12, మే 2010, బుధవారం

మండుతున్న నేల

నేల మండిపోతోంది.. కనీవినీ ఎరుగని పరిస్థితి.. అడుగు వేస్తే నిప్పుకణికలపైన వేస్తున్నాం.. ముఖ్యంగా రాష్ట్రంలోని నాలుగు మెట్రో నగరాల్లో జనం వెతలు చెప్పనలవి కాదు... ఆఫీసుకు వెళ్లాలంటే దడ పుట్టేంత పరిస్థితి...
సూర్యుడు కాల్చి పారేస్తున్నాడు.. రాష్ట్రంలోని నాలుగు మెట్రో నగరాలు నిప్పుల కొలుములుగా మారిపోయాయి.. ఉదయం ఏడు గంటలు కాకముందే ఎండ మంట మొదలైపోతోంది.. రాత్రి పది గంటలయినా రహదారులపై వేడి సెగలు తగ్గటం లేదంటే వేసవి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

విశాఖపట్నంలో ౩౯ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ, ఉక్కబోత బీభత్సంగా జనాన్ని ఉడికిస్తోంది.. సముద్ర తీరంలో వేసవి కొంత చల్లదనాన్ని ఇస్తుందని వచ్చిన వారికి నిరాశే ఎదురవుతోంది..

విజయవాడ బ్లేజువాడగా మారిపోయింది.. మండుతున్న కొలిమిలో బతుకుతున్నామా అన్న పరిస్థితిలో జనం ఉన్నారు.. గత యాభై ఏళ్లలో చూడని ఎండలు ఈసారి చూస్తున్నామని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు.. ఒక పక్కన కృష్ణమ్మ... మరో పక్కన కొండలు.. మధ్యలో విజయవాడ ఎండ వేడితో అల్లాడిపోతోంది..

ఇక రాజధాని సంగతి చెప్పనే అక్కర్లేదు.. కాంక్రీటు గోడలు.. కంప్యూటర్లు.. వాహనాల పొగలు..రొదల మధ్యనే ఇక్కడి ప్రజల జీవితాలు...ఎండ వేడిని తట్టుకోవటానికి మధ్యాహ్నం షిఫ్ట్‌ అయినా ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది..మళ్లీ రాత్రి పొద్దు పోయిన తరువాత కానీ, ఆఫీసు నుంచి బయటపడటం లేదు.. సూర్యుడి ప్రతాపానికి ఇదే నిదర్శనం.. రుతుపవనాలు త్వరగానే వస్తాయని వాతావరణ వేత్తలు ఎంతగా చెప్తున్నా, ఈ నెలాఖరు దాకా ఈ నేల చల్లబడే అవకాశాలు కనిపించటం లేదు...

కామెంట్‌లు లేవు: