27, ఏప్రిల్ 2012, శుక్రవారం

కప్పలు కొట్టుకుంటున్నాయి


తక్కెడలో కప్పలు కొట్టుకుంటున్నాయి
ఒకదానిపై ఇంకొకటి కుట్ర చే సుకుంటున్నాయి.
అన్ని కప్పలూ ఒక్కసారే తక్కెడలోకి చేరినవే..
ఒక కప్ప మాట మరో కప్పకు సరిపడదు..
సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌లో ఉండేందుకే
అన్ని కప్పల ప్రయత్నం..
అన్నింటిపై ఆధిపత్యం కోసమే తాపత్రయం..
ఈ కొట్లాటల్లో  ఈ కప్పల తక్కెడ చిల్లుపడిపోయింది
తక్కెడ ముక్కలు ముక్కలవుతోంది..
అది ముక్కలైతే.. ఏ కప్పకూ నిలువ నీడ ఉండదు..
ఇప్పుడు తక్కెడను కాపాడటం ఎలా?
ఇంతకీ ఆ తక్కెడ ఏమిటో తెలుసా?
మన రాష్ట్ర కాంగ్రెస్‌....
ఈ కప్పలన్నీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు
ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవటం
నివేదికలిచ్చుకోవటం..
ఏసిబి విచారణలు జరిపించుకోవటం..
వెరసి కాంగ్రెస్‌ పరిస్థితి రాష్ట్రంలో గందరగోళానికి దారి తీసింది..
రాష్ట్రంలో ఏం జరుగుతోందో అధిష్ఠానానికి అంతుపట్టటం లేదు
ఒకరి తరువాత మరొక దూత వస్తున్నారు..
మంతనాలు జరుపుతున్నారు...
రిపోర్టుల మీద రిపోర్టులు సమర్పించుకుంటున్నారు..
కనీ వినీ ఎరుగని సంక్షోభం..
పార్టీ అస్తిత్వానికే ప్రమాదకరమైన పరిస్థితిలో కాంగ్రెస్‌
కర్ర విరగొద్దు.. పాము చావొద్దు...
పార్టీ నిలబడాలి.. ఏం చేయాలి?
ఎలా కాపాడుకోవాలి..?
నేతల మధ్య సమన్వయం సాధ్యమేనా?
జగన్‌ను, తెలంగాణాను సమన్వయం చేయటం కుదిరేపనేనా?
కాంగ్రెస్‌ రెంటికి చెడ్డ రేవడి అవుతుందా?
రెంటినీ బ్యాలెన్స్‌ చేస్తుందా?

ఒక శిశువు వయసు ఎంత?

ఒక పువ్వు వయస్సు కనీసం ఆరు గంటలు.. ఒక ఆకు వయస్సు రెండు మూడు రోజులు.. ఒక కాయ వయస్సు అది పండేంత వరకే.. ఆ పండు వయసు.. రాలి పడిపోయేంత వరకు..... మరి ఓ శిశువు వయసు ఎంత? అదేంటని ఆశ్చర్యపోవద్దు.. మన రాష్ట్రంలో ఇప్పుడు అన్ని చోట్లా వినిపిస్తున్న ప్రశ్న ఇది.. ఒక శిశువు వయసు ఎంత? రోజులా? వారాలా? నెలలా? అవును మన రాష్ట్రంలో  పుట్టిన శిశువుల్లో చాలా వరకు వ్యక్తులుగా ఎదగటం లేదు.. పరిపూర్ణంగా జీవితాన్ని పొందటం లేదు.. పొత్తిళ్లలోనే జీవితాలు అంతమవుతున్నాయి.. పుట్టినందుకు సంతోషించేంతలోగానే మట్టితో మమేకమైపోతున్నారు.. తామెందుకు పుట్టారో.. ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని జీవితాలు.. ఏటా ౮౦వేలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి..    .
ఎందుకు ఇలా అమ్మతనం చిన్నబోతోంది.. నవ మాసాలు మోసి.. ప్రేమగా కన్న కడుపు క్షోభిస్తోంది. తల్లి కడుపులో పెరుగుతున్నప్పుడు బయటి నుంచి అప్పుడప్పుడూ వినిపించే ధ్వనులు వినే శిశువు ఎన్నో కలలు కంటుంది.. ఆ కలలన్నీ సాకారం చేసుకునేందుకు ఎప్పుడెప్పుడు తల్లి గర్భం నుంచి బయటపడదామా అని ఆలోచిస్తుందిట.. కానీ, తొమ్మిది నెలల తరువాత.. భూమి స్పర్శ తొలిసారి తగిలినంతనే ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది.. ఆ శిశువు కన్న కలలు ఊహకు కూడా తెలియకుండానే ఆవిరైపోతున్నాయి.
メメメ

వింటే ఆశ్చర్యం వేస్తుంది.. అస్సలు నమ్మబుద్ది కాదు.. కానీ, ఇది నిప్పులాంటి నిజం.. కాకపోతే ఇంతకాలం దీనిపై నివురు కప్పేశారు.. మనకు తెలిసినంత వరకు కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో  వేలకు వేలు పోసి పురుడు పోసుకుంటున్న పిల్లలే పిల్లలు.. కానీ, కాణీ ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో .. పుడుతున్న శిశువుల గురించి మనకు పెద్దగా అవగాహన లేదు. ఉండదు కూడా.. ఎప్పుడో టీవీల్లో వార్తలు వచ్చినప్పుడో.. ఏదైనా గొడవ జరిగినప్పుడు మాత్రమే కాసేపు ప్రభుత్వ ఆసుపత్రుల్ని తిట్టుకుని ఆ మరుక్షణం మరచిపోతాం.. కానీ చాలా మందికి తెలియంది.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుతున్న డెలివరీలు ప్రెユవేటు ఆసుపత్రుల కంటే రెట్టింపు ఎక్కువన్న సంగతి..

రాష్ట్రంలో ఏడాదికి 13లక్షల మంది జన్మిస్తున్నారు.. వారిలో 60 శాతం మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పుడుతున్నారు.. అదీ పేదల ఇళ్లల్లో.. పౌష్టికాహారం అంటే ఏమిటో కూడా తెలియని కుటుంబాల్లోనే ఈ పరిస్థితి నెలకొని ఉంది.
మీకు తెలుసా? ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుడుతున్న వారిలో ప్రతి వెయ్యి మందిలో 49 మంది తొలి పుట్టిన రోజు జరుపుకోకుండానే చనిపోతున్నారు.. అంటే దాదాపు ౮౦ వేల మంది శిశువుల వయస్సు సరిగ్గా ఏడాది కూడా దాటటం లేదన్నమాట. 

ఎందుకిలా జరుగుతోంది..?
పేదరికం..
చదువులేమితనం..
పేదరికంలో పుట్టడమే వాళ్లు చేసుకున్న పాపం.. గర్భం తాల్చిన యువతులకు బెడ్‌రెస్ట్‌లు తీసుకోవటం తెలియదు.. రెగ్యులర్‌గా బీపీలు.. షుగర్‌లు.. చెకప్పులు చేసుకోవటం.. రోజూ మల్టీ విటమిన్లు తీసుకోవటం అంతకంటే తెలియదు. తొమ్మిది మాసాలు వచ్చే వరకూ శ్రమించటమే వారికి తెలిసింది.. ప్రత్యేక ఆహార నియమాలు పాటించరు. నొప్పులు వచ్చిన తరువాత కానీ, ఆసుపత్రి ముఖం చూడరు. అప్పటి వరకూ పెరటి వైద్యం తప్ప ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటంపై ఎలాంటి అవగాహన లేదు. 
అందుకే వాళ్ల సంతానానికి బతికే అవకాశాలు లేకుండా పోతున్నాయి. పుట్టిన నెలల్లోనే  వేలమంది శిశువులు తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చి వెళ్తున్నారు.

メメメ

రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల విషయంలో జరుగుతున్న పెను విషాదం మాత్రమే ఇది. కానీ ఈ పరిస్థితి మన రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశం మొత్తం మీద పేదరికంలో మగ్గుతున్న సమాజం తరచూ కడుపుకోతకు గురవుతోంది. దీన్ని నియంత్రించటానికి కేంద్ర ప్రభుత్వం ఓ సూపర్‌ పరిష్కారాన్ని కనుక్కొంది.. కనుక్కొన్నదే తడవుగా సొమ్ములూ ధారాళంగా రాష్ట్రాలకు పంచేసింది. కానీ, వాటిని ఖర్చు చేసే నాధుడే లేకుండా పోయాడు.. పేదవారికి మేలు చేసే దిక్కే లేకుండా పోయింది. ఇందుకు చాలా చాలా కారణాలు ఉన్నాయి. మన సొసైటీలోనే ఉన్న పెద్ద లోపాలివి..ఈ కారణాలేంటో ఒకసారి చూడండి..
   
చిన్న వయసులో  పెళ్లి కావటం
కనీస జ్ఞానం రాకుండానే తల్లి కావటం
సరైన ఆహారం తీసుకోకపోవటం
సరైన వైద్య సదుపాయాలు లేకపోవటం
వైద్య సదుపాయాల గురించి తెలియకపోవటం
ఇద్దరు పిల్లల మధ్య వ్యత్యాసం లేకపోవటం
నిపుణుల పర్యవేక్షణ లేని కాన్పులు కావటం
తల్లి పాలు ఇవ్వటంలో విపరీతమైన జాప్యం చేయటం
శిశువుల హెల్త్‌కేర్‌ విషయంలో తీరని అశ్రద్ధ చేయటం

ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష కారణాలు చెప్పుకుంటూ పోవచ్చు. పేద సమాజంలో ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడా చైతన్యం లేని తనాన్ని ఈ శిశుమరణాలు చెప్పకనే చెప్తున్నాయి.
メメメ
వీటన్నింటినీ నియంత్రించేందుకే కేంద్రం ఓ బృహత్తరమైన పథకాన్ని ఆడంబరంగా ప్రారంభించింది.. గుర్తించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో  భారీగా మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది, నిపుణుల నియామకం చేసి, మందులను, ఉపకరణాలను అందుబాటులోకి తీసుకువచ్చి గర్భిణీస్త్రీలకు, శిశువులను కాపాడేందుకు డిసైడ్‌ అయింది. ఇందుకోసం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం అంటే జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం అన్న పేరుతో వేల కోట్ల రూపాయలను విడుదల చేసేసింది. మన రాష్ట్రానికీ ఓ 1556కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో 80 శాతం కేంద్రం భరించేట్లు.. 20శాతం రాష్ట్రం భరించేట్లు ఫిక్స్‌ చేసింది. శిశుమరణాల రేటును తగ్గించేందుకు సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
అంతా బాగున్నా మహిళల నోట్లో శని ఉన్నట్లు అయిపోయింది.. కేంద్రం కేటాయించిన  నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. స్కీములు ప్రకటించటం వరకు కాగితాలపై బాగానే ఉంటుంది. కానీ, వాటిని అమలు చేయటం దగ్గరే అసలు కథంతా ముడిపడి ఉంటుంది. కార్పోరేట్‌ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులను మంజూరు చేయటంలో తెగ తాపత్రయ పడే అధికారులు.. పేదలకు ఉపయోగపడాల్సిన నిధులను సకాలంలో ఖర్చు చేయకపోవటంలో ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఇది మొదట్నుంచీ ప్రతి పేదవాడికీ అనుభవమవుతున్నదే. ఇక శిశుమరణాలను నియంత్రించటం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా జరిగే పనేనా?

26, ఏప్రిల్ 2012, గురువారం

భారత దేశంలో అతి పెద్ద వృద్ధాశ్రమం


మన రాష్ట్రపతి భవన్‌.. భారత దేశంలో అతి పెద్ద వృద్ధాశ్రమంగా మారిపోయింది. మొఘలుల కాలంలో నిర్మించిన అతి గొప్ప భవనం.. 320 గదుల విశాలమైన ప్రాంగణం.. పౌరాణిక సినిమాల్లో చూసినట్లు వనాలు.. కుడ్యాలు.. తోరణాలతో అద్భుతంగా అలరారే రాష్ట్రపతి  భవన్‌.. వృద్ధులకు పునరావాసకేంద్రంగా మారింది.. పేరుకు మాత్రం వయోపరిమితి 35.. రాష్ట్రపతి భవన్‌లోకి ఎంటర్‌ అవుతున్న ఒరిజినల్‌ ఏజ్‌ మాత్రం మినిమమ్‌ 68. దిసీజ్‌ అవర్‌ ఇండియా...  
యంగిస్థాన్‌.. యువతే దేశానికి వెన్నెముక.. లాంటి పోచికోలు కబుర్లు చెప్పటంలో మన దేశంలో ఏ ఒక్క రాజకీయ నేతా తక్కువ కాదు.. కానీ, ఏ ఒక్కరికీ చింత చచ్చినా.. పులుపు మాత్రం చావదు.. రాజకీయాల్లో రిటైర్‌మెంట్‌ గురించి ఉపన్యాసం చెప్పే వాళ్లెవరూ తాము మాత్రం రిటైర్‌ కారు.. ఒక వేళ ఖర్మకాలి.. రోగమో.. రొచ్చో వచ్చి రిటైర్‌ కావలసి వచ్చినా.. తమ వారసులను రెడీ చేసి మరీ తప్పుకుంటారు.. సర్పంచ్‌ గిరీ నుంచి రాష్ట్రపతి పదవి దాకా కూడా ఇదే సీన్‌.. ఇదే కల్చర్‌.. ఇదే ఒరవడి.. ఇదీ మన ఇండియా... మేరా భారత్‌ మహాన్‌..
మరో రెండు నెలల్లో రాష్ట్ర పతి పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి పోటీ పడుతున్నవాళ్లు కానీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న పేర్లు కానీ, ఎంత వయసున్నవారివో తెలుసా? మినిమమ్‌ 68.. మాగ్జిమమ్‌.. 81. వీళ్లలో అందరికంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్‌ కలాం. ఒకవేళ ఈయన మళ్లీ రాష్ట్రపతి భవన్‌లోకి అడుగుపెడితే.. ఆనాటికి ఆయన వయసు ఎంతుంటుందో తెలుసా? 80 సంవత్సరాల 9 నెలల 9రోజులు.

ఇక బాగా పేర్లు వినవస్తున్న మిగతా వాళ్ల విషయాన్ని చూద్దాం..

ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీకి 75 ఏళ్లు..
ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీకి 76సంవత్సరాలు.
జమ్ముకాశ్మీర్‌ మాజీముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాకు 74ఏళ్లు
బిజెపి నేత జస్వంతసింగ్‌కూ 74 సంవత్సరాలు
ఇక సమాజ్‌వాదీ అధ్యక్షుడు ములాయంకు 72 సంవత్సరాలు
టెలీకాం సంస్కర్త సాం పిట్రోడా వయసు 70
లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ వయసు 67ఏళ్లు కాగా
ఈ పదవికి తీవ్రంగా లాబీయింగ్‌ చేసుకుంటున్న ఇన్ఫోసిస్‌ మాజీ చైర్మన్‌ ఎన్‌ఆర్‌ నారాయణమూర్తికి 65 సంవత్సరాలు..
వీళ్లు కాకుండా.. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ జెఎం లింగ్డో లాంటి వారి వయసూ 70కి పైమాటే ఉంది.. అభ్యర్థిత్వం దగ్గరకు వచ్చేసరికి అకస్మాత్తుగా పైకి వచ్చే పేర్లు కొన్నుంటాయి. వాళ్ల వయసూ తక్కువ ఉంటుందనుకుంటే పొరపాటే..
ఇప్పటి వరకు దేశానికి 15మంది రాష్ట్రపతులుగా పనిచేశారు. వీళ్లలో యూత్‌ ఎవరో తెలుసా? మవ తెలుగువాడే. వరాహగిరి వెంకటగిరి.. అలియాస్‌ వివిగిరి.. రాష్ట్రపతి అయ్యేనాటికి ఆయన వయసు జస్ట్‌ 56 సంవత్సరాల 14 రోజులు. అంతే.. ఇప్పటి వరకు రాష్ట్రపతులుగా పనిచేసిన వారి సగటు వయసు 68.73 ఉంటే ఇక రాజ్యాంగంలో35 ఏళ్ల వయోపరిమితి విధించటం వల్ల ప్రయోజనం ఏమిటి? సిల్లీ కాకపోతే..

కొత్త రాష్ట్రపతిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారు?

దేశానికి కొత్త రాష్ట్రపతిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారు? ఇప్పుడిదొక బ్రహ్మపదార్థం.. ఎవరిని సెలెక్ట్‌ చేయాలి..? వివాదాలకు దూరంగా.. మరో  రెండేళ్ల పాటు అధికారంలో ఉండేవారికి.. ఆ తరువాత మూడేళ్ల పాటు అధికారంలోకి రాబోయే వారికి ఇబ్బంది లేకుండా.. ఇబ్బందులు కలిగించకుండా ఉండే వ్యక్తి ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకూ కావాలి. ఎవరి ఈక్వేషన్స్‌ వారివి.. ఎవరి ప్రయోజనాలు వారివి.. ఎవరి లాబీయింగ్‌ వారిది.. ఒక్క మాటలో  చెప్పాలంటే.. అయిదేళ్లకోసారి ఓ కొత్త రబ్బర్‌ స్టాంప్‌ను తయారు చేసే ప్రక్రియ మరోసారి మొదలైంది..
ఒక సామాజిక వర్గం ఓట్లు రావాలంటే.. ఆ వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతి చేయాలి..
ఒక మతం విశ్వాసాన్ని సంపాదించాలంటే.. ఆ మతానికి చెందిన వ్యక్తిని ప్రథమ పౌరుని చేయాలి..
అధికారంలో ఉన్నపార్టీకి విధేయుడు కావాలి..
అధికారంలోకి వచ్చే పార్టీకీ లాయలిస్ట్‌ కావాలి..
ఇక ఇండిపెండెంట్లకేమో లాబీయింగ్‌ చేసే సత్తా కావాలి..

ఇప్పుడు రాష్ట్ర పతి పదవికి దేశంలో అమలు అవుతున్న అర్హతలు. ఇలాంటి వారి కోసం అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. నాలుగు రోజులుగా ఒక్కో పార్టీ ఒక్కో వ్యక్తి పేరును తెరమీదకు తెస్తోంది.. ఒక్కో నాయకుడు ఒక్కొక్కరి పేరు చెప్తున్నాడు. ఒకరి ప్రతిపాదన ఇంకొకరికి నచ్చటం లేదు. అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం ఏ ఒక్కరిని కాదన్నా.. కోపం వస్తుందేమోనన్న తంటా..
ఎన్‌సిపి నేత శరద్‌పవార్‌ రాజకీయేతర వ్యక్తి రాష్ట్రపతి కావాలంటున్నారు. లేకుంటే తమ పార్టీకే చెందిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ పిఎ సంగ్మా పేరును బరిలో వదిలి వచ్చారు. లాలూప్రసాద్‌కైతే ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ అయితే ఓకే.. ఎందుకంటే ఆయన ఇస్లాం కమ్యూనిటీ ఓట్‌బ్యాంక్‌ అవసరం చాలా ఉంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ తానే ఆ పదవిని అధిష్ఠించాలని కోరుకుంటున్నారు. మాయావతికి ఈ ప్రతిపాదన ససేమిరా.. ఇక జయలలితకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అయితే సరే.. ఇటు భారతీయ జనతాపార్టీకీ ఆయనంటే ఇష్టమే. కానీ కాంగ్రెస్‌కు మాత్రం కలాం కంట్లో నలుసే. తమ పార్టీ అధినేత్రి సోనియాను ప్రధానమంత్రి పదవిలోకి రాకుండా సున్నితంగా అడ్డుకోవటం ఆ పార్టీ ఇంకా మర్చిపోలేదు.
కాంగ్రెస్‌లోని కొందరు కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ జెఎం లింగ్డో పేరునూ రంగం మీదకు తీసుకువస్తున్నారు. మరికొందరికి పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ పేరు సీన్‌లోకి తీసుకొచ్చేశారు. బిజెపిలోని ఒక వర్గానికి జస్వంత్‌సింగ్‌ కావాలి. మమతా దీదీకైతే సుభాష్‌చంద్రబోస్‌ కుటుంబ వారసులను రాష్ట్రపతి చేయాలని బలంగా ఉంది. రోజుకో పేరు తెరమీదకు వస్తోంది.. ఏ ఒక్కరూ ఏ ఒక్క పేరుపైనా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయటం లేదు.
అన్ని పార్టీల కంటే కాంగ్రెస్‌కే పెద్ద తంటా.. ఇంకా అధికారంలో ఉండాల్సిన .అన్నింటికంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు పెద్ద తంటా.. ఆ పార్టీ అధికారం ఇంకా రెండేళ్లు ఉంది. ఈ లోపు రాష్ట్రపతితో ఏ సమస్యా రాకూడదు.. అదే సమస్య మిత్రపక్షాలతోనూ తలెత్తకూడదు. మాయావతిని ఒప్పుకుంటే ములాయంకు కోపం.. వామపక్షాల మాట విందామంటే మమతకు మంట.. డిఎంకెను ఔనంటే అన్నాడిఎంకేకు కాదు.. అధిష్ఠానంలో మల్లగుల్లాలు మొదలయ్యాయి.
సందట్లో సడేమియా లాగా ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి లాంటి వారు వ్యక్తిగతంగా కూడా లాబీయింగ్‌ మొదలు పెట్టారు. వీళ్లలో ఎవరు చివరి వరకు మిగులుతారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. గత ఎన్నికల సమయంలో నామినేషన్ల గడువు ముగిసే సమయానికి అకస్మాత్తుగా ప్రతిభాపాటిల్‌  సీన్‌లోకి వచ్చారు. అప్పటిదాకా ఆమె ఎవరన్నది దేశంలో చాలా మందికి తెలియదు.. ఈసారీ అలాగే జరుగుతుందా? ఏమోమరి..

24, ఏప్రిల్ 2012, మంగళవారం

మరోసారి కామ్‌రాజ్‌ ప్లాన్‌

కాంగ్రెస్‌ పార్టీలో వణుకు మొదలైంది. రాబోయే రెండేళ్లలో ఏం జరగబోతోంది? అధికారం సంగతి దేవుడెరుగు.. కనీసం పార్టీ ఉనికి ఏం కానుంది? పార్టీ రాజకీయ అస్తిత్వమే ప్రమాదంలో పడిపోతోందా? పెద్ద రాష్ట్రాలన్నీ ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.  ఏ ప్లానూ వర్కవుట్‌ కావటం లేదు.. ఏ ఎత్తుగడా పనిచేయటం లేదు. ఏం చేసినా రివర్స్‌ అవుతోంది.. ౧౩౦ సంవత్సరాల చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని తీవ్రమైన సంక్షోభాన్ని కాంగ్రెస్‌ ఎదుర్కొంటోంది.. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మరోసారి కామ్‌రాజ్‌ ప్లాన్‌ను సోనియా అమలు చేస్తున్నారు.. ఈ ప్రాతిపదికనే భారీ మార్పులకు కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టింది... ఇదైనా పార్టీని గట్టెక్కిస్తుందా?

రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత  పెద్ద రాష్ట్రాలన్నీ కాంగెస్‌ చేజారిపోయాయి. యుపిలో ఘోరమైన పరాజయాన్నే మూటగట్టుకోవలసి వచ్చింది. అధినేత్రి సొంత నియోజక వర్గంలోనే ఒక్క సీటు కూడా గెలుచుకోలేని స్థితి.. బెంగాల్‌లో  మిత్రపక్షమే అయినా మమతాదీదీ గొడవ గొడవగానే ఉంది.. రాజస్థాన్‌లో గెలిచే పరిస్థితి లేదు. ఢిల్లీలో మొన్నటి లోకల్‌ బాడీ ఎన్నికల్లోనే ఢామ్మంది.. బీహార్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ ఇలా ఏ ఒక్క రాష్ట్రంలోనూ పరిస్థితి బాగా లేదు. మహారాష్ట్రలో మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేదు. ఇక దక్షిణాదిలో ఒకే ఒక్క ఆశ ఉన్న  ఆంధ్రప్రదేశ్‌పై పూర్తిగా నమ్మకం వదులుకోవలసిన దుస్థితి.. ఇప్పుడేం చేయాలి?.. కుంభకోణాలు... ఆర్థిక అస్తవ్యస్తం.. అవినీతి.. అసమర్థత...  కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా కాంగ్రెస్‌ను ముప్పిరిగొంటున్న సమస్యలు ౧౩౦ ఏళ్ల కాంగ్రెస్‌ను కనీవినీ ఎరుగని అయోమయంలోకి నెట్టేసాయి.. ఏ ఒక్క విషయంపైనైనా  స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి పార్టీ మనుగడనే ప్రమాదంలోకి నెట్టేసింది..
ఇందుకు ఉదాహరణ తెలంగాణాయే.. ఒక అంశంపై దూకుడుగా నిర్ణయం తీసుకోలేక నాన్చుతూ ఉండటం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ౨౦౧౪ మాత్రమే కాదు.. సమీప భవిష్యత్తు కూడా లేకుండా చేస్తోంది. వ్యూహకర్తలు ఏ ఒక్క అంశంలోనూ సక్సెస్‌ రేట్‌ సాధించలేకపోతున్నారు.. ట్రబుల్‌షూటర్స్‌ అనుకున్న మహామహులే హ్యాండ్స్‌ అప్‌ చేసేశారు.
అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే కాంగ్రెస్‌ కూడా ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా పార్టీ పరిస్థితి గురించి నిర్వహించిన సర్వేలు కూడా ఊహించని స్థాయిలో ప్రతికూలంగా రావటంతో ఇక అట్టడుగునుంచి ప్రక్షాళన చేయాల్సిన తప్పనిసరి అవసరం అధినేత్రికి ఏర్పడింది. ఇప్పుడు ఆమె ముందున్నది ఒకే ఒక్క ప్రత్యామ్నాయం కామ్‌రాజ్‌ప్లాన్‌.. ౧౯౬౩లో కాంగ్రెస్‌ ప్రజాదరణను కాపాడుకోవటానికి సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కామ్‌రాజ్‌ నాడార్‌ అమలుచేసిన ప్లాన్‌ ఇది. కేబినెట్‌లోని సీనియర్‌ మంత్రులంతా రాజీనామా చేసి.. పార్టీ పదవులు తీసుకుని, పార్టీ పటిష్ఠత కోసం పూర్తికాలం పనిచేయటం ఈ ప్లాన్‌ ఉద్దేశం.. ఈ ప్లాన్‌తో కామ్‌రాజ్‌  ది గ్రేట్‌ ట్రబుల్‌షూటర్‌గా కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు అదే ప్లాన్‌ను సోనియా అమలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే సీనియర్‌ మంత్రులు జైరాం రమేశ్‌, వాయలార్‌ రవి, గులాంనబీ ఆజాద్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌లు నలుగురూ తమను మంత్రి పదవుల నుంచి తప్పించాలంటూ సోనియాకు లేఖ రాశారు. వీరిలో జైరామ్‌ రమేశ్‌, గులాంనబీ ఆజాద్‌లు ఇద్దరూ మన రాష్ట్ర పార్టీ వ్యవహారాలతో సంబంధం ఉన్నవారే. గత మూడేళ్లలో తెలంగాణ అంశాన్ని సమర్థంగా డీల్‌ చేయటంలో ఆజాద్‌ పూర్తిగా ఫెయిలయ్యారనే అధిష్ఠానం భావిస్తోంది. అందుకే ఆయనకు ప్రత్యామ్నాయంగా వాయలార్‌ రవిని పంపించారు. ఈ అంశానికి పరిష్కారం చూపకపోవటం రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అగమ్యగోచరంలోకి నెట్టేసింది. ఇక సల్మాన్‌ఖుర్షీద్‌ కీలకమైన యుపి నేత. యుపిలో వైఫల్యానికి రాహుల్‌గాంధీని వెనక్కి నెట్టేసి బాధ్యతంతా తనమీద వేసుకోవలసి వచ్చింది. ఇప్పుడు వీరి బాటలో మరికొందరు సీనియర్‌ మంత్రులు కూడా రాజీనామా బాటలో ఉన్నట్లు సమాచారం. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో కూడా భారీస్థాయిలో ప్రక్షాళన కార్యక్రమం జరుగుతోంది. ౧౯౬౩లో ఈ కామ్‌రాజ్‌  ప్లాన్‌ బాగా సక్సెస్‌ అయింది. కానీ, ఇప్పుడు సాధ్యమేనా?  ఆజాద్‌ లాంటి వారు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిలుగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు.. ఇప్పుడు ఫుల్‌టైమ్‌ వర్కర్లుగా  పార్టీని బతికించగలరా?