28, ఫిబ్రవరి 2012, మంగళవారం

స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన ఆర్థిక మంత్రులు

1.
లియాఖత్‌ అలీఖాన్‌(1946-47)
1946లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. ఆల్‌ ఇండియా ముస్లింలీగ్‌లో క్రియాశీల నాయకుడైన లియాఖత్‌ అలీఖాన్‌ భారత విభజనలో కీలక పాత్ర పోషించారు.  మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ ముస్లిం లీగ్‌ ప్రతినిధిగా లియాఖత్‌ అలీఖాన్‌ను మంత్రివర్గంలో చేర్చుకుని ఆర్థిక శాఖను అప్పజెప్పారు. 1947లో పాకిస్తాన్‌ ఏర్పాటైన తరువాత స్వతంత్ర పాకిస్తాన్‌కు మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు...
2.
ఆర్‌.కె.షణ్ముగం శెట్టి(1947-48)
స్వతంత్ర భారత దేశానికి మొదటి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన తొలి ఆర్థిక మంత్రి ఆర్‌కె షణ్ముగంశెట్టి. 1947 నవంబర్‌ 26న మొదటి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో దేశ ఆర్థిక పరిస్థితిపై సమీక్ష తప్ప ఎలాంటి కొత్త పన్నులు విధించలేదు. ఎందుకంటే మరో 95రోజుల్లో పూర్తి స్థాయిలో 1948-49 బడ్జెట్‌ ప్రవేశపెట్టాలి కాబట్టి  తొలి బడ్జెట్‌ రివ్యూకే పరిమితమైంది. ఈయన్ను కొద్ది రోజులకే ప్రధానమంత్రి నెహ్రూ రాజీనామా చేయించారు.
3.
కెసి నెర్గీ..(1948)
కేవలం 35 రోజులపాటే కేంద్ర ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఒకే ఒక్కడు... నెర్గీకి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశమే రాలేదు.

4
జాన్‌ మొథాయ్‌(1948-50)
ఈయన ఒక ఆర్థిక వేత్త. దేశ తొలి రైల్వే మంత్రిగా వ్యవహరించారు. తరువాత ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టారు. ఈయన వరుసగా రెండు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. 1950లో ప్రణాళికా సంఘానికి ఎక్కువ అధికారాలు కట్టబెట్టిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో రాజీనామా చేశారు.
5
సిడి దేశ్‌ముఖ్‌(1950-56)
ఈయన ఆర్థిక మంత్రి కావటానికి ముందు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు తొలి గవర్నర్‌గా పనిచేశారు. 1951లో తొలి జనరల్‌ ఎన్నికల నేపథ్యంలో  బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. తొలి ఎన్నికలు 1951-డిసెంబర్‌-1952 ఫిబ్రవరిలో జరిగాయి. ఎన్నికల తరువాత ఏర్పడ్డ ప్రభుత్వంలో  దేశ్‌ముఖ్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బడ్జెట్‌ కాపీలను హిందీలో తయారు చేయటం ఈయన హయాంలోనే మొదలైంది. తొలి రెండు పంచవర్ష ప్రణాళికలను రూపొందించి అమలు చేయటంలో ఈయన ముఖ్యభూమిక పోషించారు. ఇంపీరియల్‌ బ్యాంకును ఈయనే జాతీయం చేశారు. దేశంలో కొత్త కంపెనీల చట్టాన్ని ప్రవేశపెట్టారు. మహారాష్ట్ర నుంచి ముంబయిని వేరు చేయాలన్న నిర్ణయంపై నిరసనలు వ్యక్తం అయిన నేపథ్యంలో దేశ్‌ముఖ్‌  రాజీనామా చేశారు.

6
టిటి కృష్ణమాచారిః(1957-58)(1964-66)
దేశానికి రెండుసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి నేత. 1957లో రెండో సాధారణ ఎన్నికలు ఈయన సమయంలోనే జరిగాయి. దేశంలో  మూడు భారీ ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసిన ఘనత, మూడు ఆర్థిక సంస్థలు ఐడిబిఐ, ఐసిఐసిఐ, యుటిఐ లను నెలకొల్పిన క్రెడిట్‌ కృష్ణమాచారికి దక్కుతుంది. 1958లో  ఎల్‌ఐసి ముంద్రా కేసులో జస్టిస్‌ చాగ్లా కమిషన్‌ తప్పు పట్టడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.
1964-66లో మరోసారి కృష్ణమాచారి రెండోసారి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. తొలిసారి సామాజిక భద్రత అన్న అంశాన్ని ప్రస్తావన చేసింది కృష్ణమాచారినే... ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. 1964లో ఫ్యామిలీ పెన్షన్‌ పథకాన్ని ప్రకటించారు. రాజస్థాన్‌ కెనాల్‌ స్కీమ్‌, దండకారణ్య, దామోదర్‌ వ్యాలీ ప్రాజెక్టులు, నైవేలీ లిగ్నైట్‌ ప్రాజెక్టులను టిటి కృష్ణమాచారి ప్రకటించారు.

7
జవహర్‌లాల్‌ నెహ్రూః(1958-59)
౧౯౫౮లో సరిగ్గా బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఫిబ్రవరి మాసంలోనే టిటి కృష్ణమాచారి రాజీనామా చేయటంతో   ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ స్వయంగా ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించారు.  1958-59 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనూహ్యంగా తనపై భారం పడిందని ఆయన ఆనాడు తన బడ్జెట్‌ ప్రసంగంలో అన్నారు.

 8
మొరార్జీ దేశాయ్‌(1959-64)(1967-69)
1959నుంచి 1964వరకు జవహర్‌ లాల్‌ నెహ్రూ కేబినెట్‌లో అత్యధిక కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన కీర్తి మొరార్జీ దేశాయ్‌కి దక్కింది. రెండు సార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన మొరార్జీదేశాయ్‌ దాదాపు పది బడ్జెట్‌లను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. ఇందులో అయిదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ తొలి దఫాలో ప్రవేశపెట్టారు. 1959 నుంచి 1964 వరకు పూర్తి స్థాయి బడ్జెట్‌లను, 1962-63లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  ఆ తరువాత 1967లో రెండోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టారు. ఈసారి ఆయన మూడు పూర్తి స్థాయి బడ్జెట్‌లను, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1969లో దేశంలోని ప్రధాన బ్యాంకులను ఒక ఆదివారం సాయంత్రం జాతీయం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ ఉండటం వల్ల వాటి పనితీరు మెరుగుపడుతుందని ఆయన భావించారు. కానీ, దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.
9
ఇందిరాగాంధీః(1970-71)
మొరార్జీ దేశాయ్‌ రాజీనామా చేసిన తరువాత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆర్థిక మంత్రిత్వ శాఖను తన దగ్గరే ఉంచుకున్నారు. ఈవిధంగా దేశానికి తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు.
10
వై.బి.చవాన్‌(1971-1975)
౧౯౭౧లో అయిదో సాధారణ ఎన్నికలు పూర్తయిన తరువాత  ఆర్థిక మంత్రిగా వైబి చవాన్‌ను ఇందిర నియమించారు. 1971 నుంచి 75 వరకు ఆయన పూర్తి బడ్జెట్లను ప్రవేశపెట్టారు.
11
సి. సుబ్రహ్మణ్యం(1975-77)
1975, 76లలో రెండు బడ్జెట్లను సుబ్రహ్మణ్యం ప్రవేశపెట్టారు. ఎక్సైజ్‌ ద్వారా ఆదాయాన్ని పెంచే మార్గాలను మొదటిసారి అమలు చేసిన ఆర్థిక మంత్రి సుబ్రహ్మణ్యం.
12
హెచ్‌ఎం పటేల్‌(1977-79)
మార్చి 1977లో ఏడో జనరల్‌ ఎన్నికల తరువాత మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. మొరార్జీదేశాయ్‌ ప్రధానమంత్రిగా ఏర్పడిన కాంగ్రెసేతర ప్రభుత్వంలో  హెచ్‌ఎం పటేల్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

13
చౌదరి చరణ్‌సింగ్‌(1979-80)
1979వ  ఆర్థిక సంవత్సరానికి చౌదరి చరణ్‌సింగ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అప్పుడు ఆయన దేశ ఉపప్రధానమంత్రిగా ఉన్నారు.
14
రామస్వామి వెంకట్రామన్‌(1980-82)
1980లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్‌ వెంకట్రామన్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1980-81, 1981-82 ఆర్థిక సంవత్సరాలకు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ తరువాత వెంకట్రామన్‌ ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా  ఉన్నత పదవులను చేపట్టారు.
15
ప్రణబ్‌ ముఖర్జీ(1982-84)
ఇందిర కేబినెట్‌లో ప్రణబ్‌ ముఖర్జీ తొలిసారి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడే.  ప్రణబ్‌ ముఖర్జీ 1982, 83, 84 బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.
16
విపి సింగ్‌(1985-87)
ఇందిరాగాంధీ మరణం తరువాత ప్రధానమంత్రి అయిన రాజీవ్‌ మంత్రి వర్గంలో విపి సింగ్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 85, 86 బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. దేశంలో లైసెన్స్‌ రాజ్యానికి చరమగీతం పాడే దిశగా చర్యలు తీసుకున్న ఘనత విపి సింగ్‌ది.....ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు అదనపు అధికారాలను కట్టబెట్టారు. దీని వల్ల దేశంలో అత్యంత సంపన్నులపై కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేసింది. ఈ దాడులను ఎదుర్కొన్న వారిలో ధీరూభాయ్‌ అంబానీ కూడా ఉన్నారు. ఈ కారణంగా రాజీవ్‌గాంధీపై ఒత్తిళ్లు పెరగటంతో విపిసింగ్‌ను తప్పనిసరిగా తప్పించాల్సి వచ్చింది.

17
రాజీవ్‌గాంధీ(1987-88)
1987-88 ఆర్థిక సంవత్సరానికి ప్రధానమంత్రి  రాజీవ్‌గాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రుల్లో రాజీవ్‌ మూడో వారు. మరో విశేషమేమంటే ఈ ముగ్గురు ప్రధానులూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావటం. జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఆయన కూతురు ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ... ముగ్గురూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1987లో నే దేశంలో జీరో బేస్డ్‌ బడ్జెటింగ్‌ ప్రారంభమైంది. జీరోబేస్డ్‌ బడ్జెట్‌ అంటే ఆర్థిక శాఖకు వచ్చిన ప్రతి డిమాండ్‌ను, ప్రతిపాదనలను ముందే సమీక్షించి, విశ్లేషించి తుది నిర్ణయం తీసుకోవటం. పార్లమెంటులో బడ్జెట్‌ తుది ఆమోదం పొందకముందే ఈ ఎక్సర్‌సైజ్‌ పూర్తవుతుంది. ఈ విధానాన్ని మూడు దశల్లో అమలు చేశారు.
18.
ఎన్‌డి తివారీ(1988-89)
ఎన్‌డి తివారీ రాజీవ్‌ కేబినెట్‌లో 1988-89 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.
19
మధు దండవతే(1990-91)
1989 నవంబర్‌లో సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడింది. దీనికి నాయకత్వం జనతాదళ్‌  వహించింది. విపిసింగ్‌ ప్రధాని అయ్యారు. మధు దండవతే ఆర్థిక మంత్రిగా 1990-91 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

20
యశ్వంత్‌ సిన్హా(1991-92)(1998-2002)
కేంద్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యశ్వంత్‌సిన్హా ఆర్థిక మంత్రి అయ్యారు. 1991-92ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1998లో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 1998లో ఆర్థిక మంత్రిత్వ శాఖ చేపట్టారు. 1998లో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన యశ్వంత్‌ ఆ తరువాత 2002-03 వరకు వరుసగా బడ్జెట్లను ప్రవేశపెట్టారు. బ్రిటిష్‌ కాలం నుంచి సాయంత్రం అయిదు గంటలకు బడ్జెట్‌లను ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని మార్చారు. మధ్యాహ్నం 12 గంటలకే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎక్సైజ్‌ డ్యూటీలను రేషనలైజ్‌ చేయటంపై యశ్వంత్‌ సిన్హా ప్రత్యేక దృష్టి పెట్టారు. దిగుమతులను మరింత సరళీకృతం చేశారు.

21.
మన్మోహన్‌ సింగ్‌ (1991-96)
రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌గా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌ 1991లో ప్రధానమంత్రి పదవిని పివి నరసింహరావు చేపట్టిన తరువాత ఆర్థిక మంత్రి బాధ్యతలను చేపట్టారు. 1991-92 సంవత్సరానికి ఫైనల్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్‌ను ఒక ఆర్థిక మంత్రి, పూర్తి స్థాయి బడ్జెట్‌ను మరో మంత్రి ఇద్దరు కూడా వేర్వేరు పార్టీలకు చెందిన వారు ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. పివి నరసింహరావు, మన్మోహన్‌సింగ్‌ల నేతృత్వంలో ఆర్థిక సంస్కరణల పర్వం మొదలు కావటంతో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావటం ప్రారంభమైంది. సంక్షోభంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ వీరి హయాంలో మళ్లీ నిలదొక్కుకుంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో కుదువబెట్టిన బంగారం రిజర్వులను ఈ ఇద్దరే విడిపించారు. ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్‌ ఆద్యుడు. దిగుమతి సుంకాన్ని 300 శాతం నుంచి 50 శాతానికి తగ్గించారు. కరంట్‌ అకౌంట్‌లో రూపీ కన్వర్టబిలిటీని రెండు దశల్లోనే జరిగేట్లు చేసిన ఘనత కూడా మన్మోహన్‌దే. ఆ తరువాత దేశంలో  పూర్తికాలం ప్రధానమంత్రిగా పనిచేసి, రెండో దఫా కూడా ప్రదానమంత్రిగా ఎన్నికైన ఘనతను సాధించారు.

22.
జస్వంత్‌సింగ్‌( 1996)(2002-04)
అటల్‌ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో తొలిసారి ఆర్థిక మంత్రిగా జస్వంత్‌సింగ్‌ 17 రోజులు మాత్రమే పనిచేశారు. 2002లో  రెండోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మార్కెట్‌ అనుకూల ఆర్థిక సంస్కరణలను జస్వంత్‌సింగ్‌ అమలు చేశారు..
23
పి.చిదంబరం(1996-1998)(2004-2008)
1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి చిదంబరం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అప్పుడు ఆయన తమిళ మానిలా కాంగ్రెస్‌లో సభ్యుడు. 1997-98లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అసలు చర్చ జరక్కుండానే ఆమోదం పొందింది. మళ్లీ 2004లో మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలో యుపిఎ సర్కారు ఏర్పడ్డ తరువాత చిదంబరం తిరిగి ఆర్థిక మంత్రిగా ఎన్నికయ్యారు. నాలుగు సంవత్సరాల పాటు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. మన్మోహన్‌, మాంటెక్‌ సింగ్‌ ఆహ్లువాలియా, చిందబరంలను ఆర్థిక వేత్తల త్రయంగా పిలుస్తారు.
24.
ప్రణబ్‌ ముఖర్జీ..
2009 ఎన్నికల తరువాత ప్రణబ్‌ ముఖర్జీ  ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  ప్రస్తుత లోక్‌సభలో ప్రణబ్‌ది ఇది నాలుగో బడ్జెట్‌.

కామెంట్‌లు లేవు: