16, ఆగస్టు 2009, ఆదివారం

బాద్షా బద్‌నామ్‌


బాలీవుడ్‌ బాద్షా షారూఖ్‌ఖాన్‌కు అమెరికా విమానాశ్రయంలో అవమానం జరిగిందిట... దేశమంతటా ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న వార్త... గతంలో జార్జి ఫెర్నాండెజ్‌... మొన్నటికి మొన్న అబ్దుల్‌కలాం... ఇవాళ షారూఖ్‌... ఇలా మినహాయింపులకు అతీతంగా ప్రపంచ పోలీసు దాష్టీకం భారత ప్రముఖుల పట్ల తరచూ జరుగుతున్న వ్యవహారమే.. రాష్టప్రతి స్థాయి వ్యక్తికే అవమానం తప్పనప్పుడు సినీ ప్రముఖుల గురించి మాట్లాడేదేముందని ఎప్పటిలాగే ఊరుకోవలసిందేనా? ఈ అవమానాలు భరించటం ఇంకెన్నాళు్ల?
జార్జి ఫెర్నాండెజ్‌, అబ్దుల్‌కలాం... ఇప్పుడు షారూఖ్‌... అగ్రరాజ్యం అమెరికా దురహంకారానికి బలైన సమిధలు.. ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన ఈ బాలీవుడ్‌ స్టార్‌ను రెండుగంటల పాటు విమానాశ్రయంలో కూర్చోపెడితే అడిగే దిక్కులేదు.. ఎందుకు ఆపారని అడిగితే.. పేరు చివర ఖాన్‌ అని ఉండటమేనట.... పెద్దన అత్తపెత్తనానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

అమెరికాకు సేవ చేసి నాలుగు రాళు్ల సంపాదించుకుందామని అక్కడికి వెళ్లిన మనవాళు్ల... ఏదో స్వాతంత్య్రదినోత్సవం జరుపుకుందాం రమ్మని బాలీవుడ్‌ బాద్షాను పిలిపించారట... వాళు్ల పిలవగానే సంబరంగా సంబరాలు జరుపుదామని షారూక్‌ న్యూయార్‌‌క వెళ్లాడు.. న్యూయార్‌‌కలో నేవార్‌‌క అనే పేరుతో ఓ విమానాశ్రయం ఉంది. ఖాన్‌గారు వెళ్లిన విమానం అక్కడ ల్యాండ్‌ అయింది. పాపం బాద్షా తనకు గొప్ప స్వాగత సత్కారాలు లభిస్తాయని ఊహించుకుంటూ విమానం దిగారు.. దిగీ దిగగానే ఆయనకు ముందుగా దర్శనమిచ్చింది తనను పిలిచిన భారతీయులు కారు.. తనను అనుమానంతో బంధించేందుకు వచ్చిన అమెరికా పోలీసులు... విమానం దిగగానే షారూఖ్‌ను తమ కస్టడీలోకి తీసుకున్నారు... ఫోన్‌ లాగేసుకున్నారు.. ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం ఖాన్‌ది.. తనను ఎందుకు నిర్బంధిస్తున్నారని అడిగితే... పోలీసులు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? నీ పేరు చివరలో ఖాన్‌ అన్న పదం ఉంది కాబట్టి... నువ్వు టెరర్రిస్టువన్న అనుమానంతో పట్టుకున్నాం..... నవ్వాలో.. ఏడవాలో తెలియని జవాబు ఇది... టెరర్రిస్టుల్లో చాలామంది పేర్ల చివరలో ఖాన్‌ అన్న మాట వస్తుందట... షారూక్‌ ఖాన్‌ పేరులోనూ ఆ పదం ఉంది కాబట్టి ఆయన్ను పట్టుకున్నారన్నది పోలీసుల వివరణ... తాను బాలీవుడ్‌ నటుణ్ణని... ఫలానా పని మీద మీ దేశానికి వచ్చానని నెత్తీనోరూ బాదుకున్నా, బాద్షా మాట వినేదెవరు? రెండు గంటల పాటు ఇదే పరిస్థితి. చివరకు ఓ గంట పాటు ప్రాధేయపడ్డతరువాత ఫోన్‌చేసుకోవటానికి వారు కనికరించారు. ఆయన ఎంపి రాజీవ్‌ శుక్లాకు ఫోన్‌ చేసి తన గోడు వెళ్లబోసుకున్న తరువాత, శుక్లా పరిస్థితిని చక్కదిద్దడంతో వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. షారూక్‌ బతుకుజీవుడా అని బయటపడ్డాడు...
ప్రపంచ బాస్‌ తన విమానాశ్రయాల్లో, ఎయిర్‌లైన్‌‌సల్లో మన వాళ్లను పరీక్షించకపోతే ఆశ్చర్యపోవాలి కానీ, తనిఖీ చేస్తే ఆశ్చర్యమేముంది? 2001 సెప్టెంబర్‌ 11న ప్రపంచ వాణిజ్య భవన సముదాయంపై ఉగ్రవాదులు దాడి చేసినప్పటి నుంచీ అమెరికా పూనకం వచ్చినట్లు ప్రవర్తిస్తోంది. దేశంలో ఉంటున్న ముస్లింలకు ఇప్పటికే భద్రత కరవైంది. చీమ చిటుక్కుమన్నా భారత్‌ పాక్‌ పౌరులను అనుమానించే పరిస్థితి తలెత్తింది. దీని పర్యవసానమే.....భారత్‌ నుంచి వస్తున్న వారు ఎవరు, ఏమిటి అని చూడకుండా , విఐపిలను సైతం గుర్తించకుండా వారిపట్ల కించిత్‌ గౌరవం లేకుండా ప్రవర్తించటం పరిపాటిగా మారిపోయింది. 2002లో రక్షణ మంత్రిగా ఉన్న జార్జి ఫెర్నాండెజ్‌ అమెరికాకు అధికార పర్యటన పైనే వెళ్లారు.. సార్వభౌమాధికారం కలిగిన ఒక దేశ రక్షణ మంత్రి అధికారికంగా పర్యటనకు వస్తున్నప్పుడు అక్కడి ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉంటుంది. పూర్తి సమాచారంతో దై్వపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు వచ్చిన భారత సీనియర్‌ నాయకుణ్ణి డల్లాస్‌ విమానాశ్రయంలో చేతులు పైకి లేపి విచక్షణ లేకుండా పరీక్షించి మరీ విడిచిపెట్టారు. 2003లో బ్రెజిల్‌కు వెళూ్త మధ్యలో ఆగినప్పుడు కూడా ఆయన్ను చెక్‌ చేశారు.. పాపం పెద్దమనిషి అవమానంగా భావించి చాలాకాలం పాటు ఈ విషయాల్ని బయటకు చెప్పలేదు. 2004లో అమెరికా విదేశాంగ శాఖ మాజీ సహాయమంత్రి స్ట్రాబ్‌ టాల్‌బోట్‌ ఓ పుస్తకంలో రాసిన తరువాత కానీ బయటపడలేదు. అప్పటి వాజపేయి సర్కారు ఈ విషయంలో అమెరికాను పల్లెత్తు మాట అనే సాహసం చేయలేకపోయింది.
ఇక మొన్నటికి మొన్న మాజీ రాష్టప్రతి అబ్దుల్‌ కలాంకు మన దేశంలోనే, మన విమానాశ్రయంలోనే మన గడ్డపై పరాయి విమాన సంస్థ అమెరికా ఎయిర్‌లైన్‌‌స చెకింగ్‌ చేయ సాహసించటం క్షంతవ్యం కాదు.. ఈ ఏప్రిల్‌లోనే ఇది జరిగింది. కానీ మన్మోహన్‌ సర్కారుకు ఇది అవమానంగా తోచలేదు. అమెరికాలో పరీక్షించారంటే ఏదో అనుకోవచ్చు. కానీ మన గడ్డపై మన భారతరత్నాన్ని అనుమానించటాన్ని సింగ్‌ సర్కారు ఎలా భరించిందో, సహించిందో ఎంతమాత్రం అర్థం కాదు.. 2005 జనవరి 18న వైట్‌హౌస్‌లో సింగ్‌జీకి బుష్‌ సర్కారు ఎరత్రివాచీ పరచి స్వాగతించగానే, కౌగిలించుకోగానే... సింగ్‌ హృదయం మహా విశాలమైపోయింది. అప్పటి నుంచి దొరవారు చెప్పిందే వేదంగా మారిపోయింది. అణుఒప్పందంపై సంతకం పెట్టమనగానే పెట్టేశారు.. వైట్‌హౌస్‌ను విమర్శించేవారిపై విరుచుకుపడుతున్నారు. ఇక అమెరికా ఎవరికి అవమానం చేస్తే మాత్రం ఎవరు పట్టించుకుంటారు.. షారూఖ్‌ఖాన్‌ అయితే ఏం.... అబ్దుల్‌ కలాం అయితేనేం... నిలదీసే సమర్థులు లేనప్పుడు ప్రపంచ పోలీసు తన దాష్టీకాన్ని చెలాయిస్తూనే ఉంటుంది.....

14 కామెంట్‌లు:

ఫణి అనంతోజు చెప్పారు...

కుక్క కాటుకు చెప్పు దిబ్బ అని అంటూ వుంటారు. మనం కూడా తెల్లతోలు దొరలకి ఇలాంటి మర్యాదే చేస్తేకానీ వారి బుద్ది రాదు.

Sai Brahmanandam Gorti చెప్పారు...

అమెరికాని ఎంత తిడితే ఇండియాలో అంత గొప్ప. మీడియాకయితే అదో ఫ్యాషన్. ఈ తిట్టడానికీ అడ్డూ ఆపూ, అర్థం పర్థం లేకుండా ప్రతీ పత్రికా రాసేస్తున్నాయి. యధాశక్తి రచయితలూ తలో చేయి వేసి ఎడాపెడా రాసేస్తున్నారు. ఏమయ్యిందట? బాలీవుడ్ బాధుషా గార్ని ఓ గంట సేపు అమెరికా విమానాశ్రయంలో తణిఖీ చేసినందుకు యావత్తు భారతదేశమూ సిగ్గుపడుతోందని తెగ రాసేస్తున్నారు. అమెరికా దురహంకార చర్యంటూ తలా తోకా లేని కథనాలల్లేస్తున్నారు. షారూఖ్ ఖాన్ మహాశయులు ఇండియాలో బాలీవుడ్ బాదుషా అవ్వచ్చు గాక. ప్రపంచం మొత్తానికీ కాదు కదా? ఏదో గాంధీ మహాత్ముణ్ణి కించపరిచినంతగా అందరూ తెగ ఫీల్ అయిపోతున్నారు. గతంలో జార్జ్ ఫెర్నాండెజ్ కీ, కమలహాసన్ కీ, అమీర్ఖాన్ కీ ఇదే గతి పట్టిందనీ, దీనిపై ప్రభుత్వం ఏమాత్రమూ స్పందించలేదంటూ ప్రతీ ఒక్కరూ గొంతెత్తి అరుస్తున్నారు. ఈ విషయం ఇంతగా రాద్ధాంతం చేయనవసరం లేదు. ఏమయ్యింది? ఓ గంట సేపు తణిఖీ నిమిత్తమై ఆపేరు. కొంపలేమయినా అంటుకున్నాయా? లేక ఉన్న కొమ్ములు విరిగి పోయాయా? భద్రత విషయంలో ఇండియా ఎంత అప్రమత్తంగా, భాద్యతతో ఉంటుందో మనందరికీ తెలుసు. ఎన్ని బాంబింగులూ, టెర్రరిస్టు దుశ్చర్యలూ భద్రతా రాహిత్యంతో జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. నిన్న మొన్నటి ముంబయి మారణహోమం ఇంకా పచ్చిగానే ఉంది. ముందూ వెనుకా ఆలోచించకుండా పత్రికలూ ఇలా బాధ్యతా రహితంగా విరుచుపడ్డంవల్ల ఏం ప్రయోజనం? సాధారణంగా విమానాశ్రయంలో ఈ తణిఖీ చేసే వారికి రూల్సు చాలా గట్టిగా ఉంటాయి. ఆ రూస్లునతిక్రమించే సాహసం ఏ అధికారీ అమెరికాలో చెయ్యరు. ఎందుకంటే అలా చేస్తే ఆ తరువాత వారి ఉద్యోగాలకీ, జీవితాలకీ అతి పెద్ద దెబ్బ తగులుతుంది. అందువల్ల ప్రతీ అధికారీ రూల్సు ప్రకారమే పని చేస్తారు. ఎదుటి వ్యక్తి ఎవరన్నది వాళ్ళకనవసరం. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుపోతారు. ఈ కోణంలో చూస్తే విమానాశ్రయంలో తణిఖీ చేయడం తప్పేమీ కాదు. పైగా సగటు అమెరికన్ కి ప్రపంచం అంటే అంతగా అవగాహనుండదు. ముఖ్యంగా ఇండియా అంటే అస్సలు తెలీదు. ఈ మధ్య కాలంలో ఇండియన్స్ గురించి తెలిసినా, మన సినిమాలూ, రాజకీయనాయకులూ ఎవ్వరూ అస్సలు తెలీదు. కాబట్టి వచ్చింది బాలీవుడ్ బాదుషా అయినా, గ్వాలియర్ నవాబయినా వారికొక్కటే! కంప్యూటర్ లో వివరాలుండచ్చు. కానీ అన్ని వివరాలూ కంప్యూటర్ లో ఉండవు. ప్రాధమిక సమాచారం ముందుగా చూస్తారు. ఆ తరువాత అనుమానం వస్తే వివరాల్లోకి వెళతారు. కాబట్టి ఇండియాలోలాగా సదరు బాదుషా గారు ఫ్లైటు దిగగానే హారతులివ్వరు. ఇక్కడ అందరూ సమానమే! హైద్రాబాదు ఎయిరుపోర్టులోలాగా ప్రముఖుల్ని దొడ్డిదోవన పంపించేయరు. ఓ ప్రముఖనటుడి రాక ఆలస్యమయిన కారణంగా విమానాలని ఆపేసిన సంఘటనలు నా కాళ్ళారా చూసాను. హత్యలూ, మర్డుర్లు చేసిన నటకిషోరాలూ, అవినీతి కేసుల్లో ఇరుక్కున్న రాజకీయ ప్రబుద్ధులూ ఏ సెక్యూరిటీ చెక్కూ లేకుండా సొంతూరి వీధుల్లో వెళ్ళినంతగా మసలడం ఇప్పటికీ హైద్రాబాదు విమానాశ్రయంలో చూస్తూనే ఉన్నాం. చూసీ చూడనట్లుగా పట్టుచుకోకుండా గడిపేస్తున్నాం. అలా భద్రతా నిబంధనలు అతిక్రమిస్తూంటే ఏ ఒక్క పౌరుడైనా నోరిప్పి అడుగుతారా అంటే అదీ లేదు. ఈ మీడియా రచ్చ చూసి, అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వివరణిచ్చారు. షారూఖ్ ఖాన్ లగేజి అతనెక్కిన ఫ్లైటులో రాలేదనీ, అది వచ్చే వరకూ ఓ గంట సేపు ఆపామనీ చెప్పారు. ఏం మన స్మోకింగ్ బాదుషా వారు దీనికే అవమానం ఫీలయ్యారా? ఇదంతా పెద్ద ప్రచారపు స్టంటు.

విమానాశ్రయాల్లో అధికారులు రూల్సునీ, భద్రతనీ తుంగలో తొక్కి ప్రముఖుల సేవలో పునీతులవడం చూసిన మన కళ్ళకు అమెరికా అధికారులు రాక్షుల్లా కనిపించచ్చు. ముస్లిములనీ, భారతీయుల్నీ అవమానించడమే తమ ప్రథమ కర్తవ్యంగా అనిపించచ్చు. కానీ ఇది అమెరికాలో తప్పు కాదు. మైకేల్ జాక్సన్ కీ ఇలాంటివి జరిగాయి. నేను ప్రపంచమంతా ఫేమస్, నన్నే ఇలా తణిఖీ చేస్తారా అంటూ మైకేల్ జాక్సన్ ఎప్పుడూ రచ్చ కెక్కలేదు. ఎందుకంటే అతనికి అమెరికా పద్ధతులు తెలుసు. సగటు వుద్యోగి ఎలా పనిచేస్తాడో తెలుసు.
బాలీవుడు బాదుషా గారిది పెద్ద అవమానమంటూ, మన అంబికా సోనమ్మ గారు బాలీవుడ్ సినిమాలాగా "దెబ్బకు దెబ్బ" అంటూ సవాలు విసిరారు. బాదుషా గారి తోటి నటలు బ్రాడ్ పిట్ట్ కానీ, టామ్ హాంక్స్ కానీ ఇండియా వస్తే ఇంతకంటే ఘనంగా మర్యాద చెయ్యాలంటూ ఎవరికి తోచిన సలహాలు వారు విసిరేసారు. దేశమూ, భద్రతా ముందు ప్రతీ ఒక్కరూ సమానమే! బాదుషా అయినా, బండి లాక్కునే వాడయినా ప్రతీ ఒక్కరూ ఒకతే! ఇందులో ఒకరు పెద్ద, మరొకరు చినా, ఒకరు గొప్పా, వేరొకరు తక్కువా అన్న తారతమ్యం ఉండకూడదు. ఈ చిన్న విషయాన్ని విస్మరించి పుంఖాను పుంఖాలుగా ఎవరికి తోచింది వారు రాయటం వల్ల ప్రపంచానికి ఒరిగేదేమీ లేదు. అనవసర కంఠ శోష తప్ప. చేతనయితే మన విమానాశ్రయాల్లోనూ అందర్నీ సమానంగా చూడాలంటూ మీడియా ప్రభుత్వాన్ని అడగమనండి. దానివల్ల ప్రజలకీ సౌలభ్యంగా ఉంటుంది. అలాగే మన దేశ భద్రతా బాగుపడుతుంది.

చదువరి చెప్పారు...

బ్రహ్మానందం గారూ, ఈ ప్రహసనానికి సంబంధించి చివరిమాట చెప్పేసారు మీరు.

అజ్ఞాత చెప్పారు...

>>స్వాతంత్య్రదినోత్సవం జరుపుకుందాం రమ్మని బాలీవుడ్‌ బాద్షాను పిలిపించారట... వాళు్ల పిలవగానే సంబరంగా సంబరాలు జరుపుదామని షారూక్‌ న్యూయార్‌‌క వెళ్లాడు.. న్యూయార్‌‌కలో నేవార్‌‌క అనే పేరుతో ఓ విమానాశ్రయం ఉంది.

You do not even know how to pronounce "NewArk". And Newark is not in NY state. That is the first thing. SEcondly, Mr. Khan comes to USA not for celbrations but to collect money. His parties are $100 a plate affairs. So he makes quick buck in 20 days and goes back. Your ignorance shows here.

Brahmanandam garu said correctly. B garu do not argue with this guy. He picked up a few buzz words in telugu writing for eenadeu and such for a decade and argues without a reason. It is all a show or ego and lacks reasons to confront. He thinks he can write eloquently with his telugu vocabulary. If he makes mistakes he will also tell them as typos and brand you and me as 'ajnatha timira' whereas he is a learned man sitting in his own well. Great stuff. Pretty Laughable.

Sai Brahmanandam చెప్పారు...

I don't have any personal objections with Santosh Kumar. He is a very good friend of mine. But I do have objections on the topic he selected.

Santosh kumar garu, nothing personal. It is just my opinion.

-Sai Brahmanandam

Anil Dasari చెప్పారు...

మన 'బాద్షా' అమెరికా వచ్చిన అసలు కారణం త్వరలో విడుదలవనున్న అతని 'మై నేమ్ ఈజ్ ఖాన్' సినిమా ప్రమోషన్ కోసం. ఈ 'స్వతంత్ర సంబరాలు జరుపుకోవటం' అనేది కొసరు పని మాత్రమే.

'మై నేమ్ ఈజ్ ఖాన్' కథ తెలుసా మీకు? సెప్టెంబరు పదకొండు దాడుల అనంతరం అమెరికాలో ఒక భారతీయ ముస్లిం తన పేరు చివర 'ఖాన్' ఉండటమ్మూలాన ఎదుర్కొనే జాతి వివక్ష.

ఇప్పుడు - అమెరికా విమానాశ్రయంలో తన పేరు వెనక 'ఖాన్' ఉందన్న కారణంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనని రాచిరంపాన పెట్టారని షారుఖ్ గగ్గోలు పెట్టటానికీ, అతని సినిమా కథకీ, అతను అమెరికా వచ్చిన అసలు కారణానికీ లంకె పెట్టుకోండి. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని తెలుస్తుంది. అతన్ని ఆపింది 66 నిమిషాలు (అది కూడా అతని లగేజ్ తప్పిపోవటం వల్ల అని మెర్క్యురీ న్యూస్‌లో వార్త) మాత్రమేనైతే అతనేమో రెండు గంటలకి పైగా ఆపారంటున్నాడు. మరో నటుడు సల్మాన్ ఖాన్ ఒక్కడే ఈ విషయంలో పద్ధతిగా మాట్లాడాడు.

అజ్ఞాత చెప్పారు...

Even I do not have anything personal with him. In fact I was happy to start reading his blog but he started showing off after some comments and could not take it constructively. Why would I have anything personally on a person I never saw/met? Mistake is a mistake and it should be accepted when pointed out. Whether it was pointed harshly or softly. Period.

For example he wrote about jeevani. There is no other data on how to contact jeevani or its website or phone number. What good would that do for promoting jeevani?

jeevani చెప్పారు...

అజ్ఞాత గారూ జీవని గురించి పూర్తి సమాచారం కోసం దయచేసి ఈ లింకు చూడండి. ధన్యవాదాలు. http://jeevani2009.blogspot.com/

అజ్ఞాత చెప్పారు...

బ్రహ్మానందం గారికి నమస్కారాలు..
మీ సద్విమర్శకు ధన్యవాదాలు... షారూక్‌ఖాన్‌ తనిఖీ గురించి మీ అభిప్రాయాన్ని నేను పూర్తిగా గౌరవిస్తున్నా... అయితే ఇక్కడ మీడియా గగ్గోలు పెట్టడంలో అర్థం లేదన్నారు... మీ దృష్టిలో అది నిజమే కావచ్చు. షారూక్‌ అనేవాడు అమెరికాలో ఉన్నవారికి కౌన్‌కిస్కాయే... ఇందులో సందేహం లేదు. కానీ, భారత్‌కు సంబంధించినంత వరకు అతను బాలీవుడ్‌ నటుడు కాబట్టి, ఆయన స్వయంగా ఎలక్ట్రానిక్‌ మీడియా గొట్టాలతో జరిగిందంతా స్వయంగా ఫోనో ఇచ్చాడు కాబట్టి అతి చేసి ఉండవచ్చు. ఎందుకంటే మా మీడియాకు అది ఖచ్చితంగా వార్తే...ఇది ఒక పార్శ్వమే. నేను ఈ అంశాన్ని ప్రస్తావించటానికి కారణం అమెరికా ప్రత్యేకంగా భారత్‌ పట్ల అనుసరిస్తున్న తీరు మాత్రమే. ఎందుకంటే..... ఇక్కడ షారూక్‌ను తనిఖీ చేశారన్నది ఒక్క అంశమే... కానీ, ఇక్కడ అమెరికా తీరును విమర్శించడానికి హేతువు ఉన్నదని నా అభిప్రాయం. అమెరికా తనిఖీల పరంపర షారూక్‌తో మొదలు కాలేదు.. ఇక్కడితో అంతం కాదు... గతంలో జార్జిఫెర్నాండెజ్‌ను తనిఖీ చేశారు.. మొన్న మాజీ రాష్టప్రతిని ఇండియాలోనే తనిఖీ చేశారు. ఈ ఘటనలు ముఖ్యంగా గమనించాల్సినవి. మీరన్నట్లు ప్రపంచంలోని దేశాల ప్రజలందరికీ ఒకేరకమైన విదేశాంగ విధానాన్ని, ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని అమెరికా అనుసరిస్తూ ఉండి ఉంటే దాని సౌహార్ద్రాన్ని, బోల్‌‌డగా అంగీకరించటానికి ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు.. అలాంటి విధానాలను అంతా అనుసరించటం అవసరం. కానీ, అమెరికా అన్ని దేశాల నాయకుల పట్ల ఆయా దేశాల అధ్యక్షులు, కీలకమైన మంత్రుల పట్ల ఇదే విధంగా వ్యవహరిస్తుందా అన్నది మీరే చెప్పాలి. మీరన్నట్లు సామాన్యుడైనా, రారాజైనా అధికారులు ఒకే విధంగా వ్యవహరిస్తే, ఒకే రకమైన నియమాలను పాటిస్తే అంతకంటే కావలసింది ఇంకేముంది? సమస్త దేశాలూ అమెరికాను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడుస్తాయి. చీటికిమాటికి అగ్రరాజ్యాన్ని నిందించటం వల్ల భారతదేశంలో ఉన్నవారికి ఒరిగేదేమీ ఉండదు. ఇదేం సరదా కాదు.. నా దేశానికి చెందిన గొప్ప సైంటిస్టును, మాజీ రాష్ర్టపతిగా సేవలందించిన భారతరత్నాన్ని ఈ దేశ గడ్డపైనే చెక్‌ చేయటం బాధ కలిగిస్తుంది. ఇదే తనిఖీని అమెరికా అన్ని దేశాల అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల పట్ల చేస్తూ ఉంటే ఎవరూ ఏమీ అనుకోరు. ఇక రెండో విషయం.. ఇక్కడ సెక్యూరిటీ లోపాల వల్ల, అంతర్గత భద్రత బలహీనంగా ఉండటం వల్ల ఉగ్రవాదం పెచ్చరిల్లుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో మీడియా ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఉండని సందర్భం లేదు. ప్రజలు నిందించని సందర్భమూ లేదు. కునారిల్లిన రాజకీయ వ్యవస్థలో ఓటుబ్యాంకు రాజకీయాలు ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో చేవ లేని, చేతకాని పౌరుషం లేని పాలకులున్నారంటూ గతంలోనూ, ఇప్పుడూ ఎప్పుడూ మీడియా (నేను రాశానంటే అజ్ఞాత గారు నొచ్చుకుంటారేమో..మన్నించండి..) రాస్తూనే ఉంది. టైమ్‌‌స, ఎన్‌డిటివి లాంటి జాతీయ చానళ్లన్నీ దీనిపై కాంపెయిన్‌ చేశాయి. చేస్తూనే ఉన్నాయి. మీడియా చేయగలిగింది అంతే. నిర్ణయాలు తీసుకోవలసింది రాజకీయ వ్యవస్థ. దీని గురించి మీకు చెప్పతగినంతటి వాణ్ణి కాను.. జాతి వివక్ష విషయంలో అమెరికా ఎలా వ్యవహరిస్తున్నదన్నది ప్రపంచానికి తెలియని విషయమేం కాదు.. దాని లోతుపాతులను బాగా అధ్యయనం చేసినవారు మీరు. ప్రధానంగా భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాల వ్యవహారంలో అమెరికా ప్రదర్శిస్తున్న కూటనీతి తెలియనివారు కారు మీరు. మీతో వాదించగల సామర్ధ్యం లేనివాణ్ణి... మన్నించండి. నా బ్లాగ్‌ చూసి నన్ను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు.. ఇలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలు క్రమం తప్పకుండా తెలియజేస్తూ ఉండండి....మీ సూచనలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. చాలా రోజుల తరువాత ఈ విధంగా మీతో అభిప్రాయాలు పంచుకోవటం సంతోషంగా ఉంది.
చివరగా ఒక్కమాట.....
అజ్ఞాత తిమిర అంటే పేరు కాదు.... నేను రాసింది అజ్ఞాత తిమిర హరణార్థం అని.... అంటే.. అజ్ఞాతమనే చీకటిని పోగొట్టడం కోసం అని నా చిన్ని మెదడుకు తెలిసిన అర్థం. అజ్ఞాత గారు ఎంత కోపంలోనైనా మళ్లీ మళ్లీ స్పందిస్తున్నారు.. అంతకంటే సంతోషం నాకింకేముంది? తప్పును తప్పుగా ఒప్పుకోవటం అవసరమే. అందుకే టైపోను ఒప్పుకుంటూ ప్రస్తావించా.. కానీ.. అది టైపో కాదని, అది నాకు తెలియనితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి రాసానని నన్ను చూడని, నాతో మాట్లాడని వారు గ్రహించారు..... దానికి ఏం జవాబు చెప్పగలను? పోనీ నాకు తెలియని విషయాలను తెలియపరచారని సంతోషిస్తున్నా.... నా టైపోల సంగతి బ్రహ్మానందంగారికి తెలుసు కానీ, నన్ను చూడని, నాతో కలవని అజ్ఞాత గారికి మాత్రమేం తెలుసు? పేరు చెప్పకపోయినా వారికీ నా నమస్కారాలు... కృతజ్ఞతలు..
బ్రహ్మానందం గారూ.. వీరు మీకు తెలిస్తే.. నా నమస్కారాలు తెలియజేయండి!

సంతోష్‌కుమార్‌

Sai Brahmanandam చెప్పారు...

ఒక బాలీవుడ్ నటుణ్ణి నిర్భందించడానికీ, వ్యక్తులపై జాతి వివక్షత చూపించడానికీ చాలా తేడా వుంది. ఎయిర్పోర్టుల్లో ఇమ్మిగ్రేషన్ వాళ్ళు ప్రశ్నించడం మామూలు వ్యవహారమే! దాన్ని తనకేదే అవమానం జరిగినట్లుగా దుమారం పుట్టించి, జాతి వివక్షత, ముస్లిములంటే పడదూ అని చెప్పడం అన్యాయం. అమెరికా విదేశాంగ విధానం ప్రపంచానికి కొత్తేమీ కాదు. వారికి వారి స్వప్రయోజనాలే ముఖ్యం. ఏ దేశానికయినా అదే న్యాయం వర్తిస్తుంది. పాకిస్తాన్ పై ప్రేమ చూపించడాన్నీ, బాదుషా గారి నిర్భంధాన్నీ ముడేయడం సరి కాదు. ఒక చిన్న సంఘటన దేశ విదేశాంగ విధానాన్ని ప్రతిబింబించదు. జర్నలిస్టులు, మీకు నేను చెప్పేదేముంది?

అజ్ఞాత చెప్పారు...

బ్రహ్మానందం గారూ,

మీరు చెప్పినట్లు షరూఖ్ సామాన్య మానవుడే. అది అమితాబ్ ఇంకా ఎవరైనా కావచ్చు చట్టం దృష్టిలో సమానులే. షారూఖ్ విషయంలో తప్పు పట్టడం లేదు. అలాంటి వారికి ఇలా జరగాల్సిందే. తిరుమలలో ఎలాంటి రికమెండేషన్లు లేని సాధారణ వ్యక్తులు అందరి దృష్టిలో సమానం అని భావించే దేవుడిని దర్శించడానికి పడే ఇబ్బందులు చూసినపుడు ఇలాంటి కసి మాకూ ఉంది.

కానీ ఫెర్నాండెజ్, కలాం గార్ల విషయంలో అలా తీసుకోలేం కదా. అధికార హోదాలో పర్యటించిన వ్యక్తి, అదీకాక భారత ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్ళినపుడు అలా చేయడం ఏమంటారు? తప్పు కాదా? మాకైతే తెలీదు బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి వచే వారినీ ఇలాగే సోదా చేస్తారా? ఒక వేళ ప్రపంచం మొత్తానికి అమెరికా ఇలాంటి నియమాలే పాటిస్తున్నపుడు భేష్! అలాంటి ఉత్తమ వ్యవస్థను ఈ దేశ ప్రధాని అయినా రాష్ట్రపతి అయినా పాటించాల్సిందే.



షారూఖ్ విషయాన్ని భావవేశంగా తీసుకోండి. కానీ జార్జ్, కలాం గార్ల విషయంలో జరిగింది క్షమార్హం కానిది. ( కేవలం మన పట్ల మాత్రమే వివక్ష చూపి ఉంటే). మన వారి పట్ల వివక్ష చూపుతుంటే అదీ అధికార స్థాయిలో, దాన్ని విదేశాంగ విధానం కింద కాకపోయినా వారి చిన్న చూపును ప్రతిబింబించడం లేదా? అమెరికా కఠిన నిబంధనల వల్ల ముస్లిం పేరు ఉన్నవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని తరచుగా ఇక్కడ వార్తలు చూస్తుంటాము. మరి ఇందులో కూడా ఎన్ని నిజమైనవో ఎన్ని అభూత కల్పనలో మనకు తెలియదు.

ట్రేడ్ సెంటర్ దాడుల తర్వాత తమ పౌరులకు ఇస్తున్న రక్షణలో భాగంగా అమెరికా చేపట్టిన చర్యలు మంచిదే. ప్రాణం ఎవరిదైనా ఎక్కడిదైనా విలువైనదే. ఇదే లాజిక్ ప్రకారం ఆఫ్ఘనిస్థాన్ ఇరాక్ ఇంకా ఇంకా అనేక దేశాల్లో తిరుగాడే అమెరికన్ దేశీయులను ఏమి చేయాలంటారు?

ఇది మిమ్మల్ని ప్రశ్నిచడమో, మీ వ్యాఖ్యకు సమాధానంగానో దయచేసి భావించకండి ఒక భారత పౌరుడిగా నా అవేదనను మీతో పంచుకుంటున్నాను. అలా అని నేను అపర దేశ భక్తుడిని కాదు. ఇక్కడి రాజకీయ, అధికార , అవినీతి వ్యవస్థలను మీ అందరి కంటే ఎక్కువగా అసహ్యించుకుంటాను. కానీ అమెరికా రక్త చరిత్ర, యుద్ధోన్మాదం వల్ల నేలరాలిన లక్షలాది ఇరాకీ పసి కుసుమాలు గుర్తుకొచ్చినపుడల్లా అమెరికా దురహంకారంపై మనసు రగులుతూ ఉంటుంది. ఇలాంటివి జరిగినపుడు చిన్న విషయాలైనా అది మరింత మండిపోతుంది అంతే!

శ్మశానంలో తప్ప మరెక్కడా సమానత్వంలేని ఈ దేశం నుంచి షారుఖ్ లాంటి వాళ్ళను అమెరికా వచ్చినపుడు నిజంగానే వేధించాలి మా ఈగో కచ్చితంగా తృప్తి చెందుతుంది.

మంచు చెప్పారు...

సంతోష్‌కుమార్‌ గారు..
మీరు రెండు విషయాలు టచ్ చెస్తున్నారు. షారూక్ విషయం లొ నేను బ్రహ్మానందం గారితొ పూర్తిగా ఎకీబవించినా, జార్జ్, కలాం గార్ల విషయంలో మీరు చెప్పిందాంట్లొ తప్పులేదు. నా అభిప్రాయం ఎమిటంటే, జార్జ్, కలాం గార్లు ఎమయినా క్రైం కమిట్ చెస్తే భారత ప్రభుత్వం బాద్యత వహిస్తుంది. సొ అమెరికా 'జార్జ్, కలాం లనీ నమ్మడం అంటె భారత్ ని నమ్మడం ..ఎందుకంటె వాళ్ళు ప్రభుత్వ ప్రతినిదులు . షారుక్ వెళ్ళింది తన పర్సనల్ బిజినస్ పనిమీద. రెంటికి చాలా తేడావుంది.

ఇక పొతె నేను ' అమెరికా రక్త చరిత్ర, యుద్ధోన్మాదం వల్ల నేలరాలిన లక్షలాది ఇరాకీ పసి కుసుమాలు' గురించి కన్నా.. 'చెతకానితనం ,ఓటుబ్యాంకు రాజకీయాలు, వల్ల మన సొంత దెశం లొ నేలరాలి పొతున్న వందలాది సొదరులు ' గురించి యెక్కువ అలొచిస్తుంటా.. మీరు జర్నలిస్ట్ కాబట్టి అన్నీ కవర్ చెయ్యలి అనుకొండి.

గత 20 సంవత్సరాలలొ అమెరికా మీద ప్రత్యక్షంగా (అమెరికా లొను , బయట ) దాడి జరిపిన టెర్రరిస్ట్ లు అందరూ ముస్లిం పేర్లు కలిగి వున్నప్పుడు , ముస్లిం పేర్లు వున్నవారితొ వారు కొద్ది జాగ్రత్త గా వుండటం లొ ఎదయినా తప్పు వుందంటారా ? మనలా వాళ్ళకి ఓటుబ్యాంకు రాజకీయాలు లేవుగా.. ఇంకొ విషయం ఒక్కసారి అమెరికా లొ ఎంటర్ అయ్యాక ఎవ్వరు యే వివక్ష కి గురికారు. అన్ని అవకాశాలు అమెరికన్స్ తొ సమానం గా అందరికి వుంటాయి.

kovela santosh kumar చెప్పారు...

మంచు గారూ..
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు... మొదటగా చెప్పాల్సింది మీ పైనున్న కామెంట్‌ నాది కాదు.. మరెవరో రాసింది....
ఇక ఈ చర్చంతా షారూక్‌ ఖాన్‌ చుట్టూరానే తిరుగుతోంది తప్ప అసలు విషయాన్ని పక్కన పెట్టేసింది. ఇక్కడ షారూక్‌ ఖాన్‌ చిన్న విషయం మాత్రమే.... ఈ సందర్భంగా అమెరికా భారత్‌ పట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తున్నామంతే... ఇది చాలా స్పష్టం. మరోసారి స్పష్టంగా చెప్తున్నా... షారూక్‌ను నిర్బంధించారన్నది ప్రధాన విషయం కానే కాదు.... భారత ప్రభుత్వ ప్రతినిధుల పట్ల కూడా దుర్వ్యవహారం చేయటం వల్లనే అమెరికాను ప్రశ్నించాల్సి వస్తున్నది. భారత్‌లో అనేక రకాల సమస్యలు ఉండవచ్చు. భారత్‌లో కుళు్ల రాజకీయాలు ఉండవచ్చు. భారత్‌లో టెరర్రిజం పట్ల నిర్లక్ష్య ధోరణి ఉండవచ్చు. భారత్‌లో ఆర్థిక అసమానతలు ఉండవచ్చు. భారత్‌లో పేద ఆటోవాడు నాలుగు పైసలు ఎక్కువ సంపాదించటం కోసం విదేశీ ప్రయాణికులను నాలుగు కిలోమీటర్లు ఎక్కువ తిప్పవచ్చు. భారత్‌లో అవినీతి ఉండవచ్చు. బ్లాక్‌ మనీ ఉండవచ్చు. అంతమాత్రాన సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా? ఇవన్నీ అంతర్గత సమస్యలు.. కానీ, భారత రాష్టప్రతిగా వ్యవహరించిన పెద్ద మనిషిని భారత గడ్డపైనే అవమానించటం ఏ విధంగా సమర్థనీయం... దేశ రక్షణ మంత్రి హోదాలో దై్వపాక్షిక సంబంధాలపై చర్చించటం కోసం అమెరికా ఆహ్వానం మేరకే వచ్చిన కేబినెట్‌ మంత్రిని సోదా చేయటం ఎంతవరకు సమర్థనీయం? ఈ సంగతులను ప్రస్తావించకుండా, కేవలం షారూక్‌ ఖాన్‌ విషయాన్ని మాత్రమే ప్రస్తావించి, మిగతా అంశాల జోలికి పోకుండా... వాటిని కావాలని ఇగ్నోర్‌ చేసే విధానం ఎంతవరకు మంచిదంటారు? ఏ బ్రిటన్‌ మంత్రినో.. ఆస్ట్రేలియా ప్రధానినో అమెరికా విమానాశ్రయంలో నిలబెట్టి చెక్‌ చేస్తుందా? మీరంతా అక్కడున్న పెద్దలు... అమెరికా గొప్పతనాన్ని, ఔదార్యాన్ని కళ్లారా చూస్తూ, అనుభవిస్తూ ఉన్నవారు.. మీకే తెలియాలి... షారూక్‌ను చెక్‌ చేసినా, అమితాబ్‌ను చెక్‌ చేసినా మాకు అభ్యంతరం లేదు.. ఈ ధోరణి ఇలాంటి వారికే పరిమితం కాలేదు.. కోట్లాది భారత ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల పట్ల కూడా జరిగింది కాబట్టే అమెరికాను ప్రశ్నిస్తున్నామన్న సంగతి గ్రహిస్తే చాలు... సంతోషం...
సంతోష్‌కుమార్‌

మంచు చెప్పారు...

పైన ఒక కామెంట్ లొ అజ్ఞాత అని వుండి కింద సంతొష్ కుమార్ అని వుండటం, తరువాత అజ్ఞాత కామెంట్ లొ 'సంతొష్ కుమార్' అని లేక పొయినా ..రానిన కామెంట్ లొ బాషమీద పట్టు చూసి మీరె అని పొరబాటు పడ్డా..
నేను ముందు కామెంట్ లొ చెప్పినట్టు , మన దెశ ప్రతినుధుల విషయం లొ మీతొ నేను ఎకీభవిస్తున్నా..
wrong time లొ ఈ పొస్ట్ రావడం వల్ల టాపిక్ అంతా షారుక్ మీదకు పొయె అనవసరం గా టాపిక్ వెరె దారికి పొయింది.
Anyway.. I read all your posts.. Good work ..