6, మే 2009, బుధవారం

స్తంభించిన పరిపాలన - విహార యాత్రల్లో నేతలు

రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది. ఎన్నికలు పూర్తయిన వెంటనే తరువాత అధికారం తమదేనని అధికారపక్షం, ప్రతిపక్షాలు ఊహాలోకాల్లో విహరిస్తూ ప్రజల బాగోగులను పట్టించుకోవటం మానేశాయి. పరిపాలన సజావుగా సాగించాల్సిన పాలక వర్గం, అధికార యంత్రాంగం తమ బాధ్యతను పక్కనపెట్టాయి. ముఖ్యమంత్రి సిమ్లాలో సేదతీరటానికి విహారయాత్రకు వెళ్లారు... మంత్రులు తమ తమ స్థాయిల్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు... ఇక అధికార యంత్రాంగం పరిస్థితి సరే సరి....స్రజలకు కావలసిన మౌలిక అంశాల విషయంలో ఎవరికీ పట్టింపు లేదు....ప్రతి పక్ష నేత చంద్రబాబు విదేశాల్లో ఆరామ్‌గా ఉన్నారు.. అక్కడి నుంచే పార్టీనీ, రాషా్టన్న్రి గమనిస్తున్నారు... రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల పట్ల ఆవేదననూ అక్కడి నుంచే వ్యక్తం చేస్తున్నారు..కరెంటు కోత దారుణంగా పెరిగిపోయింది. రాష్ట్ర మంతటా నిప్పుల కుంపటిలా మండిపోతుంటే గంటల తరబడి కరెంటు కోత ప్రజలను అల్లలాడిస్తోంది. తాగునీరు సరిగా రాక, మురికినీళు్ల కాలువల్లోంచి ఉప్పొంగిపోయి, నల్లా నీళ్లల్లో కలిసిపోతున్నాయి. దీని పర్యవసానం అంటువ్యాధులు ప్రబలటం... రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని భోలక్‌పూర్‌ ప్రాంతంలో డయేరియా ప్రబలి నలుగురు చనిపోయారు... వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. గాంధీ ఆసుపత్రి అంతా రోగులతో నిండిపోయింది. చేతులు కాలాక చేసేదేమీ లేకపోయినా, రాజకీయ నాయకుల పరామర్శలు... ప్రజల నిరసనలు యథావిధిగా జరిగిపోయాయి.....ఓ వైపు ప్రచండ భానుప్రతాపం పంటపొలాలను సైతం ఎండగడుతోంది. పొలాలకు సాగునీరు అందించటంలో అధికార యంత్రాంగం ప్రదర్శించిన అలసత్వానికి దాదాపు రెండు వందల ఎకరాల్లో పంట నాశనమైపోయింది. నీళ్లివ్వమని అడిగితే పలికే నాథుడే ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించటం లేదు. ఇక గిట్టుబాటు ధర ఎలాగూ రాదనుకున్న రైతులు 30 ఎకరాల్లో తమ పంటను తామే తగులబెట్టుకున్నారు... నిత్యావసర వస్తువుల ధరలు సైతం అనూహ్యంగా పెరిగిపోయాయి. బియ్యం ధర 35 రూపాయలకు చేరుకుంది. చెక్కెర, నూనె, ఇతర వస్తువులన్నింటి ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. అక్రమార్కుల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. వీళ్లను నియంత్రించే బాధ్యత ఉన్న మంత్రులు ఎన్నికలు అయిపోయాయని ఆరామ్‌ తీసుకుంటున్నారు....అక్రమార్కుల భరతం పడతామని మాత్రం ఆర్థిక మంత్రి రోశయ్య అప్పుడప్పుడూ మీడియాలో ప్రకటిస్తున్నారు...ముఖ్యమంత్రి వైఎస్‌ సిమ్లాలో విశ్రాంతి తీసుకుంటున్నారు.. మున్సిపల్‌ మంత్రి కోనేరు రంగారావు తనకు టికెట్‌ ఇవ్వలేదు కాబట్టి ఎలాగూ తనకు తిరిగి మంత్రి అయ్యే చాన్‌‌స లేదు కాబట్టి ముందే మంత్రిపదవి పగ్గాలు వదిలేసినట్టున్నారు....ఇక మిగిలిన మంత్రుల పరిస్థితీ అంతే....అంతా జరిగాక ముఖ్యమంత్రి సిమ్లా నుంచి సమీక్షా సమావేశాలు.. మంత్రులకు, అధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు..వెంటనే నివేదికలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు...అధికారులూ పొలోమంటూ అంటురోగాలు ప్రబలిన ప్రాంతాల్లో చెకప్‌ల కోసం పర్యటనలూ ప్రారంభించారు... ముందే జాగ్రత్త పడి ఉంటే ఆ నాలుగు ప్రాణాలు కూడా కాపాడగలిగే వారు.. కానీ, మన వాళ్లకు ఏదో జరిగిన తరువాత కానీ, చలించే తత్త్వం లేదు.. ఇక పరిపాలన మాత్రం ఏం చక్కగా సాగుతుంది?మన నాయకులకు ఫలితాల తరువాత తాము చేపట్టబోయే అధికారం గురించిన యావ తప్ప, ప్రజలు ప్రస్తుతం పడుతున్న బాధల గురించిన పట్టింపు లేదు.. ఇప్పుడే వీరు ఇట్లా ఉంటే రేపు ఫలితాల తరువాత ఎలా ఉంటారో ఊహించనవసరం లేదు...

కామెంట్‌లు లేవు: