26, ఆగస్టు 2009, బుధవారం

దిక్కులేని దేవుడు.....part - 1

మన రాష్ట్రంలో దేవుడికి ఆస్తులు ఎన్నో... అవస్థలు అన్ని... రాజుల సొము్మ రాళ్లపాలని ఎవరో స్పష్టంగానే అన్నారు కానీ, దేవుడి సొము్మ ఎవరిపాలవుతుందనేది సాక్షాత్తూ దేవుడికే తెలియదు... తిరుపతిలో ఓ అర్చకుడు ఏ అవసరార్థమో దేవుడి నగలను తాకట్టు పెట్టి ఉండవచ్చు గాక.. ఆ అర్చకుడు చేసింది తప్పే కావచ్చు. దాన్ని ఎవరూ సమర్థించరు.. కానీ, రాష్ట్ర బడ్జెట్‌ స్థాయిలో విలువ కలిగిన శ్రీవారి నగలకు తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర సర్కారు ఎంతవరకు రక్షణ నిస్తోంది... ఇవాళ అర్చకులను నిందించటం కాదు.. ఇంతకాలంగా అక్కడ చోటు చేసుకుంటున్న అవినీతికి, నగలు, డాలర్లు మాయమయ్యాయన్న ఆరోపణలకు ఎవరు జవాబుదారి?

వారం రోజుల క్రితం తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో అర్భకుడైన ప్రధానార్చకుడు స్వామి వారి నగలను ప్రైవేటు వడ్డీవ్యాపారి దగ్గర తాకట్టు పెట్టి అవసరార్థం అప్పు తీసుకున్నాడన్న వార్త సంచలనం సృష్టించింది. దేవుడి నగలను ఎవరికి తోచినట్లు వాళు్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే దేవస్థాన యాజమాన్యం... దాన్ని నియంత్రిస్తున్న సర్కారు నీరో చక్రవర్తిలా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నాయి.
అక్షరాలా యాభైవేల రూపాయల కోసం తిరుపతి కోదండరామస్వామి ఆలయ పూజారి చిన్న వెంకటరమణ దీక్షితులు ఖరీదైన రాముల వారి నగల్ని దాదాపు కిలోన్నర విలువ కలిగేవి కుదువ పెట్టేశాడు.. కుటుంబ అవసరం కోసం వడ్డీవ్యాపారి నుంచి అప్పు చేశాడు.. అప్పు తీర్చేసి నగల్ని యథాతథ స్థితిలో తిరిగి చేర్చాలనుకున్నాడు.. కానీ, ఈలోగానే ఉపద్రవం వచ్చిపడింది. తిరుమల శ్రీవారితో పాటు, టిటిడి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న ఆలయాల్లో ఉన్న బంగారు, వెండి, ఇతర ఆభరణాల వివరాలన్నీ లెక్కలు గట్టి చెప్పాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించటంతో , తనిఖీ ప్రారంభించిన అధికారులకు బండారం బయటపడింది. ఇక హడావుడి అంతాఇంతా కాదు.. రమణదీక్షితులు దంపతులను అరెస్టు చేయడం, వడ్డీవ్యాపారిని అరెస్టు చేయటం, తాకట్టు పెట్టిన నగలను స్వాధీనం చేసుకోవటం చకచకా జరిగిపోయాయి. నిందితులు నేరాన్ని ఒప్పుకోవటమూ జరిగిపోయింది.
నిందితులపైనైతే కేసు నమోదు చేశారు.. కానీ, ఇంతటితో వివాదం ముగిసినట్లేనా? తిరుమల శ్రీవారి నగల భద్రత సమస్య తీరినట్లేనా? వాస్తవం ఏమిటి? రమణ దీక్షితులు ఓ చిన్న చేప మాత్రమే. తిరుమలలో పెద్ద పెద్ద తిమింగళాలే ఉన్నాయి. సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామికి సైతం అంతుపట్టని పెద్దలు వాళు్ల... ఒంటి నిండా ఊర్ధ్వపుండ్రాలు ధరించి పట్టువసా్తల్రు ధరించి నిత్యం స్వామి పక్కనే ఉంటూ భజనలు చేస్తూ, పూజలు నిర్వహిస్తూనే భక్తులతో పాటు శ్రీవారికే శఠగోపం పెట్టే ప్రబుద్ధులు ఉన్నారు. ఆలయంలో అవినీతి గురించి చాలాకాలంగా, చాలా సందర్భాల్లో అవినీతి వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. కానీ, దీన్ని అరికట్టే బాధ్యత వహించేదెవరు? దేవుని గోడు పట్టించుకునేదెవరు?
నాలుగేళ్ల క్రితం శ్రీవారి ఆలయంలో భక్తులకు పంపిణీ చేసే బంగారు డాలర్లు మాయమైపోయాయన్న ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. మూడు వందల అయిదు డాలర్లు మాయమయిన కుంభకోణంలో దానికి ఇంచార్జిగా ఉన్న డాలర్‌ శేషాద్రిని సస్పెండ్‌ చేశారు.. మరో నలుగురు ఉద్యోగులనూ సస్పెండ్‌ చేశారు.. దీంతో ఆయనపై టిటిడి విచారణ జరిపిస్తుందని, అంతా చక్కదిద్దుతుందని అంతా భావించారు. కానీ, శేషాద్రి సస్పెన్షన్‌ అంతా ఓ డ్రామా అని కొద్దిరోజుల్లోనే తేలిపోయింది. నెలలు కూడా గడవక ముందే శేషాద్రిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు.2006లో మళ్లీ అదే పోస్టులో నియమించటం వెనుక మతలబు ఏమిటి?
గమ్మత్తేమిటంటే శేషాద్రి ఉద్యోగిగా రిటైర్‌ అయి చాలా కాలమైపోయింది. టిటిడి యాజమాన్యం ప్రత్యేక తీర్మానంతో ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీగా ఆయన్ను అందలం ఎక్కించింది. శ్రీవారి భాండాగారానికి సంబంధించిన రెండు తాళాలూ డాలర్‌ శేషాద్రి దగ్గరే ఉండటం అన్నింటికంటే మరో విచిత్రం. మామూలుగా ఏ చిన్న బ్యాంకులోనైనా స్ట్రాంగ్‌రూమ్‌ తాళాల్లో ఒకటి క్యాషియర్‌ దగ్గర, మరొకటి మేనేజర్‌ దగ్గర ఉంటాయి.. కానీ, తిరుమలలో డాలర్‌ శేషాద్రే శ్రీవారికి సర్వ రక్షకుడు... ఆయన చెప్పిందే వేదం... ఉన్న బంగారాన్ని కరిగించి భక్తులకు విక్రయించటానికి పూనుకోవటంలోనూ ఆయన పాత్ర ప్రశ్నార్థకమైంది. డాలర్‌ స్కాంకు అదే మూలం... అన్ని నిబంధనలకు అతీతంగా వెల కట్టలేని విలువైన నగల రక్షణ భారం ఒక్కరి చేతులో ఎలా పెట్టారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.. ఇప్పటికిప్పుడు శేషాద్రి మీడియా ముందుకు వచ్చి కంటనీరు పెట్టుకుంటున్నారు. తాను ఏ పాపం ఎరుగనని అంటున్నారు. 2006 నుంచి తన దగ్గర రెండు తాళాలు లేవంటున్నారు. కానీ, డాలర్ల స్కాం బయటపడినప్పుడు జరిపిన విచారణ తరువాత అధికారులు సమర్పించిన నివేదిక విస్పష్టంగా ఆయన దగ్గరే రెండు తాళాలు ఉన్నాయని పేర్కొంది. ఆయన నిజాయితీపరుడే అయితే, నిబద్దతే కలిగి ఉంటే.. విలువలకు కట్టుబడి ఉండేవాడే అయితే రెండు తాళాలు ఎందుకు తన దగ్గరే ఉంచుకున్నారు? ఎంత సమర్థుడైనా సరే లాకర్‌ కీస్‌ ఒకే వ్యక్తి దగ్గర ఏ నిబంధన ప్రకారం ఉంచారు. అన్నింటికీ మించి ఒక పదవీ విరమణ చేసిన ఉద్యోగిని ఇంతకాలం కొనసాగించాల్సిన అవసరం ఏమి వచ్చింది? మరో సమర్థుడైన అధికారి టిటిడిలో లేనే లేరా? ఒకవేళ తీసుకున్నా, శ్రీవారి ఖజానా బాధ్యతను రిటైరైన ఉద్యోగి చేతుల్లో ఏ ప్రాతిపదికన పెట్టారు...? ఈ వ్యవహారాన్ని తేల్చకుండా అర్భకుడైన అర్చకుడి చిన్న తప్పును భూతద్దంలో చూపించి మిగతావన్నీ కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించటం క్షంతవ్యం కాదు..

కామెంట్‌లు లేవు: