14, మే 2011, శనివారం

రాబోయే ఎన్నికలకు ఫేస్ ఆఫ్ ఫ్యూచర్‌

కాంగ్రెస్ మళ్లీ ఫుల్లుగా చార్జింగ్‌లోకి వచ్చింది. రాష్ట్రంలో ఫలితాల మాటెలా ఉన్నా.. అయిదు రాష్ట్రాల ఎన్నికలు జాతీయ  పార్టీగా కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పెద్దగా లబ్ది పొందకపోయినా.. పరోక్షంగా మాత్రం కాంగ్రెస్‌కే  జాతీయ సమీకరణాల్లో మేలు జరిగే అవకాశాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి.   
అయిదు రాష్ట్రాల ఎన్నికలు.. జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా కొత్త సమీకరణాలకు నాంది పలికాయి. బెంగాల్‌లో లెఫ్ట్ ఓటమి ప్రభావం సంకీర్ణ రాజకీయాల్లో కొత్త ముఖచిత్రాన్ని ఆవిష్కరించనున్నాయి. తొంభయ్యో దశకం చివరి నుంచి సంకీర్ణ రాజకీయాల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన వామపక్షాలకు ఇప్పుడు ఉనికే లేకుండా పోయింది. వామపక్షాల నేతృత్వంలో గతంలో ఏర్పాటైన మూడో ఫ్రంట్‌లో భాగస్వాములైన పార్టీలన్నీ ఒక్కటొక్కటిగా అధికారం కోల్పోతూ వచ్చాయి. తెలుగుదేశం, జెడిఎస్, ఆర్‌జెడి, ఆర్‌ఎల్‌డి, హెచ్‌ఎల్‌డి, అసోం గణపరిషత్ ఇలా ఒక్కొక్కటీ ప్రాభవాన్ని కోల్పోయినవే. అసలు ఫ్రంట్ ఏర్పాటులో ప్రధాన భూమిక నిర్వహించిన లెఫ్ట్ ఫ్రంట్ పరిస్థితీ ప్రాంతీయ పార్టీల స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు అన్ని ప్రాంతీయ పార్టీలూ దేశంలో  బిజెపి వైపో.. కాంగ్రెస్ వైపో వెళ్లక తప్పని పరిస్థితి.. సమీప భవిష్యత్తులో మరో ఫ్రంట్ ఏర్పాటు ఇక కష్టమే.
బెంగాల్‌లో మమతా బెనర్జీ సొంతంగా అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పే అవకాశం కానీ, అవసరం కానీ ఆమెకు ఉండదు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒకవేళ సొంతంగా పోటీ చేసినా, ఫలితాల తరువాత యుపిఎకే మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది.
తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకెలు రెండూ అవకాశవాద పార్టీలే.. కేంద్రంలో ఏ కూటమి అధికారంలో ఉంటే దానికి మద్దతిచ్చేసి మంత్రి పదవులు పుచ్చేసుకుంటాయి. డిఎంకెకు అధికారం పోవటంతో పాటు 2జి స్పెక్ట్రమ్ ఉచ్చు పూర్తిగా బిగుసుకుపోయింది. రాజా ఇప్పటికే జైల్లో ఉన్నారు. కణిమొజి జైలుకు వెళ్లబోతున్నారు. ఈ పరిస్థితుల్లో యుపిఎతో డిఎంకె దోస్తీ కొనసాగుతుందన్నది అనుమానమే. డిఎంకెకు లోక్‌సభలో 18 స్థానాలు ఉన్నాయి. డిఎంకె మద్దతు ఉపసంహరించినా అన్నాడిఎంకె ఆ లోటును తన తొమ్మిది సీట్లతో భర్తీ చేస్తుంది. మరో 22 సీట్లతో సమాజ్‌వాది పార్టీ యుపిఎకు మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు యుపిఏకు ఢోకా లేదు.
ఈ ఎన్నికల్లో  చెప్పుకోదగింది ఏమిటంటే అయిదు రాష్ట్రాల్లో కలిపి ఎనిమిది వందలకు పైగా స్థానాల్లో ఎన్నికలు జరిగితే, జాతీయ పార్టీగా భారతీయ జనతాపార్టీ గెలుచుకున్న సీట్లు కేవలం ఆరు. డబుల్ డిజిట్ కూడా దాటకపోవటం విశేషం. బెంగాల్‌లో 1, అసోంలో అయిదు మాత్రమే గెలుచుకుంది. దీని ఫ్యూచర్ ఏమిటన్నది రాబోయే మరి కొన్ని ఎన్నికలు నిరూపించాల్సిందే.
రానున్న మూడేళ్లలో 13 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఫలితాలు రాబోయే ఎన్నికలకు, ఫేస్ ఆఫ్ ఫ్యూచర్‌గా భావించవచ్చని నిపుణుల అభిప్రాయం. తమిళనాడులో సెంటిమెంట్‌తో పాటు అవినీతి, బంధుప్రీతిపై వ్యతిరేకత స్పష్టంగానే వ్యక్తమైంది. అసోంలో తరుణ్‌గొగోయ్ అభివృద్ధి మంత్రమే పనిచేసింది. బెంగాల్ చెప్పనే అక్కర్లేదు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు ఓ మహా సామ్రాజ్యాన్నే పెకిలించివేశాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే.. అన్ని రాష్ట్రాల్లో పాలక వర్గం ప్రజలకు ఎంతో కొంత అభివృద్ధిని కళ్లముందు చూపించటం తప్పనిసరి అని అర్థమవుతోంది. ప్రజల్లో చైతన్యాన్ని సరైన పద్ధతిలో అంంచనా వేసిన పార్టీకే పగ్గాలు లభిస్తాయని ఈ ఎన్నికలు స్పష్టంగా సంకేతాల్నిచ్చాయి.

కామెంట్‌లు లేవు: