తెలుగుదేశంలోనూ సీనియర్‌ నాయకుడు.. నిత్య అసమ్మతివాది తలసాని శ్రీనివాసయాదవ్‌ నియోజకవర్గం సికింద్రాబాద్‌లో తెలుగుదేశం జాడే లేదు... ఇక వైఎస్‌ వ్యతిరేక వర్గానికి చెందిన పి.విష్ణువర్థన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జూబ్లీహిల్‌‌సలో కాంగ్రెస్‌ మళ్లీ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రి రోశయ్య నివాసముంటున్న బల్కంపేటలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. పాపం ఆయన తన ఓటును తెలుగుదేశానికి వేయలేదు కదా.. సరదాకు అన్నా లెండి... 150 డివిజన్లను తెలుగుదేశం, కాంగ్రెస్‌, ఎంఐఎంలు పంచుకున్నాయి. ఎంఐఎం గురించి చెప్పనే అక్కర్లేదు.. అసెంబ్లీ ఎన్నికల్లోనే అయిదు నుంచి ఏడుకు బలాన్ని పెంచుకున్న ఆ పార్టీ, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే దూకుడుతో దూసుకుపోయింది. బిజెపి అయిదు డివిజన్లను తన ఖాతాలోకి వేసుకునేసరికి అలసిపోయింది. ఇక లోక్‌సత్తా సీటీ బచావ్‌ సీటీ బచావ్‌ అంటూ విజిళు్ల పట్టుకుని బరిలో దూకింది.. చివరకు లోక్‌సత్తా `సీటీ బజ్‌గయా' అన్నట్లే అయింది. కనీసం లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ వెతికి వెతికి ఏరికోరి గెల్చుకున్న కూకట్‌పల్లిలో కూడా ఓటర్లు ఆయన పార్టీకి మొండిచెయ్యే చూపించారు...
అన్నింటికీ మించి చిరంజీవి రెండో షో కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. కాంగ్రెస్‌తో పొత్తుల కోసం చివరి నిమిషం దాకా వెంపర్లాడి... అఖరుకు ఒంటరిగా అదీ 64 సీట్లలో మాత్రమే పోటీ చేసిన చిరంజీవి మెగా పార్టీ గ్రేటర్‌ ఎన్నికల్లో బోర్లా పడింది. ఫలితాల చివరలో ఓల్‌‌డబోయినపల్లి డివిజన్‌ చిరంజీవి పాలిటి గోల్‌‌డ బోయినపల్లిగా మారింది. పిఆర్‌పిలోని ఏ ఒక్క అభ్యర్థికీ తాను గెలుస్తానన్న నమ్మకం లేదు.. ఈ డివిజన్‌లో కూడా పోటీ చేసిన నర్సింహులు యాదవ్‌ కౌంటిగ్‌ కేంద్రానికి రానే లేదు. తాను ఓడిపోతానని ఖాయంగా భావించి ఉదయం నుంచే పత్తాలేకుండా పోయారు. చివరి నిమిషంలో గెలుస్తున్నట్లు తెలిసాక తన చెవులను తానే నమ్మలేని పరిస్థితి. ఏదో రకంగా ఒక సీటును గెలిపించి చిరంజీవికి తనవంతు ఆక్సీజన్‌ను నర్సింహులు అందించారు.. ఇప్పుడు చిరంజీవి ఏం చేస్తారు? సినిమాల్లో రెండో స్పెల్‌ ప్రారంభిస్తారా? సినిమాల్లో నటిస్తే ఎలాంటి పాత్రలు వేస్తారు.. ఆయన మళ్లీ సినిమాలు మొదలు పెడితే.. పార్టీని ఎవరు నడిపిస్తారు? లేక అంతా భావించినట్లు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా? మేయర్‌ ఎన్నిక కంటే కూడా అందరి దృష్టీ చిరంజీవి రాజకీయ భవిష్యత్తుపైనే ఉందంటే అతిశయోక్తి కాదేమో...

25, నవంబర్ 2009, బుధవారం

వేడెక్కిన తెలంగాణ..

తెలంగాణ ఉద్యమం ఎటు వెళ్తోంది... 1969 నాటి సన్నివేశాలు పునరావృతం అవనున్నాయా? తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు ప్రారంభిస్తానంటున్న ఆమరణ నిరాహార దీక్ష ఇప్పటివరకు అందిస్తున్న సంకేతాలు ఆందోళన తీవ్రతను సూచిస్తున్నాయి. రాష్టమ్రంతటా ఒకటే ఉత్కంఠ.. తెలంగాణ జిల్లాల్లో ఉద్రిక్తత... ఆమరణ దీక్ష జరుగుతుందా? ప్రభుత్వం భగ్నం చేస్తుందా? అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి?
కెసిఆర్‌ ఆమరణ దీక్ష కొనసాగుతుందా?
తెలంగాణ ఉద్యమం హింసాత్మకం కానుందా?
ఉద్యమం హింసాత్మకమైతే పరిణామాలకు బాధ్యులెవరు?
తెలంగాణపై ప్రభుత్వ వైఖరి ఏమిటి?
కెసిఆర్‌ దీక్ష భగ్నం చేయటమే లక్ష్యమా?


ఇప్పుడు అందరి దృష్టీ నవంబర్‌ 29పైనే... సిద్దిపేటకు దగ్గర్లోని రంగదామ్‌ పల్లిలో కెసిఆర్‌ ఆమరణ దీక్ష చేపడుతున్నారు... ఆయన గతంలో చేసిన ఆందోళనలకు, ఇప్పుడు చేస్తున్న ఆందోళనకు చాలా తేడా ఉంది.. గతంలో ఆయన ఏ ఆందోళన చేసినా, దానికి జనం స్పందించినా అవన్నీ అలా పైకెగిసి కింద పడిపోయినవే... ఇప్పుడు ఉద్యమాన్ని సీరియస్‌గానే ముందుకు తీసుకువెళు్తన్నట్లు పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని కల్పించటంలో కెసిఆర్‌ సక్సెస్‌ అయ్యారు. అదే సమయంలో ఇంతకు ముందు కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం కెసిఆర్‌ దీక్షను భగ్నం చేసేందుకు సర్వ సన్నాహాలతో సన్నద్ధమైంది. సిద్దిపేట అంతటా భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. హోటళు్ల, లాడ్జిలను సైతం పోలీసులు తమ స్వాధీనంలో ఉంచుకున్నారు... అయినా చాపకింద నీరులాగా వివిధ జిల్లాల నుంచి కార్యకర్తల్ని, ప్రజల్ని సమీకరించేందుకు టిఆర్‌ఎస్‌ ప్రయత్నాలు మానలేదు..
1969లో విద్యార్థి ఉద్యమం తెలంగాణను రక్తసిక్తం చేసింది... ఇప్పుడు ఆ ఉద్యమానికి సరిగ్గా నలభై ఏళు్ల నిండాయి. ఆనాటి పరిస్థితులు మళ్లీ వస్తాయని గట్టిగా చెప్పలేం కానీ, కెసిఆర్‌ కూడా విద్యార్థి చైతన్యాన్నే అండగా తీసుకుని ముందుకు సాగుతున్నారు.. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల్లో కనిపిస్తున్న సానుకూల స్పందనలు ఇందుకు తార్కాణం. ఈ ప్రతిస్పందన చూసే కాంగ్రెస్‌ నాయకుల్లో గుబులు మొదలైంది... ప్రత్యేకించి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కెసిఆర్‌కు అనుకూలంగా స్పందించటం ప్రారంభించారు..
రాష్ట్రంలో వైఎస్‌ ఉన్నప్పటి రాజకీయ పరిస్థితులకీ, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకీ చాలా తేడా ఉంది... అందుకే తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల స్వరంలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కెసిఆర్‌ సైతం చాలా పకడ్బందీగా తన రెండో స్పెల్‌ ప్రారంభించారు.. వూ్యహాత్మకంగా నడుస్తున్నారు.. గతంలో ఢిల్లీ జంతర్‌మంతర్‌ దగ్గర ఆమరణ దీక్షకు పూనుకున్నట్లే పూనుకుని అరగంటలోనే విరమించినట్లు కాకుండా, ఈసారి పట్టుదలకు పోతున్నట్లు స్పష్టంగానే అర్థమవుతోంది. కానీ కెసిఆర్‌ ఎక్కువ రోజులపాటు ఆమరణ దీక్ష చేసే పరిస్థితులు లేవని ఆయన వ్యక్తిగత వైద్యులు చెప్తున్నారు..
మరో పక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు దూరం కావటం ద్వారా రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ రాష్ట్ర సాధన అన్న నినాదాన్ని టిఆర్‌ఎస్‌ పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. అదే జరిగితే ఉద్యమ పంథా మారినట్లే... అయితే దాని దారి ఎటు మళు్లతోంది... కెసిఆర్‌ ఎటువైపు తీసుకువెళు్తన్నారు..? ఇప్పటికైతే ఇవి సమాధానం లేని ప్రశ్నలే..

24, నవంబర్ 2009, మంగళవారం

కాంగ్రెస్‌ ఇప్పుడేమంటుంది?

డిసెంబర్‌ 6 1992...
కరసేవకు ముందే ఉత్తరప్రదేశ్‌లో రాష్టప్రతి పరిపాలన ఎందుకు విధించలేదు?
కేంద్ర ప్రభుత్వం 355, 356 అధికరణలను ఎందుకు ప్రయోగించలేదు?
కేంద్ర సైనిక బలగాలను పివి సర్కారు ఏకపక్షంగా యుపిలో ఎందుకు మోహరించలేదు?
బాబ్రీ కూల్చివేతను నిరోధించటంలో పివి నరసింహరావుదేనా వైఫల్యం?

బాబ్రీ కట్టడం కూల్చివేత తరువాత దేశమంతటా చర్చకు తావిచ్చిన ప్రశ్నలివి. కేంద్ర ప్రభుత్వం ముందుగా స్పందించి తగిన చర్యలు తీసుకుని ఉంటే బాబ్రీ కట్టడం కూలి ఉండేది కాదన్న వాదన విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది.
అంతా కలిసి నాటి ప్రధానమంత్రి పివి నరసింహరావును బలిపశువును చేశారు.. రాజీవ్‌గాంధీ మరణానంతరం పార్టీకి జవసత్వాలు అందించిన నాయకుణ్ణి సహచరులే దూరం చేసుకున్నారు.. మైనార్టీలు దూరమవుతారన్న కారణంతో ఆయన జీవించి ఉన్నంత కాలం రాజకీయాల దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు.. మరణించాక కనీసం భౌతిక కాయాన్ని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలోకి కూడా తీసుకుపోయేందుకు ఇష్టపడలేదు...

అయోధ్యలో బాబ్రీ కట్టడం కూల్చివేత ఓ రాజకీయ దిగ్గజానికి అస్తిత్వమే లేకుండా చేసింది. మైనారిటీలో ఉండి కూడా అయిదేళ్ల పాటు సర్కారును కొనసాగించగలిగిన రాజనీతిజ్ఞని సొంత పార్టీయే దూరం చేసుకుంది కూడా ఈ కారణంపైనే.. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలపైకి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చిన నేతను మరణించిన తరువాత కూడా అక్కున చేర్చుకోలేకపోయింది. ఆయన పివి నరసింహరావు... ఆ పార్టీ కాంగ్రెస్‌.... ఇవాళ ఈ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ చేసిన లిబరహాన్‌ కమిషన్‌ మాత్రం పివి నరసింహరావు ప్రభుత్వాన్ని అంతగా వేలెత్తిచూపలేదు... కాంగ్రెస్‌ ఇప్పుడేమంటుంది?
ఇంతకీ పివి చేసిన నేరం ఏమిటి? బాబ్రీ కూల్చి వేత జరిగిన డిసెంబర్‌ 6 1992న ప్రధానమంత్రి కుర్చీపై కూర్చుని ఉండటం... ఇవాళ దేశమంతటా ప్రకంపనలు సృష్టిస్తున్న లిబరహాన్‌ కమిషన్‌ నివేదికలో అందరి దృష్టీ బిజెపి నాయకులపైనే ఉంది కానీ, ఈ కూల్చివేతలో అసలైన బాధితుడు పివి నరసింహరావుపై లేదు.. నిజంగా ఆయన తప్పు చేశారా? లిబరహాన్‌ కమిషన్‌ పివికి పూర్తిగా క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఆయన తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని పూర్తిగా సమర్థించింది.
`` పివి నరసింహరావు 1992లో మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.. మీడియాలో వస్తున్న వార్తలను, వదంతులను గుడ్డిగా నమ్మి, ఏకపక్షంగా కేంద్ర బలగాలను పివి సర్కారు మోహరించలేదు.. రాష్టప్రతి పాలనను విధించలేదు. అలాంటి చర్య తీసుకోవటం రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకున్నట్లే అవుతుంది. ఎలాంటి హేతువు లేకుండా అలాంటి చర్య పివి సర్కారు తీసుకుని ఉంటే, భవిష్యత్తులో రాజ్యాంగంలోని సమాఖ్యస్ఫూర్తిని దెబ్బ తీసినట్లయ్యేది.''
వాస్తవానికి 1992 తొలినాళ్లలోనే అయోధ్యలో కరసేవ గురించి విశ్వహిందూ పరిషత్‌ ఓ ప్రకటన చేసింది. దీంతో పివి సర్కారులో రెండోస్థానంలో ఉన్న అర్జున్‌ సింగ్‌ లాంటి కొందరు ఈ విషయాన్ని ప్రముఖం చేశారు.. కేంద్ర సోలిసిటర్‌ జనరల్‌ దేవేంద్ర ద్వివేది బిజెపి నేతలతో మాట్లాడారు.. పివి కూడా అద్వానీ, జోషి, వాజపేయిలతో సంప్రతింపులు జరిపారు... అటు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కరసేవ పూర్తి శాంతియుతంగా జరిగేలా చూస్తామంటూ సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించిన తరువాత జస్టిస్‌ వెంకటాచలయ్య కరసేవకు అనుమతినిచ్చారు.. ఇంత జరిగాక కూడా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటుంది?
కనీసం కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌ అయిన రాష్ట్ర గవర్నర్‌ అయినా సకాలంలో స్పందించారా అంటే అదీ లేదు.. కేంద్ర బలగాలను పంపించాలనో, రాష్ర్టపతి పాలన విధించాలనో గవర్నర్‌ సిఫారసు చేయలేదు.. రిక్వెస్‌‌ట చేయలేదు.. ఈ కేసులో గవర్నర్‌ పాత్రను లిబరహాన్‌ కమిషన్‌ పూర్తిగా తప్పుపట్టింది. అప్పటి గవర్నర్‌ బి. సత్యనారాయణరెడ్డి మాత్రం అసలు అక్కడ ఏం జరగలేదనే ఇవాల్టికీ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు..విచిత్రమేమంటే గవర్నర్‌ మరింత `బెటర్‌'గా వ్యవహరించి ఉండాల్సిందన్న జస్టిస్‌ లిబరహాన్‌ నాటి గవర్నర్‌ను ఏనాడూ పిలవలేదు.. ఆయన స్టేట్‌మెంట్‌ తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్న గవర్నర్‌ వాదన ఏమిటన్నది తెలుసుకోవలసిన అవసరం లిబరహాన్‌కు కనిపించనే లేదు. 399 మంది సాక్షు్యలను విచారించిన లిబరహాన్‌ కమిషన్‌ గవర్నర్‌ను మాత్రం ఎందుకు పక్కన పెట్టింది? ఆయన పాత్రను తప్పుపట్టిన లిబరహాన్‌ కమిషన్‌ ఆయన్ను ఎందుకు విచారించలేకపోయింది.? దీనికైతే ఇప్పుడు జవాబు చెప్పటం కష్టం.
సంక్లిష్ట సమయంలో సక్రమంగా వ్యవహరించింది పివి సర్కారు.. మోసం చేసింది నాటి కళ్యాణ్‌సింగ్‌ సర్కారు.. నష్టపోయింది పివి నరసింహరావు.. ఇప్పుడు కాంగ్రెస్‌ ఏం చేస్తుంది? ఇప్పుడు బిజెపి నాయకులను బోనులో నిలబెట్టాలన్నది కాంగ్రెస్‌ రాజకీయం. లిబరహాన్‌ కమిషన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడి చేసింది కాబట్టి.. ఆ నివేదికను ప్రభుత్వం, పార్లమెంటు ఆమోదిస్తే.. దోషులపై కఠినంగా చర్యలు తీసుకోవలసిందే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు.. అభ్యంతరాలు ఉండాల్సిన పని లేదు.. ఎందుకంటే చట్టానికి ఎవరూ అతీతులు కారన్న సిద్ధాంతాన్ని అంతా విశ్వసిస్తాం కాబట్టి... అదే జరిగితే దోషులుగా నిలబెట్టాల్సిన వారి జాబితాను లిబరహాన్‌ స్పష్టంగానే లిఖించారు.. అదే కమిషన్‌ పివి నరసింహరావు విషయంలోనూ స్పష్టమైన వైఖరినే వెల్లడించింది. మరి బిజెపి నేతలపై చర్యలు తీసుకోవాలనే కాంగ్రెస్‌ నేతలు పివి విషయంలో ఎలాంటి వైఖరిని వ్యక్తం చేస్తారు? పివి నరసింహరావుకు తాము చేసిన నష్టాన్ని ఇవాళ పూడ్చగలుగుతారా? తమ పూర్వ నాయకులతో సమానంగా ఆయనకు గౌరవాన్ని ఇస్తారా? పివికి ఇంతకాలం దక్కని గౌరవ మర్యాదల్ని ఇప్పటికైనా దక్కించలేకపోతే కాంగ్రెస్‌కు లిబరహాన్‌ కమిషన్‌పై మాట్లాడే నైతిక అర్హతను ప్రశ్నించాల్సి వస్తుంది. పివి కి చేసిన అన్యాయానికి తెలుగువారికి క్షమాపణ చెప్పటం కాంగ్రెస్‌ కనీస బాధ్యత.. అలా చేయలేనప్పుడు బిజెపి నేతలపై చర్యలు తీసుకోమని డిమాండ్‌ చేసే నైతికత కాంగ్రెస్‌కు ఉంటుందని ఎలా భావించాలి?

15, నవంబర్ 2009, ఆదివారం

ఆ ఒక్క క్షణం!?

రోజుకొకరు.. పూట కొకరు.. వేధింపులు తాళ లేక ఒకరు... ఒత్తిళ్లను తట్టుకోలేక ఇంకొకరు... పిట్టల్లా రాలిపోతుంటే నిస్సహాయంగా చేష్టలుడిగి చూస్తున్న ప్రపంచం... వారం రోజుల్లో దాదాపు పది మంది విద్యార్థులు బలవంతంగా తమ ఉసురు తీసేసుకున్నారు.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.. ఒక్క క్షణంలో ఆలోచన లేకుండా తొందరపడి తీసుకున్న నిర్ణయాలు అమాయకుల బలవణ్మరణాలకు దారి తీస్తోంది. దీనికి కారణం ఎవరు? బాధ్యత ఎవరిది? ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులదా? ర్యాంకుల కోసం కన్నపిల్లలపై ఒత్తిడి పెంచుతున్న తల్లిదండ్రులదా? ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నందుకు కసాయివాళ్లకంటే ఎక్కువగా కాల్చుకుతింటున్న కార్పోరేట్‌ యాజమాన్యాలదా? తప్పెవరిది?

సోమాజీగూడలో అనూష...
ఘట్‌కేసర్‌లో కృష్ణకాంత్‌...
నల్గొండలో శ్వేత..
మెహదీ పట్నంలో స్వర్ణలత...
ఎల్‌బి స్టేడియంలో బాక్సర్‌ అమరావతి...
ఒకరి తరువాత ఒకరు..
వారం రోజుల్లో పది మంది...
ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?
ముఖ్యంగా విద్యార్థుల్లోనే ఇలా ఎందుకు జరుగుతోంది... ?

నవంబర్‌ ఆరోతేదీ సోమాజీ గూడలోని విల్లామేరీ కార్పోరేట్‌ కాలేజీ నాలుగో అంతస్థు నుంచి అనూష అనే అమ్మాయి హఠాత్తుగా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకలా చేసుకుందో ఎవరికీ అర్థం కాలేదు.. పోలీసులకు తెలిసిన కారణం అందరినీ విస్తుపోయేలా చేసింది... తన తల్లి కోప్పడిందనీ, తోటి విద్యార్థినులు వేధిస్తున్నారని అదే ఆమె ఆత్మహత్యకు కారణమట.. ఇదేం కారణం? తోటి విద్యార్థినులు వేధించటం ఏమిటి? తల్లి రాధాభాయి చెప్తున్న సమాధానం పోలీసులకే కన్విన్సింగ్‌గా లేదు.. వేరే బలమైన కారణం ఏమిటో ఉందనే వారు అనుమానిస్తున్నారు.
ఇక నల్గొండలో చైతన్య కాలేజీకి చెందిన విద్యార్థిని శ్వేత చావుకు ప్రేమ కారణం. పెళ్లి చేసుకుంటానన్న ప్రియుడు లండన్‌ వెళ్లి ఆరేళ్లయినా రాలేదని నిరాశతో తనువు చాలించిన అభాగ్యురాలు శ్వేత..
హైదరాబాద్‌లోని మరో ప్రైవేటు కళాశాలలో బయోటెక్నాలజీ జదువుతున్న జ్యోతి, బిటెక్‌ చదువు తున్న శిరీష్‌ లు కూడా ప్రేమించి, పెళ్లి చేసుకుని పెద్దలకు భయపడి ప్రాణాలు తీసుకున్నారు...ఘట్‌కేసర్‌లో కృష్ణకాంత్‌ చదువుల ఒత్తిడి తాళలేక ఏకంగా రైలు కింద పడి చనిపోయాడు...ఎందుకిలా జరుగుతోంది...

ఎందుకిలా జరుగుతోంది?
కొందరిది చదువు వైఫల్యం...
మరి కొందరిది ప్రేమ వైఫల్యం...
అందరిదీ ఒకే వయస్సు..
కురక్రారులోనే ఎందుకీ నైరాశ్యం...?

రేపటి భవితకు పునాదులు వేసుకోవలసిన వయస్సు యూత్‌కు అసలు భవిష్యత్తే శూన్యంగా ఎందుకు కనిపిస్తోంది? ఎక్కడుందీ లోపం? సమాజంలోనా? తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిలోనా? జవాబు చెప్పేదెవరు? ఈ తరానికి సరైన మార్గం చూపేదెవరు?
=============2================
అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం కేవలం క్షణికావేశంలో తీసుకునేది ఎంతమాత్రం కాదు.. రోజుల తరబడి.. నెలల తరబడి తనలో తాను మధన పడి గమ్యం తెలియక... దారి కనిపించక అంతా చీకటిగా మారిన క్షణం ఒక్కటి ఆ వ్యక్తి ఉసురు అమాంతం మింగేస్తుంది.
ప్రస్తుత సమాజంలో టీనేజీలో ఆత్మహత్యలకు కారణం ఏమిటి?
ఆత్మ న్యూనతా భావమా? మెదడులో కెమికల్‌ బ్యాలెన్‌‌స తప్పటమా?
తీవ్రమైన డిప్రెషన్‌కు లోనవటమా?
ఇలాంటి వారిని ముందుగా గుర్తించలేమా?
ఇలాంటి లక్షణాలను వ్యాధిగా భావించవచ్చా?
కష్టాల్లో ఉన్నవాళ్లే ఆత్మహత్యలకు పాల్పడతారనుకోవటం భ్రమ... రకరకాల వేదనలతో తమలో తాము నిరంతరం కుమిలిపోయే వాళ్లు, తమ సమస్యకు పరిష్కారం ఏదీ తోచక.. ఎవరి సలహానూ తీసుకోక, ఆలోచనలు మాని క్షణికావేశంలో కొన్ని సెకన్లలో తీసుకునే నిర్ణయం ఆత్మహత్య. తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైన వాళ్లే ఎక్కువగా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలకు పాల్పడుతుంటారు...

కేవలం టీనేజీ వయసులో ఉన్న యువతే ఎందుకింత ఒత్తిడికి లోనవుతోంది? కారణాలు అనేకం కనిపిస్తాయి.. ఈ తరం యువత చాలా సున్నితంగా పెరుగుతున్నవారు.. ఏ కాస్త ఒత్తిడినైనా తట్టుకునే ఆత్మసై్థర్యం వారిలో పూర్తిగా కొరవడింది. దీనికి తోడు ఏదో విధంగా ఇంజనీరింగో... ఎంబిబిఎస్సో చదివి విదేశాలకు పోయి ధారాళంగా డాలర్లు కొని తేవాలన్న అర్థం లేని ఆలోచనలు.. పనికిరాని టార్గెట్లు విద్యార్థులను మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి.
ఆత్మహత్యే తప్ప మరో మార్గం లేదని భావించేవారి మానసిక ప్రవర్తన అందుకు పూనుకునే కొద్దిరోజుల ముందు విచిత్రంగా ఉంటుంది.
* ఎక్కువ సేపు ఒంటరిగా గడపటం
* చిన్న చిన్న విషయాలకు చికాకు పడటం
* తనకెవ్వరూ లేరన్నట్లుగా మాట్లాడటం
* కొన్ని ఘటనల పట్ల విపరీతంగా భయపడటం
* తన బాధ్యతలను అర్థాంతరంగా ఇతరులకు అప్పజెప్పటం
* తన కిష్టమైన వారికి దూరంగా ఉండటం...ఒక్కోసారి అతి ప్రేమగా ప్రవర్తించటం
జరుగుతుంటాయి. వీటిని సీరియస్‌గా పరిగణించి ముందు జాగ్రత్త పడితే అనర్థాన్ని నివారించేందుకు అవకాశం ఉంటుంది.
తమ పిల్లలపై పెరుగుతున్న మానసిక ఒత్తిడిని సకాలంలో గుర్తించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.. ఎవరికి వారు తమ పనుల్లో మునిగిపోయి.. అసలు పిల్లలు ఎలా ఉంటున్నారు.. ఎలా వ్యవహరిస్తున్నారు అన్న విషయాలను పట్టించుకోకపోతే భారీ మూల్యాన్నే చెల్లించుకోవలసి వస్తుంది. చదువు విషయంలో కానీ, జీవితం విషయంలో కానీ పిల్లల మనసెరిగి ప్రవర్తించటం అవసరం... ఒకవేళ పిల్లలు తప్పుదారిలో వెళు్తన్నారని అనిపిస్తే.. సరైన దారిలో తీసుకురావటానికి సున్నితంగా వ్యవహరించాలి తప్ప, మనసును తీవ్రంగా గాయపరిచేలా ప్రవర్తించటం సరికాదు.. తమ పిల్లలతో ఎంత స్నేహంగా మెలిగితే అంత మంచిది.. కాలేజీలో, పాఠశాలలో తమకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే తల్లిదండ్రులకు స్వేచ్ఛగా చెప్పుకునేలా పిల్లలతో అనుబంధం పెంచుకోవాలి.. వాళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించటం కీలకం... ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని తొలగించేందుకు తోడుగా తల్లిదండ్రులు ఉంటే.. స్నేహితులు ఉంటే... విద్యార్థుల్లో ఒత్తిడి ఉండదు.. చదువూ సాఫీగా సాగుతుంది.. జీవితాన్ని అర్థం లేకుండా అంతం చేసుకోవాలన్న ఆలోచనకు తావుండదు..

13, నవంబర్ 2009, శుక్రవారం

ప్రజాకవి.. ప్రజల కవి.. కాళోజీ...

december 13 kaloji death anniversary
మన కొంపలార్చిన.... మన స్త్రీల చెరచిన...
మన పిల్లలను చంపి... మనల బంధించిన...
మానవాధములను.. మండలాధీశులను
మరచిపోకుండ గురుతుంచుకోవాలె...
కసి ఆరిపోకుండ బుస కొట్టుచుండాలె...
కాలంబు రాగానె కాటేసి తీరాలె...
.......................
జనం కోసం ఇంతగా గళం విప్పిన దెవరు?
ధిక్కారమే జీవింతగా గడిపిందెవరు?
ప్రజల గొడవను తన గొడవగా మలచుకున్నదెవరు?
పోరు గడ్డ ఓరుగల్లు విప్లవ వీరులను శాసించిందెవరు?

పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది... జీవితమంతా లోకం కోసం ధారపోసిన మహా పురుషుని మాటలివి... అన్యాయాన్ని ఎదిరించటం కోసం ఊపిరి ఉన్నంత కాలం గొడవ చేసిన వాడు.. ప్రజల్ని చైతన్య పరచేందుకు ప్రజాస్వామ్య పూవులను లోకమంతటా విరజిమ్మిన వాడు.. రాజ్యహింసను ధిక్కరించిన స్వరంతోనే ప్రతిహింసనూ ప్రతిఘటించిన ఘనుడు... ప్రజాకవి.. ప్రజల కవి.. కాళోజీ...
తన ప్రజల కోసం, తన సమాజం కోసం ఇంతగా పరితపించిన వాడు తెలుగునాట ఒకే ఒక్కడు.. కాళోజీ నారాయణరావు.. వ్యక్తిత్వానికి మించిన వ్యవస్థ కాళోజీ... ఏ సిద్ధాంతానికీ కట్టుబడిన వాడు కాదు.. ఏ వర్గానికీ కొము్మ కాసిన వాడు అంతకంటే కాదు..అన్ని సిద్ధాంతాలూ ఆయన్ను తమవాణ్ణి చేసుకోవాలని ప్రయత్నించాయి.. లెఫ్టు రైటూ తేడా లేకుండా అన్ని వర్గాలూ ఆయన మావాడే అని చెప్పుకున్నాయి. కానీ, ఎవరికీ అందని, అంతుపట్టని వెలుగు మొగ్గ కాళోజీ...జనం చుట్టూ కము్మకున్న చీకట్లను తొలగించేందుకు తాను వెలిగినంతకాలం ప్రయత్నించింది..చీకట్లను ప్రతిఘటించింది.. ప్రజల మేలే ఆయన సిద్ధాంతం.. ప్రజల నాడే ఆయన వర్గం.. ప్రజల గొడవే కాళోజీ గొడవ... కాళోజీ వెలుగు ఆరిపోయి ఏడు సంవత్సరాలు అప్పుడే అయిపోయాయి... ఆయన గొడవ అర్ధాంతరంగా నిలిచిపోయింది. అలుపెరుగని ధిక్కార స్రవంతికి అడ్డుకట్ట పడింది..
సుమారు తొంభై వసంతాల నిండు జీవితంలో కాళోజీ ఏనాడూ తన సంసారాన్ని పట్టించుకున్నది లేదు.. తన అన్న రామేశ్వర రావుకే అన్నీ అప్పగించారు.. ఊరూరా తిరిగారు... జనం ఘోష తన ఘోషగా చెప్పుకొచ్చారు..
నిజాం కాలంలో ఆర్యసమాజంలో తిరిగారు.. మావోయిస్టు ఉద్యమానికి అండగా నిలిచారు... ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మొదటగా కనిపించేది కాళోజీ.. ఆయన రాజ్యాంగాన్ని నిరసించలేదు.. రాజ్యహింసను నిరసించారు.. అదే సమయంలో మావోయిస్టుల అర్థం లేని హింసనూ సమర్థించలేదు.. ప్రజాస్వామ్య వ్యవస్థను మన్నించాడు... గౌరవించాడు.. అయితే పాలకులను ఎన్నుకునే ముందు ఆలోచించి ఓటేయమన్నాడు...
ప్రాణ తుల్యము ప్రజాస్వామ్యమున ఓటు.
వినియోగపరచుటకు అనువైన ఘడియ
ఓటిచ్చునప్పుడె ఉండాలె బుద్ధి
ఎన్నుకొని తలబాదుకొన్న ఏమగును?
తర్వాత ఏడ్చినను తప్పదనుభవము..
రోజుకో విధంగా ఏదో రూపంలో ఎన్నికలు ముంచుకొస్తూనే ఉన్న సమయంలో ఈ మాటలు ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినవి... ఎప్పటికైనా ప్రతి ఓటరు అనుభవంలోకి వచ్చే మాటలివి....నేతలు ఎన్ని రకాల ప్రచారాలు చేస్తున్నా.. ఎన్ని గిమ్మిక్కులు చేస్తున్నా... ఓటరు తాను నిర్వహించాల్సిన బాధ్యతను గుర్తుకు తెస్తున్న వాక్యాలివి. కాళోజీ నిలువెత్తు సంతకానికి ఇవి ఆనవాళు్ల...
అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు..
అన్యాయం అంతరించినప్పుడే నా గొడవకు సంతృప్తి

అన్నాడు కాళోజీ... ఆ అన్యాయం అంతరించేదెన్నడు? ప్రజలు ప్రశాంతంగా ఉండేదెన్నడు..
జరిగిందంతా చూస్తూ ఏమీ ఎరగనట్లు పడి ఉండటానికి నేను సాక్షీభూతుణ్ణి కాను...
సాక్షాత్తూ మానవుణ్ణి...
అన్నవాడు కాళోజీ... మన నాయకుల్లో.. ఆయన తమవాడని చెప్పుకుంటున్న వాళ్లలో.. ఫోటోలు పెట్టుకుని పూజిస్తున్న వాళ్లలో ఎవరికైనా ఈ మాటలు గుర్తుంటే ఎంత బాగుండు?

3, నవంబర్ 2009, మంగళవారం

అసమ్మతులు, అంతర్గత సంఘర్షణలు

మొత్తం మీద కాంగ్రెస్‌ ఇన్నాళూ్ల తొడుక్కున్న చొక్కాలన్నీ విప్పేసి వరిజినల్‌ వేషంలోకి వచ్చేసింది. ఆరేళ్ల పాటు ఒక్క నాయకుడి మాటపై, ఒక్క తాటిపై నడచిన పార్టీలో అసమ్మతులు, అంతర్గత సంఘర్షణలతో కలకలమంటోంది... వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా కాంగ్రెస్‌ విడిపోయిందా అన్నంతగా మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి కొండాసురేఖ రాజీనామా.... పిఆర్‌పితో గ్రేటర్‌ ఎన్నికల్లో పొత్తుల వ్యవహారం పార్టీలో గుంభనంగా ఉన్న అసంతృప్తిని ఒక్కసారిగా వెళ్లగక్కింది..

మొన్నటికి మొన్న పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా పెద్ద హైడ్రామాగానే కొనసాగింది. తన రాజీనామా లేఖను నేరుగా ముఖ్యమంత్రికి ఇవ్వకుండా, గవర్నర్‌కు ఇవ్వడం, అందునా ఆరు పేజీల లేఖను ఇవ్వటం విచిత్రం. అందులో పార్టీ వ్యవహారాలన్నీ ఏకరువు పెట్టడం మరో విడ్డూరం. ఇదేమని అడిగితే గవర్నర్‌ తనకూ అధిష్ఠానానికి మధ్య మీడియేటర్‌గా వ్యవహరిస్తారన్నట్లుగా మాట్లాడటం ఇంకో వింత....గవర్నర్‌ ఎలా వ్యవహరిస్తారో కూడా తెలియని వాళు్ల మంత్రి పదవులు ఎలా నిర్వహించారో అర్థం కాదు..
పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్‌లోని జగన్‌మోహన్‌ రెడ్డి వర్గం చాలా వూ్యహాత్మకంగా పావులు కదుపుతూ వస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్‌‌సలో ఆయన తన తదుపరి చర్యను చెప్పకనే చెప్పారు.. ప్రభుత్వంతో ఘర్షణ చేయనంటూనే సవాలుగా మారుతున్న సంకేతాలు పంపించారు...తన తండ్రి ప్రారంభించిన పథకాలు సరిగా అమలు కావటం లేదంటూ నాటి నుంచే ఘర్షణాత్మక వైఖరిని అవలంబించటం ప్రారంభించారు.. ఇక అనుచరగణం జగన్‌ వెంట వీర విధేయంగా ముందుకు సాగుతోంది. రోశయ్యకు వ్యతిరేకం కాదంటూనే జగన్‌ను సిఎం చేయాలంటారు... అధిష్ఠానం మాటను కాదనమని చెప్తూనే ధిక్కారస్వరాలు వినిపిస్తారు.. కొండా సురేఖ రాజీనామా, ఈ రకమైన ఎత్తుగడల్లో మొదటిది మాత్రమే....
సురేఖ రాజీనామా పత్రాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేశారు.. సిఎల్‌పి సమావేశాన్ని ఏర్పాటు చేయలేదన్నది అందులో ప్రధాన ఆరోపణ... సిఎల్‌పి సమావేశం ఏర్పాటు చేస్తే జగన్‌ వర్గీయులు ఖచ్చితంగా గందరగోళం సృష్టిస్తారని అధిష్ఠానం బెంబేలెత్తుతోంది. అందుకనే సిఎల్‌పిని సమావేశ పరచటంలో ఇంత ఆలస్యం.. ఒక్కసారి సిఎల్పీ సమావేశం జరిగిన నాయకుణ్ణి ఎన్నుకుంటే.. ఆ తరువాత అసమ్మతిని ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదని అధిష్ఠానం భావిస్తూ ఉండవచ్చు. అందుకనే వ్యవహారాన్ని ఇంతగా తాత్సారం చేయటం.. ఎవరినీ అవుననకుండా, కాదనకుండా వ్యవహారాన్ని వీలైనంత ఎక్కువ కాలం నాన్చటం ద్వారా ఎవరో ఒకరు వీక్‌ అయ్యే అవకాశం ఉంటుంది... అప్పుడు అధిష్ఠానానిదే పై చేయి అవుతుంది... రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పూర్తిగా గుప్పెట్లో పెట్టుకుంటే తప్ప ఆధిపత్యాన్ని కొనసాగించటం కేంద్ర నాయకత్వానికి సాధ్యం కాదు...
సురేఖ రాజీనామాలో మరో కీలకాంశం కులం.... జగన్‌ను ముఖ్యమంత్రి కాకుండా కమ్మలాబీ తీవ్రంగా కృషి చేస్తోందని ఆరోపించి సురేఖ సంచలనమే సృష్టించారు... ఈ మాటలు అధికార పార్టీలోనే కాదు.. మిగతా పార్టీల్లోనూ నేతలను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. జగన్‌ వర్గం కావాలనే ఈ పదాన్ని వాడినట్లు అర్థమవుతోంది.
2
సురేఖ రాజీనామా వ్యవహారం పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల్లో పైకి కనపడకపోయినా గుబులు పుట్టించిందన్న మాట వాస్తవం.. ఆమె రాజీనామాను సీనియర్లు తప్పు పడుతున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని విమర్శించారు. ఈ వ్యవహారంతో జగన్‌కు నష్టమే తప్ప లాభం లేదనీ వ్యాఖ్యానిస్తున్నారు.. ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ కుట్ర చేయలేదనీ స్పష్టం చేస్తున్నారు...అలా అంటూనే ఎవరి ఎత్తుగడలు వాళు్ల వేస్తున్నారు..

సురేఖ రాజీనామా వ్యవహారాన్ని జగన్‌ వ్యతిరేక వర్గం పూర్తిగా తప్పు పట్టింది ఆమె రాజీనామా చేసిన పద్ధతి క్రమశిక్షణ ఉల్లంఘన కిందికే వస్తుందన్నది వారి వాదన. గవర్నర్‌కు నేరుగా రాజీనామా చేయటం పార్టీకి వెన్నుపోటు పొడవటమేనని వారు తీవ్రస్థాయిలో విమర్శించారు. అయినా ఆమె రాజీనామా చేయటం వల్ల పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని కూడా ధీమాగా ఉన్నారు..
సురేఖ కుల ప్రస్తావన తేవటంపైనా నేతలు సీరియస్‌ అయ్యారు.. పార్టీలో కుల ప్రభావం ఉండదని వారంటున్నారు..
అయితే జగన్‌ శిబిరంలో ఉన్న ఇతర నేతలు తాము కూడా సురేఖ బాటలో రాజీనామా చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు చెప్తున్నారు.. జగన్‌కు లాభం కలుగుతుందంటే మంత్రులం అంతా రాజీనామా చేయటానికి సై అని కూడా వారు స్పష్టం చేస్తున్నారు..
సురేఖ రాజీనామా తరువాత కూడా రాష్ట్ర కాంగ్రెస్‌లో రెండు వర్గాలూ తమ తమ వాదనలను బలంగానే వినిపిస్తున్నాయి.
పిఆర్‌పి పొత్తు వ్యవహారం కూడా ఇలాగే జరిగింది. చివరి నిమిషంలో డిఎస్‌ చేసిన ప్రయత్నాలపై వీరప్పమొయిలీ నీళు్ల చల్లారు... మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలో రెండు వర్గాలు వేర్వేరు దారుల్లో వెళు్తన్నట్లు స్పష్టంగా బహిర్గతమయింది. ఇక నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయాలు రానున్న నాలుగేళ్లలో మరింత రసవత్తరంగా కొనసాగుతాయి.

ప్రమాదంలో సాగర్‌


ప్రఖ్యాత నాగార్జున సాగర్‌కు ఉగ్రవాదుల ముప్పు మాటేమిటో కానీ, మన రాజకీయ నాయకులు, పాలకుల నుంచి మాత్రం పెను ప్రమాదమే పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. వరద కృష్ణ తాకిడికి అల్లాడిపోయిన నాగార్జున సాగర్‌ డ్యామ్‌ రానున్న రోజుల్లో పెద్ద ముప్పును ఎదుర్కోనుంది... వరద తాకిడికి సాగర్‌ స్పిల్‌వే భారీగా నష్టపోయింది. కానీ, ప్రభుత్వానికి మాత్రం దీని తీవ్రత అర్థం కావటం లేదు.. డ్యాం నిర్వహణ సరిగా లేక ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది...

కృష్ణా వరదలు మన రాష్ట్రంలో రిజర్వాయర్లకు పెద్ద పరీక్షనే పెట్టాయి. నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో ఆసియాలో అతిపెద్ద ఎర్‌‌తడ్యాం, బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్‌ అస్తిత్వం ప్రమాదంలో పడింది... వరదల తరువాత సాగర్‌ వద్ద వాస్తవ పరిస్థితిని ఓ నిజనిర్థారణ కమిటీ అంచనా వేసినప్పుడు అనేక అంశాలు వెలుగు చూశాయి..
మొన్నటి వరదల్లో 25 లక్షల క్యూసెక్కులు ఒకే సారి విజృంభించి వచ్చిన నేపథ్యంలో సాగర్‌ డ్యాంకు కీలకమైన స్పిల్‌వే ముపై్ఫ శాతం పైగా దెబ్బ తిన్నది. ఇది ఇంతకు ముందే దెబ్బ తిని ఉంది... దీని మరమ్మతుల కోసం ప్రపంచ బ్యాంకు 400 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ, మరమ్మతులు మాత్రం పూర్తిగా జరగలేదు. ఫలితం మొన్నటి వరదలకు మరింత దారుణంగా స్పిల్‌వే చెడిపోయింది. ఫలితంగా భవిష్యత్తులో మొన్నటి వరదల్లో సగం నీళు్ల ముంచుకువచ్చినా డ్యాం పని అయిపోయినట్లే.....
స్పిల్‌వే సమస్య ఇలా ఉంటే, ప్రాజెక్టు గేట్లనయినా సక్రమంగా నిర్వహిస్తున్నారా అంటే అదీ లేదు.. నాగార్జున సాగర్‌ డ్యాంకు మొత్తం 26 గేట్లు ఉన్నాయి. వీట్లలో ఏ ఒక్కటి కూడా సక్రమంగా పనిచేయటం లేదు...మొన్న వరదలు వచ్చినప్పుడు ఒక్కో గేటు తెరిచేందుకు అరగంటకు పైగా పట్టిందంటేనే వాటిని ఎంత చక్కగా నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఎర్‌‌త డ్యాం నిర్మించేముందు ఒక వేళ ప్రమాదం ఏర్పడితే, డ్యాంకు ఇబ్బంది కలుగకుండా సమాంతరంగా నీళు్ల వెళ్లేలా ఎమర్జెన్సీ హాలో నిర్మించారు... ఈ హాలో ఓపెన్‌ చేస్తే ఒకేసారి లక్ష క్యూసెక్కుల నీళు్ల వెళ్తాయి. కానీ, ఈ హాలోను నిర్మించిన నాటి నుంచీ ఏ ఒక్కనాడూ ఓపెన్‌ చేయలేదు.. మొన్న వరదలు వచ్చిన సందర్భంలో ఈ ఎమర్జెన్సీ హాలోను ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నం చేస్తే.. మూతతో సహా బురదలో కూరుకుపోయింది. అది ఓపెన్‌ కాలేదు..
నీటిపారుదల గురించి, వ్యవసాయం గురించి పోచికోలు కబుర్లు చెప్పమంటే మన నేతలు తెగ చెప్పేస్తారు... నాగార్జున సాగర్‌ తాగునీటికి, సాగునీటికి, కృష్ణా డెల్టాకు అత్యంత కీలకమైన ప్రాజెక్టు... దీని విషయంలో అలసత్వంతో వ్యవహరిస్తే భవిష్యత్‌ తరాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది..

పాపం చిరంజీవి

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు వ్యవహారం చినికి చినికి గాలి వానగా మారింది. చివరకు పొత్తు కుదరకుండానే ఎవరికి వారే అయిపోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాలు సృష్టించాయి. జగన్‌ వర్గం తెచ్చిన ఒత్తిడి, వీరప్ప మొయిలీ లాబీయింగ్‌ డిఎస్‌ వూ్యహాన్ని దెబ్బ తీశాయి. నిజానికి పిఆర్‌పితో పొత్తు పెట్టుకోవచ్చన్న ఊహాగానాలకు పిసిసి ఛీఫ్‌ తెరలేపిన మరుక్షణం నుంచీ కాంగ్రెస్‌లో మాటల తూటాలు శరవేగంగా దూసుకువచ్చాయి.

ఓ పక్క జగన్‌ వర్గం తనదైన రీతిలో వ్యతిరేకంగా స్పందిస్తే... కాంగ్రెస్‌లోని మిగతా వర్గం రకరకాలుగా స్పందించింది. అయితే మెజారిటీ వర్గం మాత్రం పిఆర్‌పితో పొత్తు కంటే, పార్టీని పూర్తిగా కాంగ్రెస్‌లో విలీనం చేసుకుంటే మంచిదన్న అభిప్రాయానికే మొగ్గు చూపారు.. ప్రస్తుతానికి పొత్తు గొడవ సద్దుమణిగినా, భవిష్యత్తులో రెండు పార్టీలూ కలిసి పనిచేసేందుకు ఒక మార్గం అంటూ ఏర్పడిందనే చెప్పాలి...జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే
మహానగర ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపనున్నాయనే చెప్తున్నాయి.. ఈ ఎన్నికల్లో పిఆర్‌పితో దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి పొత్తు కుదుర్చుకుంటున్నట్లు డిఎస్‌ ప్రకటించిన మరుక్షణం నుంచి కాంగ్రెస్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ నాయకులు విస్పష్టంగానే చిరంజీవితో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించారు. సంధి కుదుర్చుకోవటం అంటూ జరిగితే పతనావస్థలో ఉన్న పార్టీకి మళ్లీ ఊపిరి పోసినట్లు అవుతుందన్నారు...కోమాలో ఉన్న చిరంజీవిలో మళ్లీ చైతన్యాన్ని తీసుకువచ్చినట్లవుతుందని విష్ణువర్థన్‌ రెడ్డి బహిరంగంగానే విమర్శించారు..
పొత్తును వ్యతిరేకిస్తున్న నాయకులు అందుకు కారణాలను బలంగానే వినిపిస్తున్నారు.. మొన్న 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలోని నియోజక వర్గాల్లో పిఆర్‌పి బలం చెప్పుకోదగ్గంత లేదని, దేవేందర్‌ గౌడ్‌ లాంటి నాయకులు సైతం మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చిన వాస్తవాలను గ్రహించాలని వారు వాదిస్తున్నారు. మల్కాజిగిరిలో తప్ప మరెక్కడా పిఆర్‌పి రెండోస్థానానికి చేరుకోలేకపోయింది. కొన్ని చోట్ల లోక్‌సత్తా కంటే తరువాత స్థానంలో ఉంది కూడా... అలాంటి పిఆర్‌పితో పొత్తు పెట్టుకుంటే చిరంజీవి మేకులా తయారయ్యే అవకాశం ఉందని కూడా కొందరు అనుమానిస్తున్నారు.. పొత్తు వల్ల కాంగ్రెస్‌కు లాభం కలిగే మాటెలా ఉన్నా, చిరంజీవికి మాత్రం మేలు జరుగుతుందనేది స్పష్టం. దీని కంటే సముద్రం లాంటి కాంగ్రెస్‌లో పిఆర్‌పిలో విలీనం చేసుకోవటమే మంచిదన్న ఆలోచనతో చాలామంది నాయకులు వర్గాలకు అతీతంగా అభిప్రాయపడుతున్నారు..
పిఆర్‌పితో పొత్తు పెట్టుకోవటం వల్ల టిఆర్‌ఎస్‌లాగా మరో పార్టీని పక్కలో బల్లెంలాగా తయారు చేసుకున్నట్లవుతుందని కొందరి భావన. ఎందుకంటే పిఆర్‌పి ఒంటరిగా ఉన్నప్పుడే కాంగ్రెస్‌ విజయం సాధించగలిగింది. పైగా రాజధానిలో ఎంఐఎం సహకారం ఎలాగూ ఉంది..అలాంటప్పుడు పిఆర్‌పితో పొత్తు వల్ల ఒరిగేదేమీ లేదని ఎక్కువమంది అంటున్నారు.. దీని పర్యవసానమే పొత్తుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదంటూ వీరప్పమొయిలీ ప్రకటన...
అయితే మంతనాలు సాగించాం కాబట్టి ఈ కథకు ఎలా ముగింపునివ్వాలన్నది కాంగ్రెస్‌ నాయకత్వానికి చాలా సేపు అర్థం కాలేదు.. దీనికి మార్గంగా గ్రేటర్‌ ఎన్నికల్లో 21 సీట్లు తమకు కేటాయించాలని పిఆర్‌పి డిమాండ్‌ను తిప్పికొట్టడమొక్కటే కనిపించింది. కాంగ్రెస్‌ పది సీట్లకు మించి ఇవ్వలేమంటూ కాంగ్రెస్‌ పొంతన లేని ప్రతిపాదన చేయటంతో పొత్తు కథ తేలిపోయింది. పాపం చిరంజీవి.. కనీసం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ నిచ్చెనైనా పట్టుకుంటే కొన్ని మెట్లయినా ఎక్కవచ్చని భావించారు.. దాన్నీ జగన్‌ వర్గం దిగ్విజయంగా తిప్పి కొట్టింది... కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వీరప్పమొయిలీపై ఒత్తిడి తీసుకురావటంలో సక్సెస్‌ అయింది...
కొసమెరుపు... వీరప్పమొయిలీ కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కంపెనీలో ఏడాదికి సుమారు ఆరు కోట్ల ఉద్యోగి...