27, జులై 2011, బుధవారం

మీకు మీరే మాకు మేమే.....

మీకు మీరే మాకు మేమే.....ఇదీ ఇప్పుడు సీమ,ఆంధ్ర నేతల్లో వినిపిస్తోన్న కొత్త స్వరం....సీమాంధ్ర నేతల్లో సమైక్యవాద ఉధృతిని తగ్గించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం వేసిన తొలి అడుగులో భాగమే ఈ కొత్త స్వరం...
ఇంతకాలం ఒకే ప్రతినిధి బృందంగా సీమాంధ్ర అభిప్రాయాలు విన్న హైకమాండ్... ఇప్పుడు ఆరెండు ప్రాంతాల నేతలతో విడివిడిగా చర్చించడానికి రంగం సిద్దం చేస్తోంది....పీసీసీ చీఫ్ సత్తిబాబు ఆపనిలో బిజీబిజీగా ఉన్నారు..
రాష్ట్రాన్ని కలిపి ఉంచినా,విభజించినా తనకొచ్చే రాజకీయ ప్రయోజనాలపైనే కాంగ్రెస్ పార్టీ ప్రదానంగా దృష్టి సారించింది.తెలంగాణ ఇస్తే లాభ నష్టాలను ఇప్పటికే తెలంగాణ నేతలతో చర్చించిన ఆజాద్‌ ఇక సీమాంధ్ర నాయకులతో చర్చలపై దృష్టిపెట్టారు.

 సీమాంద్ర నేతలు ఓ బృందంగా రావడం వల్ల ఆ రెండు ప్రాంతాల్లో విభజన కోరుకుంటున్న వారి వాదనకు అవకాశముండడం లేదన్న అభిప్రాయానికి వచ్చిన ఆయన.... సీమ,ఆంధ్రా ల నుంచి వేర్వేరు బృందాలను చర్చలకు ఆహ్వానించారు.  ఇదే అంశంపై బొత్స రాయలసీమ కు చెందిన శైలజానాధ్‌,కోస్తా నేత కావూరిలతో కసరత్తు జరిపి విడివిడిగా వెళ్లేందుకు ఒప్పించారు. దీంతో సమైక్యవాదం పలుచబడేందుకు మార్గం ఏర్పడిందనే వాదన కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది. కొందరి మెప్పుకోసం పెదవుల పైనే సమైక్యరాగం వినిపిస్తున్న నేతలు ....వేర్వేరుగా ఢిల్లీ వెళితే నిజంగా మనసులో ఏముందో తెలిసే అవకాశం కూడా ఢిల్లీకి కలుగనుంది. మంత్రులు టీజీ వెంకటేష్,ఏరాసు ప్రతాప రెడ్డి ఇప్పటికే గ్రేటర్‌ రాయలసీమ వాదన వినిపిస్తుండగా .. బొత్స తో భేటీ తర్వాత మరో మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి కూడా అదే వైఖరిని చాటారు. తెలంగాణ రాష్ట్రానికి మొగ్గు చూపినా.. భవిష్యత్‌లో సీమాంధ్ర ఒక్క రాష్ట్రంగా ఉండలేదన్న భావన చాలా మంది కాంగ్రెస్ నేతల్లో ఉంది.అందుకే ఒకే సారి మూడు రాష్ట్రాల ఏర్పాటు సూత్రం కాంగ్రెస్ లో తెరపైకి వస్తోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన చంద్రబాబు,జగన్‌ లకు చెక్‌ పెట్టాలంటే త్రీ స్టేట్స్‌ థియరీయే కరెక్ట్‌ అని కొందరు పాలక పక్ష నేతలు కూడా భావిస్తున్నారు.ఈ వాదనకు బొత్స ఆశీస్సులు కూడా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సత్తిబాబు పిసిసి చీఫ్ గా ఉండడంతో అధిష్టానానికి సమైక్య వాదుల్లో చీలిక తేవడం తేలిక అనే అభిప్రాయం వినిపిస్తోంది.ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీమాంద్ర నేతల బృందంలో తన ప్రాంతానికి చెందిన నేతలు పాల్గొనకుండా బొత్స గట్టిగా ప్రయత్నించారన్న వాదనలు జోరుగానే వినిపించాయి...
 అంతేకాదు ..భవిష్యత్‌ లో అవసరమైతే జై ఆంధ్రా వాదన వినిపించేందుకు తన వెంట వచ్చే నేతల చిట్టాను కూడా ఆయన సిద్దం చేసుకుంటున్నారని కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దగ్గుబాటి లాంటి నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే గట్టిగా సమైక్యవాదాన్ని వినిపించే నేతల సంఖ్యను వీలైనంత తగ్గించాలనే హై కమాండ్ యత్నాలకు బొత్స తనవంతు సహకరిస్తున్నారు.
తెలంగాణ పై హై కమాండ్ తమను అవమానిస్తోందన్న అభిప్రాయంతో ఉన్న టీ కాంగ్రెస్ నేతలకు తాజా పరిణామాలు కొంతలో కొంత ఉపశమనివ్వక మానవు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

అలా అనుకునే ఆనందించండి.