16, డిసెంబర్ 2009, బుధవారం

కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..

కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాలతో నిట్టనిలువునా చీలిపోయిన పరిస్థితిని చక్కబెట్టుకోవటం తెలియని ఒకరకమైన అయోమయం కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. అధిష్ఠానాన్ని, అమ్మను ధిక్కరించటం కలలో కూడా ఊహించని పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి..
దక్షిణ భారత దేశంలో ముపై్ఫ ముగ్గురు పార్లమెంటు సభ్యులను గెలిపించుకున్న ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీలో ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించటమా? అధిష్ఠానమే సర్వాంతర్యామిగా రాజకీయాలు సాగే కాంగ్రెస్‌ పార్టీలో అది సాధ్యమేనా? కానీ, ఇప్పుడు జరిగింది, జరుగుతున్నదీ అదే...
ఇప్పుడు కాంగ్రెస్‌ ఏం చేస్తుంది.. ఎలాంటి వూ్యహం రచిస్తుంది? అన్నది ఇప్పటికైతే తేలలేదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని తాను విస్పష్టంగా చేసిన ప్రకటన నుంచి వెనక్కి వెళ్లే అవకాశం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే ఇంతకాలం ఎలాంటి ప్రకటన చేయని కాంగ్రెస్‌ కేవలం పదకొండు రోజుల ఉద్యమానికే తలొగ్గిందా? లేక కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రకటన వెనుక వేరే మతలబు దాగి ఉందా? ఆలోచించటం అవసరం.. కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం జాతీయ రాజకీయ సమీకరణాలకు, ప్రయోజనాలకు భిన్నంగా ఎలాంటి చర్యా తీసుకోదు.. ఎంతో లోతుగా సమీకరణాలను అంచనా వేసుకుని కానీ ఒక నిర్ణయానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం రాదు..

పార్లమెంటులో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల సమక్షంలోనే సీమాంధ్ర ఎంపిల సమైక్యాంధ్ర, తెలంగాణ నాయకుల తెలంగాణ నినాదాలు ఒక విధంగా సోనియా గాంధీ నాయకత్వాన్ని సూటిగానే ప్రశ్నించాయి. తెలంగాణ ఏర్పాటు ప్రకటన వెలువడేంత వరకు అమ్మను దేవతగా స్తుతించిన గొంతుల్లో.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పచ్చ జెండా ఊపడంతోనే పచ్చి వెలక్కాయపడింది. అమ్మను నిందించకుండా, ధిక్కారం అన్న పేరు లేకుండా.. తెలంగాణ నిర్ణయాన్ని కాదనకుండానే కాదనటం కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం కలలో కూడా ఊహించి ఉండదు.... కాంగ్రెస్‌ అధినేత్రి నిర్ణయాన్ని తాము తప్పుపట్టడం లేదంటూనే, మమ్మల్ని సంప్రతించకుండానే నిర్ణయించటం సరికాదంటూ.. సమైక్యంగానే మనం అంతా కలిసిమెలిసి ఉండాలంటూ రాజీనామా కాగితాలను పుంఖానుపుంఖాలుగా సమర్పించటం, ఆందోళన పథం పట్టడం అధిష్టానాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసింది.
నిన్నటిదాకా మౌనంగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా ఒత్తిడి రాజకీయాలకు తలొగ్గాల్సి వచ్చింది. ఆయన, ఆయన బాబాయి ఇద్దరూ యునైటెడ్‌ ఆంధ్రకు మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించటం విశేషం.. కాంగ్రెస్‌ ఎంపిలు లేని సమయంలో తెలుగుదేశం ఎంపిలతో జగన్‌ అంటకాగాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్‌ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు.. ఈ పరిణామానికి జగన్‌ కూడా కొంత కన్ఫూ్యస్‌ అయినట్లు కనిపించారు.. తాను చేసిన పనికి ఆయన సుదీర్ఘ వివరణే ఇచ్చుకోవలసి వచ్చింది. యునైటెడ్‌ ఆంధ్రప్రదేశ్‌ కావాలంటూనే, సువర్ణ తెలంగాణ కావాలని జగన్‌ మాట్లాడటం సందిగ్ధతకు ఉదాహరణ.. నిన్నటిదాకా ఆయన వెంట, ఆయన వర్గంగా ముద్ర వేయించుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ ప్రతినిధులకు విస్మయం కలిగించింది. ఇప్పుడు తాము జగన్‌కు అనుకూలంగా ఉండాలా? తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాలా? వారికి అర్థం కావటం లేదు.. జగన్‌ వర్గంగా ముద్రపడ్డ దానం నాగేందర్‌ లోక్‌సభలో జరిగిన వ్యవహారంతో తనకేం సంబంధం లేదని తప్పించుకున్నారు.. జీవన్‌ రెడ్డి మాత్రం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బతికి ఉంటే అధిష్ఠానం మాటను ధిక్కరించేవారు కాదని కొత్త భాష్యం చెప్పుకొచ్చారు..ఆయన జీవించి ఉంటే ఈ స్థాయిలో ఉద్యమాలు జరిగేవా అన్నది వేరే సంగతి అనుకోండి...
సాధారణ సమయాల్లో అధిష్ఠానం మాటను వేదవాక్కుగా స్వీకరించే ప్రతినిధులు ఒక్కసారిగా తిరగబడటం అధిష్ఠానానికి మింగుడుపడటం లేదు.. అలా అని పూర్తిగా వారి వాదనను తిరస్కరించి ఏకపక్షంగా ముందుకు వెళ్లే పరిస్థితీ లేదు.. ఇప్పుడు ఎలా పరిష్కరించాలన్నది కేంద్ర నాయకత్వానికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. అందుకే కర్ర విరక్కుండా, పాము చావకుండా అన్నట్లుగా ప్రకటనలు ఇస్తోంది. మొన్న ప్రణబ్‌ ముఖర్జీ చేత... నిన్న షకీల్‌ అహ్మద్‌ల చేత ప్రకటనలు వచ్చాయి. ఇవాళ పార్లమెంటులో ఆందోళనల కారణంగా ఏకంగా కేంద్ర కేబినెట్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై ఏం చేయాలో ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. చివరకు ప్రధానమంత్రి పేరు మీద శాంతంగా ఉండండి.. మేమంతా గమనిస్తున్నాం.. పరిష్కారాన్ని ఆలోచిస్తామంటూ స్పష్టత లేని ఓ ప్రకటనను వెలిబుచ్చారు..
ఇప్పుడు కాంగ్రెస్‌ ఏం చేస్తుంది.. ఎలాంటి వూ్యహం రచిస్తుంది? అన్నది ఇప్పటికైతే తేలలేదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని తాను విస్పష్టంగా చేసిన ప్రకటన నుంచి వెనక్కి వెళ్లే అవకాశం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే ఇంతకాలం ఎలాంటి ప్రకటన చేయని కాంగ్రెస్‌ కేవలం పదకొండు రోజుల ఉద్యమానికే తలొగ్గిందా? లేక కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రకటన వెనుక వేరే మతలబు దాగి ఉందా? ఆలోచించటం అవసరం.. కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం జాతీయ రాజకీయ సమీకరణాలకు, ప్రయోజనాలకు భిన్నంగా ఎలాంటి చర్యా తీసుకోదు.. ఎంతో లోతుగా సమీకరణాలను అంచనా వేసుకుని కానీ ఒక నిర్ణయానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం రాదు..
మొన్న ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సొంతంగా 200 మార్‌‌కను దాటింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మొత్తం 206 సీట్లు వచ్చాయి. లోక్‌సభలో మ్యాజిక్‌ ఫిగర్‌కు కేవలం 66 సీట్లు తక్కువ పడ్డాయి. 240 సీట్లతోనే మైనార్టీ ప్రభుత్వాన్ని సింగిల్‌ పార్టీతో నడిపించిన ఘనత కాంగ్రెస్‌ది.(పివి హయాంలో.) ఇప్పుడు 2014లో సంకీర్ణ శకానికి స్వస్తి చెప్పి సొంతంగా సింపుల్‌ మెజారిటీ సాధించే దిశగా కాంగ్రెస్‌ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. దీనికి మించి మరో ఏడాది కాలంలో రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ ప్రధానమంత్రి అభ్యర్థిగా రంగం పైకి వచ్చే సూచనలను కాంగ్రెస్‌ నాయకత్వమే స్పష్టంగా పంపిస్తోంది. ఈ పరిస్థితికి ఊతమిచ్చినట్లు 2009 పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు అన్ని రాషా్టల్ల్రో గుజరాత్‌, యుపి, బీహార్‌, బెంగాల్‌ లతో సహా కాంగ్రెస్‌ తన వ్యక్తిగత బలాన్ని గణనీయంగా పెంచుకుంది. మరో పక్క విపక్షాలూ చాలా బలహీనంగా ఉన్నాయి. భారతీయ జనతాపార్టీకి నాయకత్వమే కరవైపోయింది. సమీప భవిష్యత్తులో బిజెపి పుంజుకోవటానికి పెద్దగా ఉపకరించే అంశాలూ లేవు. రాహుల్‌ను ప్రొజెక్టు చేయటానికి, కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావటానికి ఇదే మంచి తరుణం... ఇందుకోసం తన ముందుండే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకునేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా లేదు. అందులో దక్షిణ భారత దేశంలో తాను అత్యంత బలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న బలం తగ్గితే పార్టీకి జాతీయ స్థాయిలో అపార నష్టం కలగటమే కాదు.. తన ప్రధాన లక్ష్యానికి విఘాతం కలిగే ప్రమాదమూ లేకపోలేదు.. వైఎస్‌ మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిందనటం నిర్వివాదం.. గ్రేటర్‌ ఎన్నికల్లో మేయర్‌ సీటు దక్కించుకున్నా.. శాసనసభ ఎన్నికల నాటి బలాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే 2014 తనకు అధికారం దక్కటం ఖాయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ధీమాగా ఉన్నారు.. పరిస్థితిని ఎలా అనుకూలం చేసుకోవాలా అని తల పట్టుకున్న కాంగ్రెస్‌ అధిష్ఠానానికి కెసిఆర్‌ నిరాహార దీక్ష అనుకోని అవకాశాన్ని బంగరు పళ్లెంలో తెచ్చిచ్చినట్లయింది. ఎలాగూ చాలా కాలం నుంచి తెలంగాణ డిమాండ్‌ ఉంది. ఇప్పుడు తెలంగాణకు ఓకె అన్నట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న పదిహేడు లోక్‌సభ సీట్లను పూర్తిగా స్వీప్‌ చేసే అవకాశాలుంటాయి. తెలంగాణ ఇస్తే సోనియా గాంధీకి పూజలు చేసి మరీ కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కెసిఆర్‌ ఎలాగూ అండగా ఉంటారు.. పదిహేను సీట్లు వచ్చినా ప్రస్తుతం ఉన్న 33లో దాదాపు సగం కాపాడుకున్నట్లే అవుతుంది. రాష్ట్రంలో 35 శాతం ఓట్లను కాంగ్రెస్‌ మొన్న గెలుచుకుంది. ఇందులో ఎంత వరకు నష్టపోతారన్నది ప్రత్యర్థుల బలంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పరిణామాల్లో మొదటగా వీక్‌ అయింది తెలుగుదేశం పార్టీయే... చంద్రబాబును జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోమ్మనేంతగా తెలుగు తము్మళు్ల స్వరం పెంచారంటేనే చంద్రబాబు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో పురంధరేశ్వరిని ప్రొజెక్టు చేయగలిగితే, చంద్రబాబును మరింత బలహీనం చేయవచ్చు.. ఎలాగూ ఆమెకు క్లీన్‌ ఇమేజి ఉంది.. ఎన్టీయార్‌ కుమార్తె.. కులం లాబీ పని చేస్తుంది. మహిళ.. ఇన్ని క్వాలిఫికేషన్‌‌స ఆమెను ప్రొజెక్‌‌ట చేసేందుకు ఉపకరిస్తాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. అటు తెలంగాణలో దళిత్‌, మహిళ, రెడ్డి కాంబినేషన్‌లో ఉన్న గీతారెడ్డి తెరముందుకు రావచ్చు. లేకుంటే జయపాల్‌రెడ్డి ఎలాగూ ఉంటారు. ఈ సమీకరణాలను అనుసరించి ఆంధ్ర ప్రాంతంలోని 25 పార్లమెంటు సీట్లలో సగంలో సగం... అంటే ఏ ఏడెనిమిది గెల్చుకోగలిగినా లోక్‌సభలో బలం 25 మినిమం గ్యారంటీ ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న బలంలో అయిదారు సీట్లకు మించి తగ్గదు.. ఈ రకమైన అంచనాలు, సమీకరణాల వల్లనే కాంగ్రెస్‌ తెలంగాణకు సై అని ఉండవచ్చు. అంతకు మించి తెలంగాణలో సెంటిమెంటు ఉన్నదనో.. తెలంగాణపై రాత్రికి రాత్రి ప్రేమ పుట్టడం వల్లనో కాంగ్రెస్‌ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోదు.. ఎందుకంటే భారత రాజకీయ వ్యవస్థ పునాదులు ఓట్ల సమీకరణాలపైనే ఆధారపడి ఉన్నాయి. రాజకీయ ప్రక్రియ ప్రకారం అధికార పార్టీలు తీసుకునే ప్రతి నిర్ణయం భావి రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తీసుకుంటాయి. నాడు బిజెపి అయినా, నేడు కాంగ్రెస్‌ అయినా ఒక తాను ముక్కలే.. తనకు ప్రయోజనం కలగని పక్షంలో ఏ రాజకీయ పార్టీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోదు.. ఇది నిర్వివాదం... మన రాజకీయ వ్యవస్థలోని మౌలిక లక్షణమే అది.

1 కామెంట్‌:

శరత్ కాలమ్ చెప్పారు...

"యునైటెడ్‌ ఆంధ్రప్రదేశ్‌ కావాలంటూనే, సువర్ణ తెలంగాణ కావాలని జగన్‌ మాట్లాడటం సందిగ్ధతకు ఉదాహరణ.."

జగన్ అన్న మాటలో సందిగ్దం ఏం వుంది? మీలో వుంది సందిగ్దం, తనలో కాదు.