8, అక్టోబర్ 2009, గురువారం

ఆపదలో ఆపన్న హస్తం - జై జవాన్

ఉక్కునరాలు.. ఇనుప కండరాలు.. కఠోరమైన సంకల్పం కలిగిన పది మంది యువకులు నా వెంట వస్తే... భారత దేశం రూపు రేఖలనే మార్చేస్తానన్నాడట స్వామి వివేకానంద...ఇవాళ మన సైన్యానికి ఆ యువశక్తే ఊపిరి...... అదే కఠిన సంకల్పం ఆర్మీకి తిరుగులేని బలం..... సరిహద్దుల్లో శత్రు మూకల నుంచి దేశాన్ని రక్షించటంతో పాటు... అంతర్గతంగా ఆపదలు కము్మకున్నప్పుడు ఆ జవానులే ఆపన్న హస్తం అందిస్తున్నారు... అన్ని విధాలా ఆదుకుంటున్నారు... కర్నూలు జిల్లాను అతలాకుతలం చేసిన వరదల్లో చిక్కుకుపోయిన అభాగ్యుల పాలిట వైమానిక దళ జవానులే దేవుళ్లె నిలిచారు...

దేశ ప్రజల రక్షణ వారి ప్రాథమిక బాధ్యత... ఆపద ఏ రూపంలో వచ్చినా మేమున్నామంటూ క్షణాల్లో వచ్చి చేయూతనందివ్వటం వారికన్నా ముందుండేవారు లేరు... వాతావరణం అనుకూలించినా, అనుకూలించకపోయినా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ప్రమాదాలకు వెరవక... జడివానకు జడవక వరదల్లో చిక్కుకున్న ఆర్తులను ఆదుకోవటంలో భారత వైమానిక దళ జవానుల పాత్ర కీలకంగా మారింది... ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటమనే ఒకే ఒక సంకల్పంతో వారు ముందుకు కదిలారు.. సోదరభారతీయుల ప్రాణాలను కాపాడుకున్నారు...

ఈ నెల రెండో తేదీ కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చీకటి రోజు.. కన్నీరు మిగిల్చిన రోజు... కష్ణ, తుంగభద్ర, హంద్రీ, కుందు నదుల ఉగ్ర వరదలకు వందలాది గ్రామాలు జలసమాధి అయ్యాయి. కొద్ది గంటల వ్యవధిలోనే రహదారులు ఏరులుగా మారాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది... కరెంటు లేదు.. కము్యనికేషన్‌ లేదు.. లక్షల మంది ప్రజలు నీళ్లలో మొకాళ్లకు పైగా లోతులో చిక్కుకుపోయారు.. ఏం చేయాలో.. ఎలా బయట పడాలో.. తెలియక బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి.. ఆదుకొమ్మన్న అర్తనాదాలను వినేవారే లేరు.. ఊరు ఊరంతా నీట మునిగితే బయటి నుంచి వచ్చే వారు లేక.. లోపలి నుంచి కాపాడే వారు లేక కర్నూలు కల్లోలమైంది.
ప్రజలను కాపాడటానికి మిగిలింది ఒకే ఒక్క మార్గం ఆకాశం... ఆ సమయంలో రంగంలోకి దిగింది భారత వైమానిక దళం.. హెలికాప్టర్లు దిగేందుకు సరైన వాతావరణం లేదు..నేలంతా నీటితో నిండిపోయింది. హెలీపాడ్‌లు ఏర్పాటు చేసే అవకాశమూ లేదు.. 35 మంది సభ్యులున్న వైమానిక దళం ఏడు హెలికాప్టర్లలో బయలు దేరారు.. మహబూబ్‌ నగర్‌, కర్నూలు జిల్లాల పరిధిలో నీటిలో చిక్కుకుపోయిన దాదాపు 42 మందిని సురక్షితంగా కాపాడారు..
రెండు జిల్లాలను వరదలు ముంచెత్తిన రెండో తేది నుంచి విరామం లేకుండా వైమానిక దళ జవానులు విధులు నిర్వర్తిస్తున్నారు.. రాత్రి లేదు.. పగలు లేదు.. విరామం లేదు.. విసుగు లేదు.. సమన్వయంతో...సహదయతతో తోటి ప్రజలను కాపాడటంలో వైమానిక దళ సభ్యులు తమ సేవలందించారు.. తిండి లేక అవస్థలు పడుతున్న ప్రజలకు ఆహారం అందించారు.. మందులు అందించారు.. మంచినీటిని అందించారు..
తమ తోటి పౌరులకు సహాయం అందించటంలో సైనికులు అనుభవిస్తున్న తప్తి వాళ్లలో అలసటను మరిపిస్తున్నది... జనం కోసం జనమేజయంగా సేవలందిస్తున్న జవానులను ప్రశంసించేందుకు మాటలేముంటాయి.. జై జవాన్‌ అని నినదించటం తప్ప....

కామెంట్‌లు లేవు: